Suryaa.co.in

Editorial

పవన్ నాలుగో పెళ్లాం ఈమేనట!

– నా నాలుగో పెళ్లాం నువ్వేనా జగన్ అని ప్రశ్నించిన పవన్
– ఆ తర్వాత పవన్ నాలుగో భార్య ఫొటోతో జనసైనికుల హల్‌చల్
– ఇంతకూ ఎవరామె? ఆ ఫొటో ఎవరిది?
– సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ‘నాలుగో పెళ్లాం’ ఫొటో
( మార్తి సుబ్రహ్మణ్యం)

ఈకాలంలో సోషల్ మీడియా మహా ఫాస్టుగా ఉంది. ఎవరైనా ఏదైనా కామెంట్ చేస్తే.. అది నిప్పు కంటే ఎక్కువగా, వాయువు కంటే వేగంగా సోషల్‌మీడియాలో వైరల్ అయిపోతుంది. సదరు కామెంట్ చేసిన వ్యక్తి పుట్టుపూర్వోత్తరాలు, చిన్నప్పుడు ఆయన తిన్నదంతా సోషల్ మీడియాలో వాంతులు చేసుకుంటారు. ఆ వ్యక్తి ఘనకార్యం-వెలగబెట్టిన రాచకార్యాలు- శృంగారపురుషులయితే నాలుగుగోడల మధ్య జరిపిన రాసలీలు గట్రాలన్నీ, స‘దృశ్యం’గా సోషల్‌మీడియాలో పెట్టేస్తారు.

సోషల్‌మీడియా సైనికులు అంత ఎవ‘రెడీ’గా ఉంటారన్నమాట. సరే..తమ ప్రత్యర్ధుల పరువు తీసేందుకు రాజకీయ పార్టీలు ఎలాగూ దానికో ప్రత్యేక సెల్స్ పెట్టుకుని, నిమిషనిమషానికీ దానికి చార్జింగ్ చేస్తుంటారనుకోండి. అది వేరే విషయం. అయితే.. ఇలా పోస్టింగులు పెట్టిన వారిపై కన్నేసి, వాళ్ల సంగతి తేల్చేందుకు ఏపీలో అయితే సీఐడీలో ఒక విభాగమే ఉందట. అయితే అది ప్రభుత్వంలో ఉన్న పార్టీకి వ్యతిరేకంగా పోస్టులు పెట్టిన వారిని శిక్షించడానికేనట.

పోస్టులు పెట్టిన వాళ్లు.. షేర్ చేసిన వాళ్లు వృద్ధులా? పిల్లలా అన్నది వారికి అనవసరం. తీసుకువచ్చి లోపలపడేయటమే వారి వృత్తి ధర్మం. అదే అధికారపార్టీ సోషల్‌మీడియా సైనికులు.. బాబు-పవన్-లోకేష్-రఘురామకృష్ణంరాజుపై పెట్టే, చండాలమైన పోస్టులకు మాత్రం స్పందించరన్నది విపక్షాల ఉవాచ. అసలై హైకోర్టు జడ్జీలపై పోస్టింగులు పెడితేనే చర్యలు తీసుకునే దిక్కులేక.. అంతలావు జడ్జీలే కేసును సీబీఐకి ఇవ్వాల్సివచ్చింది. అది వేరే కథ.

ఇక తాడేపల్లిగూడెంలో టీడీపీ-జనసేన జమిలిగా నిర్వహించిన జెండా సభ అదిరిపోయింది. వేదికపై జనసేనాని పవన్ కల్యాణ్ పేల్చిన మాటల తూటాలు, ప్రత్యర్ధులపై దిగబడ్డాయి. ‘‘హలో ఏపీ.. బైబై వైసీపీ’’ అంటూ ఎలుగెత్తి చాటిన నినాదం గోదావరి నుంచి శ్రీకాకుళం వరకూ వినిపించింది. సరే పవన్ ఎలాగూ పంచ్ స్టార్ కాబట్టి.. ఆయన డైలాగులకు ఈలలు, గోలలు, చప్పట్లూ మామూలే అనుకోండి.

ఆ సందర్భంలో ఏపీ సీఎం జగన్‌పై జనసేనాని చేసిన హాట్ కామెంట్స్‌కు తెగ చప్పట్లు వినిపించాయి. తనకు నాలుగు పెళ్లిళ్లు అయ్యాయంటూ జగన్ చేసే విమర్శలకు… పవన్ అదిరిపోయే కౌంటర్ ఇచ్చి, జగన్‌ను ఆత్మరక్షణలో పడేశారు. ‘పవన్‌కు సంబంధించినంత వరకూ మూడుపెళ్లిళ్లు, రెండు విడాకులు మాత్రమే. మరి జగన్ నాకు నాలుగు పెళ్లిళ్లు అంటున్నాడు. నా నాలుగో పెళ్లాం నువ్వేనా.. రా’’

అంటూ చేసిన కామెంట్లకు తాడేపల్లిగూడెం దద్దరిల్లింది. అటు చానెల్స్‌లో కూడా ‘జగనే నా నాలుగో పెళ్లాం’ అంటూ వ్యంగ్యంగా స్క్రోలింగులు పెట్టడం అందరినీ ఆకర్షించింది.

దానితో తమ బాసు కామెంట్లను అందుకున్న సోషల్‌మీడియా జనసైన్యం.. ఒక అందమైన అమ్మాయి ఫొటో పెట్టి, ‘ఈమెనే జగన్ నాలుగో పెళ్లాం’ అంటూ చేసిన కామెంట్ ఇప్పుడు హాట్‌టాపిక్‌లా

మారింది. అయితే ఆ ఫొటోలోని అమ్మాయిని గతంలో ఎక్కడా చూసినట్లు లేదు. పోనీ ఏదైనా సినిమాలో హీరోయిన్‌గా చేసిందా అంటే అదీ లేదు. బహుశా దూరపు బంధువులు కామోసనుకున్నారు.

కానీ తీక్షణంగా పరిశీలిస్తే అది జగన్‌ను పోలి ఉండటం..వందశాతం జగన్ పోలికలు ఉండటం కనిపిస్తోందన్న కామెంట్లు నెటిజన్ల నుంచి వరదలా వెల్లువెత్తింది. బహుశా దానిని మార్ఫింగ్ కళతో జనసైనికులు కళావతిగా తీర్చిదిద్దారేమో అన్న అనుమానం కూడా కలగకపోలేదు. ఇంతకూ ‘పవన్ నాలుగోపెళ్లాం’గా.. సోషల్‌మీడియాలో ప్రచారంలోకి వచ్చిన ఈ ఫొటో ఎవరిదో మీరూ ఓసారి పరిశీలించి, పరిశోధించండి.

LEAVE A RESPONSE