399కే 10 లక్షల ప్రమాద బీమా..పోస్టల్ ఇన్సూరెన్స్

రోడ్డు ప్రమాదాలు కుటుంబాల్లో వ్యక్తులనే కాదు.. మొత్తం కుటుంబాన్నే కష్టాల్లోకి నెట్టేస్తాయి. ఇంటి పెద్ద ఒకవేళ రోడ్డు ప్రమాదం బారిన పడితే ఒక్కోసారి ఆ కుటుంబం మొత్తం ఆర్థిక సుడిగుండంలో చిక్కుకోవాల్సిందే. అందుకే ప్రమాద బీమా చేయించుకోవడం ముఖ్యం. ఇటీవల వీటి పట్ల ప్రజల్లో అవగాహన పెరిగింది. జీవిత బీమా, ఆరోగ్య బీమా తరహాలో ప్రమాద బీమా కూడా తీసుకునే వారి సంఖ్య పెరిగింది. ఈ నేపథ్యంలో తపాలాశాఖ ఓ బీమా పథకానికి శ్రీకారం చుట్టింది. టాటా ఏఐజీతో కలిసి తమ కస్టమర్ల కోసం గ్రూప్‌ యాక్సిడెంట్‌ గార్డ్‌ పేరిట ప్రమాద బీమా పాలసీని తీసుకొచ్చింది. ఏడాదికి రూ.399తో రూ.10 లక్షల ప్రమాద బీమా సౌకర్యాన్ని కల్పిస్తోంది.

18 నుంచి 65 ఏళ్ల వయసు కలిగిన వారు ఎవరైనా ఈ బీమా పాలసీ తీసుకోవచ్చు. పోస్టల్‌ పేమెంట్‌ బ్యాంక్‌ ద్వారా దీన్ని చెల్లించాల్సి ఉంటుంది. అంటే ఈ బీమా తీసుకోవాలంటే పోస్టల్‌ పేమెంట్‌ బ్యాంక్‌లో ఖాతా తప్పనిసరి. ప్రమాదంలో మరణించినా, శాశ్వత వైకల్యం ఏర్పడినా, అవయవం కోల్పోయినా, పక్షవాతం వచ్చినా రూ.10 లక్షలు చెల్లిస్తారు. ఏదైనా ప్రమాదం జరిగి పాలసీ తీసుకున్న వ్యక్తి వైద్యం కోసం ఆసుపత్రిలో చేరితే ఐపీడీ కింద రూ.60 వేలు లేదా క్లెయిమ్‌ చేసిన మొత్తం.. ఏది తక్కువైతే అది చెల్లిస్తారు. ఔట్‌ పేషెంట్‌కు రూ.30 వేలు లేదా క్లెయిమ్‌ చేసిన మొత్తం.. ఏది తక్కువ అయితే అది చెల్లిస్తారు.

ఇవే కాదు ఈ పాలసీలో ఇతర ప్రయోజనాలు కూడా ఉన్నాయి. విద్యా ప్రయోజనం కింద గరిష్ఠంగా ఇద్దరు పిల్లలకు రుసుములో 10 శాతం లేదా లక్ష రూపాయల వరకు ఎంచుకోవచ్చు. కుటుంబ ప్రయోజనాల కింద రూ.25 వేలు, అంత్యక్రియలకు రూ.5 వేలు అందిస్తారు. ఆసుపత్రిలో రోజువారీ నగదు కింద రోజుకు వెయ్యి రూపాయలు చొప్పున 10 రోజుల వరకు అందజేస్తారు.

ఇదే పథకంలో మరో ఆప్షన్‌ను కూడా తపాలా శాఖ అందిస్తోంది. కేవలం ఏడాదికి రూ.299 చెల్లించినా రూ.10 లక్షల బీమా వర్తిస్తుంది. మృతి, వైకల్యం, పక్షవాతం, వైద్య ఖర్చులు వంటివి ఇందులో కవర్‌ అవుతాయి. రూ.399లో ఉండే మిగిలిన ప్రయోజనాలను ఇందులోంచి మినహాయించారు.

Leave a Reply