Suryaa.co.in

Telangana

త్వరలో కొత్తగా విద్యుత్తు పాలసీ

-అసెంబ్లీలోనూ, నిపుణులతోనూ విద్యుత్తు విధానంపై విస్తృతంగా చర్చ
-24 గంటలపాటు నిరంతర విద్యుత్తును అందించాల్సిందే
-గృహజ్యోతి కింద 2వందల యూనిట్లకు ఏర్పాట్లు
-విద్యుత్తు శాఖపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సుదీర్ఘ సమీక్ష

విద్యుత్తు రంగ నిపుణులు, వివిధ రాష్ట్రాల విద్యుత్తు విధానాలను సమగ్రంగా అధ్యయనం చేసి, శాసనసభలో చర్చించి తెలంగాణ రాష్ట్రంలో సమగ్ర విద్యుత్తు విధానాన్ని అమలుచేయాల్సిన అవసరముందని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అన్నారు.

డాక్టర్ బీఆర్.అంబేద్కర్ సచివాలయంలో విద్యుత్ శాఖ అధికారులతో బుధవారం సుదీర్ఘంగా సమీక్షించారు. ఉపముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క, మంత్రులు ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి, డి.శ్రీధర్ బాబులతో కలిసి నిర్వహించిన ఈ సమీక్షా సమావేశంలో విద్యుత్తు వినియోగం, 24 గంటలపాటు నిరంతర విద్యుత్తు సరఫరా, విద్యుత్తు సంస్థల ఉత్పత్తి, కొత్తగా ఉత్పత్తి చేయడానికి తీసుకోవాల్సిన చర్యలు, ఎన్నికల్లో ఇచ్చిన గృహజ్యోతి పథకానికి 2వందల యూనిట్లను అందించడానికి తీసుకోవాల్సిన చర్యలు వంటివాటిపై సుదీర్ఘంగా చర్చించారు. రాష్ట్రంలో విద్యుత్ ఉత్పత్తి, వివిధ విద్యుత్ కంపెనీల నుంచి విద్యుత్ కొనుగోళ్లు, రాష్ట్రంలో విద్యుత్ వినియోగం, డిస్కమ్ల పనితీరు, ఆర్థిక పరిస్థితిపైనా వివరాలను సీఎంకు అధికారులు వివరించారు.

తెలంగాణ ఏర్పాటైన తర్వాత 2014 నుంచి ఇప్పటిదాకా విద్యుత్ కంపెనీలకు, విద్యుత్ నియంత్రణ మండలి (ఈఆర్సీ) మధ్య జరిగిన ఒప్పందాలు, ఆ ఒప్పందాల్లోని అంశాలు, విద్యుత్తుకు చెల్లించిన ధరలు వంటివాటిపై సమగ్రంగా అధ్యయనం చేసి, పూర్తి వివరాలను అందించాలని అధికారులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఆర్ధిక సంవత్సరాల వారీగా జరిగిన ఒప్పందాలను, వాటిలోని అంశాలకు సంబంధించిన పూర్తి వివరాలు ఇవ్వాలని ఆదేశించారు. ఎక్కువ ధర చెల్లించే విధంగా జరిగిన ఒప్పందాలకు కారణాలేమిటో కూడా నివేదించాలని ఆదేశించారు. బహిరంగ మార్కెట్లో ఎక్కడ తక్కువ ధరకు విద్యుత్ లభిస్తుందో, ఆ కంపెనీల నుంచే విద్యుత్ కొనుగోలు చేయాలని సీఎం ఆదేశించారు.

ఇప్పటిదాకా సరైన విద్యుత్ పాలసీని రూపొందించడకపోవడంతో వివిధరకాల ఇబ్బందులు, సమస్యలు ఉత్పన్నమవుతున్నాయన్నారు. వివిధ రాష్ట్రాల్లో అమలవుతున్న విద్యుత్తు విధానాలను అధ్యయనం చేయాలని, ఆ రాష్ట్రాల్లోని విద్యుత్తు పరిస్థితులు, మెరుగైన విధానం ఏ రాష్ట్రంలో ఉందో అధ్యయనం చేసి, నివేదికలను ఇవ్వాలని రేవంత్ రెడ్డి ఆదేశించారు. అన్ని రాష్ట్రాలకంటే మెరుగైన విద్యుత్తు విధానాన్ని తెలంగాణలో అమలుచేయడానికి నిపుణులతో చర్చించి, అసెంబ్లీలోనూ అన్ని రాజకీయపార్టీల ప్రజా ప్రతినిధులతో సుదీర్ఘంగా చర్చించి, సరికొత్త విద్యుత్ పాలసీని తీసుకు వస్తామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.

తెలంగాణ ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్రంలో రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ ఇచ్చి తీరాలని స్పష్ఠం చేశారు. ఆరు గ్యారంటీలలో ఒకటైన గృహజ్యోతి పథకం ద్వారా ఇంటికి 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ప్రభుత్వ పరంగా విద్యుత్తు ఉత్పత్తిని పెంచడానికి, మరిన్ని విద్యుత్ సంస్థలను ఏర్పాటు చేయడానికి ఉన్న అవకాశాలను, ఇప్పటికే నిర్మాణంలో ఉన్న పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. విద్యుత్ దుర్వినియోగాన్ని అరికట్టాలని, నాణ్యతను పెంచాలని సూచించారు. విద్యుత్తును నిరంతరం సరఫరా చేయడంలో ఎలాంటి అవాంతరాలు రాకుండా పటిష్టంగా, ముందస్తు చర్యలను చేపట్టాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు.

ఈ సమావేశంలో ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్ బాబు , ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ఫైనాన్స్ స్పెషల్ సిఎస్ రామకృష్ణారావు, ఇరిగేషన్ సెక్రటరీ రాహుల్ బొజ్జా, ట్రాన్స్ కో సిఎండి రిజ్వీ, టిఎస్ఎస్పీడిసిఎల్ సిఎండీ ముషార్రఫ్ ఫారూఖీ, సిఎంఓ అధికారులు ప్రిన్సిపల్ సెక్రటరీ శేషాద్రి, స్పెషల్ సెక్రటరీ అజిత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE