బి.పి మండల్ స్పూర్తితో రాజ్యాధికారం సాధించాలి

– మండల్ జయంతి సదస్సులో వక్తలు

సామాజికంగా వెనుకబడిన బి.సి ల అభ్యున్నతి కోసం దేశమంతా పర్యటించి సకల సామాజిక రంగాల్లో బి.సి లకు సముచిత స్థానం కల్పించాలని సమగ్ర నివేదిక సమర్పించిన బ్రిందేశ్వర్ ప్రసాద్ మండల్ ను స్ఫూర్తిగా తీసుకుని బహుజన రాజ్యాధికారం చేపట్టే ఉద్యమాలు చేయాలని వివిధ సంఘాల నాయకులు పిలుపునిచ్చారు.

హన్మకొండ జిల్లా కేంద్రం హంటర్ రోడ్ లో డాక్టర్ చింతం ప్రవీణ్ అధ్యక్షతన జరిగిన బి.పి మండల్ 104 వ జయంతి కార్యక్రమంలో బి.సి స్టడీ ఫోరం వ్యవస్థాపక చైర్మన్, సామాజిక న్యాయ జాక్ జాతీయ సభ్యుడు సాయిని నరేందర్, ప్రొఫెసర్ కె.వీరస్వామి, వరంగల్ బార్ కౌన్సిల్ ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ గౌడ్, పీపుల్స్ డెమొక్రటిక్ ఫ్రంట్ నాయకులు సోమ రామమూర్తి, ద్రవిడ బహుజన సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ జిలుకర శ్రీనివాస్, బహుజన ధూంధాం రాష్ట్ర కన్వీనర్ మచ్చ దేవేందర్ లు పాల్గొని మాట్లాడారు.

స్వాతంత్ర్య అనంతరం ఎస్సి, ఎస్టీ లకు విద్య, ఉద్యోగ, చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించారని, బి.సి లకు మాత్రం ఎలాంటి అవకాశాలు కల్పించకపోవడం వల్ల ముందుకు వచ్చిన పోరాటాల వల్ల 1953 లో ఏర్పడిన కాకా కలేల్కర్ కమీషన్ నివేధికను ను అమలు చేయకుండా బుట్టదాఖలు చేశారని వారు అన్నారు. ప్రజా పోరాటాల ఫలితంగా ఏర్పడిన 1978 ఏర్పాటు చేసిన బి.పి మండల్ నివేదిక లోని 39 అంశాలను నేటికి అమలు చేయకపోవడం దుర్మార్గమని అన్నారు. మండల్ కమిషన్ నివేదిక వల్ల, వి.పి సింగ్ చొరవ వల్ల బి.సి లకు విద్య, ఉద్యోగ రంగాల్లో కల్పించబడిన 27 శాతం రిజర్వేషన్లు నేటికి సక్రమంగా అమలు చేయడం లేదని వారు అన్నారు.

రానున్న రోజుల్లో బహుజనుల ఓట్లు అగ్రకుల పార్టీలకు వేసి అడుక్కోవడం సరికాదని అన్నారు. మన ఓట్లు మనం వేసుకొని రాజ్యమేలినప్పుడే బి.సి లకు విముక్తి జరుగుతుందని అన్నారు. నిరక్షరాస్యులు ఎక్కువగా ఉన్న మండల్ కాలంలో మండల్ కమీషన్ తీసుకొచ్చిన ప్రజలు విద్యావంతులు పెరిగిన నేటి సమాజంలో మన హక్కులను సాధించుకోక పోవడం చూస్తుంటే తప్పు మనలో నుండి ఎదిగిన వారిదని తెలుస్తుందని అన్నారు. ఇకనైనా బహుజనులు ఏకమై మన హక్కులను సాధించుకోవాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో న్యాయవాదులు కూనూరు రంజిత్ గౌడ్, రాచకొండ ప్రవీణ్ కుమార్, పరుశురాం, అచ్యుత్, శశిరేఖ, శ్రీలత, కార్తీక్, రాజబాపు, వివిధ సంఘాల నాయకులు నలిగింటి చంద్రమౌళి, ఏదునూరి రాజమౌళి, రాజేష్ కన్నా గౌడ్, ఐతం నగేష్, సందెల హరినాధ్, చెరుపెళ్లి ఆనంద్, ఆంజనేయులు, సాగర్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply