Suryaa.co.in

Telangana

90 కోట్లు ఖర్చు పెట్టించారని చిన్నారెడ్డే చెప్పారు!

– మరి మీ ఈసీలు, ఈడీలు, ఐటీలు ఎటు పాయె?
– కృష్ణా జలాల విషయంలో అన్యాయం
– ఎన్డీఎస్ఏ ఎందుకు విచారణ చేపట్టడం లేదు?
– కాళేశ్వరం విషయంలో ఈ ప్రకృతి విపత్తు ఎక్కడికి పోయింది?
– ప్రజలు ఎల్ ఆర్ ఎస్ కట్టకండి
– రేవంత్ .. మిస్కౌంట్ ముఖ్యమంత్రిగా మిగిలిపోతావు
– కాంగ్రెస్ వాళ్లు సేల్స్ మెన్లుగా తయారయ్యారు
– ప్రజల మూలుగులు పీలుస్తున్న బిజేపీకి బుద్ధి చెప్పండి
– మాజీ మంత్రి హరీష్ రావు చిట్ చాట్

మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డి చేత రూ.90 కోట్లు ఖర్చు పెట్టించారని, ఓట్లు కొనుగోలు చేసే క్రమంలో ఎంపీటీసీలు, జెడ్పీటీసీలకు 5 నుంచి 10లక్షల వరకు ఇచ్చారని చిన్నారెడ్డి బట్టబయలు చేశారు. ఈడీలు, సీబీఐలు, ఐటీలు, ఎన్నికల కమిషన్లు ఎందుకు ఈ విషయంపై నోరు మెదపడం లేదు? మంత్రి పొంగులేటి ఇంటి పైన ఈడి రైడ్ ఐతే ఈడి ఒక నోటీసు ఇవ్వలేదు. సుమోటోగా తీసుకొని కేసులు ఎందుకు పెట్టడం లేదు? కాంగ్రెస్ మార్కు ప్రజా పాలన, రాజ్యాంగ పరిరక్షణ అంటే ఇదేనా?

కృష్ణా జలాల విషయంలో ప్రభుత్వం మొద్దు నిద్ర పోతుంది. కేఆర్‌ఎంబిమొదటి మీటింగ్ లోనే మన ప్రాజెక్ట్ లను కేఆర్‌ఎంబి కు అప్పజెప్పి వచ్చారు. కృష్ణా జలాల విషయంలో అన్యాయం జరుగుతుందని మొద్దు నిద్ర పోతున్న ప్రభుత్వాన్ని తట్టి లేపిందాక సోయి లేదు.

రాజ్యాంగం చేతిలో పట్టుకొని తిరిగే రాహుల్ గాంధీ ఏ విధంగా సమర్థిస్తారు? ఏం సమాధానం చెబుతారు? బడే భాయ్, ఛోటే భాయ్ బంధానికి ఇంతకంటే సాక్ష్యం ఏం కావాలి?

బీజేపీ, కాంగ్రెస్ ల చీకటి ఒప్పందానికి ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి? వెంటనే కేసులు పెట్టి, విచారణ జరపాలని బీఆర్ఎస్ పక్షాన డిమాండ్ చేస్తున్నాం.

కాంగ్రెస్ సీనియర్ నాయకులు, మాజీ మంత్రి, ప్రస్తుతం ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు మరియు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ క్రమశిక్షణ సంఘం అధ్యక్షులు చిన్నారెడ్డి నిన్న వనపర్తిలో ఆవేదనతో చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర ప్రభుత్వ నిరంకుశత్వానికి, రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఖూనీ అవుతున్న విధానానికి అద్దం పడుతున్నాయి. ఇందిరమ్మ రాజ్యం.. పోలీసు రాజ్యమైందని, మా కార్యకర్తల నుంచి నాయకుల దాకా అక్రమ కేసులు, వేధింపులు సర్వసాధారణమైపోయాయని మా ఆరోపణలు వాస్తవమని కాంగ్రెస్ నాయకుడైన చిన్నారెడ్డి వ్యాఖ్యల ద్వారా స్పష్టమవుతున్నది.

‘‘పోలీసులు కాంగ్రెస్ ఎమ్మెల్యేల ఇంటి కావలి కారుల్లాగా పని చేస్తున్నారు. ఎమ్మెల్యే కేసు పెట్టమంటే పెట్టాలె, తీసేయమంటే తీసేయాలె అనే స్థాయికి దిగజారారు. గతంలో ఎన్నడూ ఒక ఎమ్మెల్యేకు అధికారులు ఇంతగా భయపడిన దాఖలాలు లేవు. నా 46 ఏండ్ల రాజకీయ జీవితంలో ఇంత దారుణంగా పోలీసులు, అధికారులు ఎన్నడూ ప్రవర్తించలేదు’’ అని చిన్నారెడ్డి బహిరంగంగా ప్రభుత్వ తీరును ఎండగట్టారు.

