Suryaa.co.in

Telangana

వందల కోట్ల పన్నుల చెల్లింపులో అవకతవకలకు పాల్పడ్డ కోమటిరెడ్డి గ్రూపుల సంస్థలు

-సుశీ గ్రూపులకు చెందిన 16 సంస్థలపై రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ (ఎస్.జి.ఎస్.టి ) దాడులు
-లాప్ టాప్ లు, కంప్యూటర్ల సీజ్

ప్రభుత్వానికి పన్నుల చెల్లింపులో పెద్ద ఎత్తున అవకతవకలకు పాల్పడుతున్నారని విశ్వసనీయ సమాచారం మేరకు రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ (ఎస్.జి.ఎస్.టి ) అధికారులు నేడు కోమటి రెడ్డి గ్రూపులకు చెందిన 16 వ్యాపార సంస్థలపై 16 బృందాలు దాడులు నిర్వహించాయి. హైదరాబాద్ నగరంలోని రెండు భవనాలలో ఉన్న సుశీ సంస్థలకు చెందిన కంపెనీలపై నిర్వహించిన తనికీల్లో పెద్ద ఎత్తున పన్ను ఎగవేతకు పాల్పడ్డట్టుగా ప్రాధమికంగా అంచనా వేశారు.

నేడు ఉదయం సుమారు పదకొండున్నరకు ప్రారంభమై రాత్రి 7 గంటలకు ముగిసిన ఈ తనికీల్లో, లెక్కల్లో చూపని వ్యాపార లావాదేవీలు పెద్ద ఎత్తున జరిగాయని లభ్యమైన పత్రాల ద్వారా కనుగొన్నారు. వీటితో పాటు ఈ కంపెనీల్లోని లాప్ టాప్లు, కంప్యూటర్ల లోని సమాచారం ప్రకారం పలు అనుమానాస్పద వ్యాపార లావాదేవీలు కూడా జరిగినట్టు గుర్తించారు.

ఈ 16 సంస్థల్లో ఒక సంస్థ సహకరించనందున ఆ సంస్థ కార్యాలయంలోని బీరువా లోఉన్న లాకర్ ను సీల్ చేశారు. ప్రభుత్వానికి పన్నులు చెల్లించకుండా క్రయ విక్రయాలు జరపడం తదితర అక్రమాలకూ పాల్పడ్డట్టు కూడా గుర్తించారు. ప్రాథమిక అంచనా మేరకు సుశీ గ్రూపుల సంస్థలు వందల కోట్ల పన్నుల ఎగవేతకు పాల్పడ్డట్టు వాణిజ్య పన్నుల శాఖ గుర్తించింది. ఈ పన్నుల ఎగవేతపై విచారణను / దర్యాప్తు ను కొద్దీ రోజుల్లో పూర్తి స్థాయిలో పూర్తి చేసి, స్పష్టమైన నిర్దారణకు వాణిజ్య పన్నుల శాఖ రానుంది.

LEAVE A RESPONSE