Suryaa.co.in

Telangana

మోదీ నాయకత్వాన్ని బలపరచండి

– తెలంగాణలో17 సీట్లు గెలవడమే లక్ష్యంతో ముందుకెళ్తున్నాం
– హైదరాబాద్ లో ఒవైసీని ఓడించి బీజేపీ జెండా ఎగురవేస్తాం
– వచ్చే ఎన్నికలు ధర్మ యుద్ధం లాంటివి
– దేశం కోసం, ధర్మకోసం బీజేపీకి ఓటు వేయండి
– అభివృద్ధి పనుల ప్రారంభోత్సవంలో
– కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి

హైదరాబాద్: మరోసారి ప్రజలు మోదీ నాయకత్వాన్ని బలపరచాలని కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి కోరారు. తెలంగాణలో 17 సీట్లలో విజయం సాధించడమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామని తెలిపారు. ఈ మేరకు శుక్రవారం కిషన్ రెడ్డి సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలోని పలు డివిజన్లలో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘ఈసారి బీజేపీకి తెలంగాణలో మెజార్టీ సీట్లు సాధించబోతున్నది. హైదరాబాద్ లో మజ్లిస్ పార్టీ, ఒవైసీని ఓడించి బీజేపీ జెండా ఎగురవేస్తాం. వచ్చే ఎన్నికలు ధర్మ యుద్ధం లాంటివి. ప్రజలు ఆలోచించి స్పందించాలి. పార్లమెంటు ఎన్నికలకు భారతీయ జనతా పార్టీ యంత్రాంగం సిద్ధంగా ఉంది. దేశం కోసం, ధర్మకోసం, దేశ ప్రజల సంక్షేమం కోసం, దేశ గౌరవాన్ని పెంచడం కోసం గత పది సంవత్సరాలుగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ నాయకత్వంలో అనేక కార్యక్రమాలు చేస్తున్నాం. వచ్చే ఐదు సంవత్సరాలు మరింత అంకితభావం, సేవాభావంతో పని చేస్తాం. దేశ ప్రజలు కూడా నరేంద్రమోదీ నాయకత్వాన్ని ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నారు.

400 సీట్లు..

ఎన్టీయే కూటమి 400 సీట్లు గెలవాలనే లక్ష్యంతో కృషి చేస్తున్నామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ‘‘దేశంలోని అన్ని సామాజికవర్గాల ప్రజలు నరేంద్రమోదీ నాయకత్వాన్ని కోరుకుంటున్నారు. నరేంద్రమోదీకి ప్రత్యామ్నాయంగా దేశంలో ఏ రాజకీయ పార్టీ కూడా సమర్థత కలిగిన వ్యక్తిని ప్రజల ముందు చూపించే పరిస్థితి లేదు. నరేంద్రమోదీ నాయకత్వంలో దేశ ప్రజలకు మరో 5 సంవత్సరాలు సంక్షేమం అందించాలని ఆలోచన చేస్తున్నాం. వచ్చే పార్లమెంటు ఎన్నికల తర్వాత 4 సెక్టార్ల ద్వారా దేశంలో పని చేయబోతున్నాం. మహిళలు, యువకులు, రైతులు, పేద ప్రజల సంక్షేమమే లక్ష్యంగా పని చేస్తాం. బీజేపీ అభ్యర్థులను ఆశీర్వదించి గెలిపించండి”అని ఆయన కోరారు.

LEAVE A RESPONSE