కొందరు పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని బీఆర్ఎస్ పార్టీ ముందు నుంచి చెబుతున్నది నిజమేనని.. నాడు జగిత్యాలలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, నేడు వనపర్తిలో ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి చేసిన వ్యాఖ్యలు తేటతెల్లం చేస్తున్నాయి. ఈ ప్రభుత్వంలో పోలీసులు, అధికారుల తీరు ఇట్లా ఉంటే, రేవంత్ రెడ్డి నాయకత్వంలో నోట్ల రాజకీయం నగ్న తాండవం చేస్తున్నది. ఈ విషయాన్ని కూడా చిన్నారెడ్డి స్వయంగా వెల్లడించారు.

ఎల్ ఆర్ ఎస్ పై కోదండరామ్ మాట్లాడరేం?

బీఆర్ఎస్ హయాంలో ఎల్ ఆర్ ఎస్ చేపడితే భట్టి, ఉత్తం, సీతక్క, కోదండరాంలు పేద ప్రజల రక్తం తాగే స్కీం అన్నారు. జనాలను రెచ్చగొట్టారు. మేం అధికారంలోకి వస్తే ఉచితంగా చేస్తాం అన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఫీజులు పెంచి ముక్కు పిండి మరీ వసూలు చేస్తున్నారు. కోదండరాం ఉచితంగా చేస్తాం అని చెప్పారు. ఇపుడు ఎందుకు మాట్లాడరు? వివిధ శాఖల అధికారులు సమన్వయంతో డబ్బులు పిండటం లేదని అధికారుల మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒంటి కాలి మీద లేస్తున్నారు.

ఆషాడం సేల్, దీపావళి బొనాంజ, దంతేరస్ ఆఫర్ల మాదిరిగా డిస్కౌంట్లు ప్రకటిస్తున్నారు. చూడబోతే ప్రైజులు, వన్ ప్లస్ వన్ ఆఫర్లు, లక్కీ డ్రాలు కూడా ప్రకటిస్తారేమో? ప్రజలు స్టేట్స్ మెన్ కావాలనుకున్నారు. కాంగ్రెస్ వాళ్లు సేల్స్ మెన్లుగా తయారయ్యారు. ముందు అంతా ఫ్రీ ఫ్రీ ఫ్రీ అన్నారు. ఇప్పుడు 25శాతం డిస్కౌంటహో అని జేబులు ఖాళీ చేసే ప్రణాళిక వేస్తున్నారు.

ఫ్రీ అని చెప్పి చారాణా డిస్కౌంట్ ప్రకటిస్తూ మోసం చేస్తున్న రేవంత్ ప్రజలు రేపు నీకు సీట్లలో 75శాతం భారీ డిస్కౌంట్ ఇస్తరు. కాంగ్రెస్ లో నువ్వు మిస్కౌంట్ ముఖ్యమంత్రిగా మిగిలిపోతావు. ప్రజలారా.. గతంలో మీరు ఎల్ ఆర్ ఎస్ ఫీజులు కట్టకపోతే 25శాతం డిస్కౌంట్ కు దిగారు. ఇప్పుడు కూడా మీరు కట్టకుండా వాగ్దానం ప్రకారం ఫ్రీ గా చేయాలని డిమాండ్ చేయండి. ప్రజలు ఎల్ ఆర్ ఎస్ కట్టకండి. చచ్చినట్లు ఫ్రీగా చేయాల్సి వస్తుంది.

ఇటీవల ఒక దిన పత్రిక ఎడిటర్ ఇప్పుడు తెలంగాణనే ఢిల్లీ కాంగ్రెస్ ను సాదాలె అని వ్యాఖ్యానించాడు. తెలంగాణ ఢిల్లీ కాంగ్రెస్ ను సాదాలంటే గల్లీ కాంగ్రెస్ తెలంగాణ ప్రజల్ని బాదాలె. ఇదే నడుస్తున్నది. ఈ మధ్య కప్పం ఢిల్లీకి తీసుకుపోయే వైశ్రాయిని కూడా మార్చారు. భట్టి, ఉత్తం, సీతక్క, కోదండరాంలు పేద ప్రజలకు క్షమాపణ చెప్పండి.

ఎన్డీఎస్ఏకు ఎస్ ఎల్ బీ సీ, తదితర ఘటనలు కనిపించడం లేదా?

