– ఇవి ముమ్మాటికీ రాష్ట్ర ప్రభుత్వం చేసిన హత్యలే
– 48 గంటలుగా మోగుతున్న మరణమృదంగానికి ముఖ్యమంత్రిదే పూర్తి బాధ్యత
– ఈ విపత్కర పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్రంలో వెంటనే వ్యవసాయ ఎమర్జెన్సీ ప్రకటించాలి
– ఎక్స్ వేదికగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శలు
హైదరాబాద్: కేవలం రెండు రోజుల వ్యవధిలో రాష్ట్రవ్యాప్తంగా ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా ఏడుగురు రైతులు అప్పుల బాధతో ఆత్మహత్యలు చేసుకోవడం, ఎండుతున్న పంటలు కాపాడుకోలేక గుండెపోటుకు గురై అన్నదాతలు మరణించడం అత్యంత విషాదకరం.
వ్యవసాయరంగంలో మోగుతున్నఈ చావుడప్పుకు చేతకాని రేవంత్ రెడ్డి పాలనే ప్రధాన కారణం. ఇవి ముమ్మాటికీ రాష్ట్ర ప్రభుత్వం చేసిన హత్యలే. రాష్ట్ర నలుమూలలా లక్షలాది ఎకరాల్లో పంటలు ఎండుతున్నా ముఖ్యమంత్రిలో కనీసం చలనం లేదు. పీకల్లోతు సంక్షోభంలో కూరుకుపోయిన అన్నదాతను కాపాడాలన్న సోయి రాష్ట్రప్రభుత్వంలో అరశాతం కూడా కనిపించడం లేదు.
రైతులకు ధైర్యం చెప్పాల్సిందిపోయి, దద్దమ్మ కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన కరువును కాలం తెచ్చిన కరువుగా చిత్రీకరించే కుట్రల వల్ల అన్నదాతల మనోస్థయిర్యం మరింత దెబ్బతింటోంది. వ్యవసాయ రంగాన్ని పట్టిపీడిస్తున్న ఈ విపత్కర పరిస్థితుల నేపథ్యంలో, రాష్ట్రంలో వెంటనే వ్యవసాయ ఎమర్జెన్సీని ప్రకటించాలి.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన అసమర్థతను ఒప్పుకుని, రాష్ట్రంలో ఇప్పటిదాకా జరిగిన దాదాపు 440 మంది రైతుల మరణాలకు పూర్తి బాధ్యత వహించాలి. అప్పుల ఊబిలో పూర్తిగా కూరుకుపోయి ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను కష్టాల కడలి నుంచి ఇకనైనా గట్టెక్కించేందుకు ప్రభుత్వం స్పెషల్ ప్యాకేజీ ప్రకటించాలి.
పదేళ్లు పండగలా సాగిన వ్యవసాయాన్ని 14 నెలల్లో పాతాళంలోకి నెట్టి ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో మునిగి తేలుతున్న ముఖ్యమంత్రి తన పరిపాలనా వైఫల్యానికి క్షమాపణలు చెప్పి ముక్కు నేలకు రాయాలి. పనికిరాని ప్రభుత్వాన్ని తెలంగాణ ప్రజల నెత్తిన రుద్ది, ఏడాది కాలంగా పత్తా లేకుండా పోయిన రాహుల్ గాంధీ, తెలంగాణలో ప్రమాదకరసంఖ్యలో జరుగుతున్న అన్నదాతల ఆత్మహత్యలపై వెంటనే స్పందించాలి.
రుణమాఫీ పేరిట రేవంత్ రెడ్డి చేసిన మోసం చాలదన్నట్టు, పెట్టుబడి సాయానికి కూడా పాతరేయడంతోనే తెలంగాణ వ్యాప్తంగా రైతులు దిక్కుతోచని పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. కాళేశ్వరంపై కక్షగట్టి, లేని సాగునీటి సంక్షోభాన్ని సృష్టించడం వల్లే రాష్ట్రంలో భూగర్భజలాలు పాతాళంలోకి పడిపోయాయి. రాజకీయ ప్రతీకారాలకు రైతులను బలిచేస్తూ ముఖ్యమంత్రి క్షమించరాని పాపం చేస్తున్నారు. తెలంగాణ రైతుల ఆర్థనాదాలను పట్టించుకోని కాంగ్రెస్ పార్టీకి ఈ గడ్డపై ఇక నూకలు చెల్లినట్టే..