ముఖ్యమంత్రి గారూ…ఉద్యోగులంటే అంతచులకన దేనికి?

-పాలనా వ్యవస్థలో మూలస్థంభాలను అడగడుగునా అవమానిస్తారా?
– తక్షణమే ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లు పరిష్కరించండి
– శాసనసభ పబ్లిక్ ఎకౌంట్స్ కమిటీ చైర్మన్ పయ్యావుల కేశవ్
అధికారంలోకి వచ్చిన గత రెండున్నరేళ్లలో జగన్ రెడ్డి సర్కారు ఉద్యోగులకు ఇచ్చిన ఏ ఒక్క హామీని అమలుచేయకపోగా, అడుగడుగునా అవమానాలకు గురిచేస్తోంది. పిఆర్ సి అమలు, సిపిఎస్ రద్దు, డిఎ బకాయిల విడుదల వంటి అంశాలను కనీసం ప్రస్తావించకుండా ఏదో ఒక సమయానికి ఉద్యోగులకు జీతాలు ఇస్తున్నాం కదా అని సాక్షాత్తు ఆర్థికమంత్రి వ్యాఖ్యానించారంటే ప్రభుత్వోద్యోగులను జగన్ రెడ్డి ప్రభుత్వం ఎంత చిన్నచూపు చూస్తుందో అర్థమవుతోంది.
నాలుగుగోడల మధ్య విధులు నిర్వర్తించే ఉద్యోగులను జీతాల కోసం రోడ్డెక్కే పరిస్థితి కల్పించారు. పిఆర్ సి అడుగుతున్న ఉద్యోగ సంఘ నాయకులను ఒకరోజంతా సెక్రటేరియట్ లో నిలబెట్టి అవమానించడమంటే రాష్ట్రంలోని ఆరులక్షలమంది ప్రభుత్వోద్యోగులను అవమానించినట్లే. దీనిని తీవ్రంగా ఖండిస్తూ ఉద్యోగులు న్యాయమైన డిమాండ్ల కోసం చేస్తున్న ధర్మపోరాటానికి తెలుగుదేశం పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తోంది. అధికారంలోకి వచ్చినవెంటనే సిపిఎస్ రద్దు, పిఆర్ సి అమలు, డిఎ బకాయిల విడుదల వంటి సమస్యలను పరిష్కరిస్తామన్న జగన్ రెడ్డి రెండున్నరేళ్లుగా ముఖం చాటేయడం దుర్మార్గం.
చివరికి కరోనాతో ప్రాణాలు కోల్పోయిన వారికి మట్టిఖర్చులు, పరిహారం ఇవ్వకపోవడం దారుణం. రాష్ట్ర పాలనా యంత్రాంగంలో కీలకపాత్ర వహించే ఉద్యోగ సంఘాల నాయకులకు కనీసం అపాయింట్ మెంట్ ఇవ్వకపోవడం శోచనీయం. ఉద్యోగుల సమస్యలను పట్టించుకోకుండా ముఖ్యమంత్రి ఎందుకు తప్పించుకుని తిరుగుతున్నారు?
చివరికి ఉద్యోగుల జీతాలనుంచి దాచుకున్న జిపిఎఫ్ సొమ్మును కూడా వారికి తెలియకుండా దారిమళ్లించడం సిగ్గుచేటు. పిఆర్ సి బకాయిలు కొండల్లా పేరుకుపోతుంటే కనీసం నివేదిక బయటపెట్టకుండా ఎటువంటి భరోసా కల్పించకుండా ఆందోళనకు గురిచేయడంలో అంతర్యమేమిటి? 50శాతం ఫిట్ మెంట్ తో పిఆర్సీని అమలుచేసి ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను తక్షణమే పరిష్కరించాల్సిందిగా తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తోంది.

Leave a Reply