ఎస్ ఎల్ బీ సీ ఘటన చాలా బాధ కలిగించింది. 8 మంది కార్మికుల గురించి వారి కుటుంబాల గురించి ఆలోచిస్తే చాలా ఆవేదన కలుగుతున్నది. ఇటువంటి దురదృష్టకర సంఘటన మీద కూడా కాంగ్రెస్ నాయకులు కుటిల రాజకీయ వ్యాఖ్యలు చేయడం మనస్తాపం కల్గించింది. ఘటన జరిగిన తర్వాత మేం చాలా సమన్వయంగా వ్యవహరించాం. కానీ కాంగ్రెస్ నాయకులు వికృతమైన రాజకీయ వ్యాఖ్యానాలు చేస్తూ, మేం స్పందించక జవాబివ్వక తప్పని అనివార్యతను సృష్టించారు.

పదేండ్లలో బిఆర్ఎస్ ప్రభుత్వం ఒక్క కిలోమీటర్ కూడా తవ్వలేదని ఉత్తం కుమార్ రెడ్డి ఎలా అబద్దాలు చెబుతాడు? అత్యంత సంక్లిష్టమైన ఎస్ ఎల్ బీ సీ సొరంగాన్ని 11.48 కిలోమీటర్లు తవ్వినమనేది రికార్డెడ్ ట్రూత్. నాతో పాటు ఎస్ ఎల్ బీ సీ సొరంగానికి వచ్చిన ఆనాటి సహచర మంత్రి జూపల్లి కృష్ణారావు కూడా తానా అంటే తందాన అని అబద్దాలాడుతున్నడు. అందుకనే మేం మాట్లాడవల్సి వస్తున్నది.

2005 నుంచి 14 మధ్య కాంగ్రెస్ 3,300 కోట్లు ఖర్చు పెడితే, 2014 నుంచి 2023 మధ్య బిఆర్ఎస్ 3,900 కోట్లు ఖర్చు పెట్టింది. అసెంబ్లీలో ఆనాడు జానా రెడ్డి కోరితే ఎస్ ఎల్ బి సి పనులు ప్రారంభించేందుకు 100 కోట్లు కేసీఆర్ ఇచ్చి జానారెడ్డి మాటలు గౌరవించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో 230 కిలోమీటర్లు టన్నెల్ తవ్వి పూర్తి చేశాం. ఎస్ ఎల్ వి సెట్ అన్నలతో అనేక సాంకేతిక సమస్యలు ఎదురైనా, 12 కిలోమీటర్లు బిఆర్ఎస్ ప్రభుత్వం పూర్తి చేసింది.

ఎస్ ఎల్ బి సి కింద రెండు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లు లో 90% శాతం పూర్తి చేశాం. మంత్రి హోదాలో ఉండి అబద్ధాలు మాట్లాడితే ప్రజల్లో విశ్వాసం నమ్మకం కోల్పోతారు. కాళేశ్వరం పిల్లర్లు కుంగితే నానా యాగి చేశారు. కాళేశ్వరం అంటే 3 బ్యారేజీలు ,15 రిజర్వాయర్లు, 19 సబ్ స్టేషన్ లో ,21 పంప్ హౌస్,203 కిలోమీటర్ల టన్నల్, 1531 కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్ లు,98 కిలోమీటర్ల ప్రెజర్ మెన్,141 ఎంసీల నీటి సామర్థ్యం. 530 మీటర్ల ఎత్తుకు నీటిని లిఫ్ట్ చేయడం. వీటన్ని సమాహారమే కాళేశ్వరం.

కాళేశ్వరంలో ఒక్క బ్యారేజీలో ఒక్క బ్లాకు పిల్లర్ కుంగితే నానా యాగి చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 14 నెలల్లో ఖమ్మంలో పెద్ద వాగు ప్రాజెక్టు కొట్టుకుపోయింది. సుంకిశాల రిటైనింగ్ వాల్ కూలింది. ఇప్పటివరకు ఇలాంటి చర్యలు లేవు. పాలమూరు ప్రాజెక్టులోని వట్టెం పంప్ హౌజ్ నీట మునిగింది. ఎల్ ఎల్ బీ సీ పరిస్థితి చూస్తున్నాం. కాళేశ్వరం విషయంలో వారం రోజుల్లోనే రిపోర్టు తయారు చేసిన ఎన్డీఎస్ఏకు ఎస్ ఎల్ బీ సీ, తదితర ఘటనలు కనిపించడం లేదా? విచారణ ఎందుకు చేయడం లేదు, నివేదికలు ఎందుకు ఇవ్వడం లేదు.

ఎస్ ఎల్ బి సి ఘటన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సాధారణ లీకేజీ ప్రకృతి విపత్తు అని మాట్లాడారు. మరి కాళేశ్వరం విషయంలో ఈ ప్రకృతి విపత్తు ఎక్కడికి పోయింది? ఎందుకు కాళేశ్వరంలోని మెడిగడ్డ మ్యారేజ్ రిపేర్ చేయించడం లేదు? ఎన్డీఎస్ఏ ఎందుకు విచారణ చేపట్టడం లేదు? బిజెపి కాంగ్రెస్ చీకటి ఒప్పందం వల్లనే మౌనంగా ఉన్నారా? రేవంత్ రెడ్డి, కిషన్ రెడ్డి ల మధ్య కొనసాగుతున్న పరస్పర అవగాహన వల్లనే కాంగ్రెస్ తప్పిదాలు చూసిచూడనట్లు వదిలేస్తున్నారు.

ఎమ్మెల్సీ ఎన్నికలు

నాన్ కాంగ్రెస్, నాన్ బిజేపీ అభ్యర్థులలో మెరుగైన అభ్యర్థికి ఓటేసి ఎన్నుకోవాలని పిలుపునిస్తున్నాం . నిజామాబాద్ సభలో ముఖ్యమంత్రి మాటల్లో ఓటమి భయం స్పష్టంగా బయటపడింది. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు గ్రాడ్యుయేట్ ఓటర్లను కించ పరిచేలా ఉన్నాయి. ఎవరైనా నాయకుడు అప్పీల్ చేస్తే మీ ఓటు మాకు చాలా విలువైనది. ఈ గెలుపు మాకు కీలకమైనది. అంటారు. కానీ సీఎం రేవంత్ రెడ్డి గెలిచినా గెలవకున్నా ఫరక్ పడదు అన్నడు. అంటే మీరు ఓటేసినా వేయకున్నా ఫరక్ పడదని చెప్పినట్లే కదా?

వానాకాలం రైతు బంధు పైసలు ఖాతాల్లో పడ్డవాళ్లు కాంగ్రెస్ కు ఓటు వేయండి, పడని వాళ్లు కాంగ్రెస్ ను ఓడించండి. ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు పొందిన యాజమాన్యం, సిబ్బంది కాంగ్రెస్ కు ఓటు వేయండి, పడని వాళ్లు ఓడించండి. కల్యాణలక్ష్మి, తులం బంగారం పొందిన గ్రాడ్యుయేట్లు కాంగ్రెస్ కు ఓటు వేయండి, రాని వాళ్లు ఓడించండి. ఏడాదిలో రెండు లక్షల ఉద్యోగాలు వచ్చి ఉంటే గ్రాడ్యుయేట్స్ కాంగ్రెస్ కు ఓటు వేయండి, రానట్లయితే ఓడించండి.

బీఆర్ఎస్ హయాంలో లక్షా 60వేల ఉద్యోగాలు ఇచ్చినం. కాంగ్రెస్ ఇచ్చామని చెబుతున్న 55 వేల ఉద్యోగాల్లో 5వేలు మినహా మిగతా 50 వేలు బీఆర్ఎస్ హాయంలో ఇచ్చినవే. మేనిఫెస్టోలో చెప్పినట్లు వెంటనే పెండింగ్ డీఏలు, ఆరు నెలల్లో పీఆర్సీ వచ్చి ఉంటే ఉద్యోగస్థులు, టీచర్లు, కాంగ్రెస్ కు ఓటు వేయండి లేకుంటే ఓడించండి. ప్రియాంక గాంధీ హామీ ఇచ్చిన విధంగా నిరుద్యోగ భృతి ఇచ్చి ఉంటే నిరుద్యోగులు కాంగ్రెస్ కు ఓటు వేయండి లేదంటే ఓడించండి.

ఎమ్మెల్సీ ఎన్నికల్లో బిజేపీ గ్రాడ్యుయేట్ ఓటర్లు బుద్ధి చెప్పాలి. ఆంధ్ర, బీహార్ రాష్ట్రాలకు నిధుల వర్షం కురిపించి, తెలంగాణకు మొండి చెయ్యి చూపించిన బిజేపీకి మేధావులైన గ్రాడ్యుయేట్లు, టీచర్లు బుద్ధి చెప్పాలి. దేశంలో 156 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తే అందులో ఒక్కటి కూడా తెలంగాణకు ఇవ్వని బిజేపీకి, తెలంగాణ బిడ్డలు ఓటేస్తే అన్యాయాన్ని ఆమోదించడమే.. ఆలోచించండి.

పసి పిల్లలు తాగే పాల నుంచి పాప్ కార్న్ దాకా జీఎస్టీ వేసి నిత్యావసర వస్తువుల ధరలు పెరిగేలా చేస్తూ పేద ప్రజల మూలుగులు పీలుస్తున్న బిజేపీకి బుద్ధి చెప్పండి. దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 11 ఏండ్లలో డాలర్ విలువ 64 నుంచి 88కి పెరిగింది. ఈ వైఫల్యానికి పూర్తి బాధ్యత బిజేపీది కాదా?

LEAVE A RESPONSE