గాంధీ-నెహ్రు రాజకీయాలకు బలైపోయిన టంగుటూరి

– కమ్యూనిస్టుల కుట్రలకు రాజకీయ సన్యాసం

ఒక వీధిబడిలో మాష్టారు తెలుగుపాఠం చెబుతున్నారు! ఒక పిల్లాడు లేచి సార్,ఈడికి నిన్న ఇచ్చిన పుస్తకం అమ్మేశాడు అని, ఒక అబ్బాయిని చూపుతూ చెప్పేడు.దానికి మాష్టర్ ఏమిరా వెధవా నిజమేనా అని అడిగితే.. నిజమే అని చెప్పేడు ఆకుర్రాడు. ఏమిరా వెధవా ! నీకెలా అని గద్దించగా.. నేను మొత్తం చదవేశానండీ ఆ పుస్తకాన్ని అన్నాడు ఆ పిల్లాడు. దానికి కోపంతో మాష్టర్ బడుద్దాయ్ నాకే అబద్దం చెబుతావా ? అయితే చెప్పు.. 8 వ పేజీలో ఏముంది అనగా ,మొత్తం గడగడా చెప్పేశాడాబ్బాయి. ఆశ్చర్యపోయిన మాష్టర్ వివిధ పేజీలలో ఏముందో అడిగేడు.అన్నింటిని చెప్పేడు ఆ కుర్రాడు. చివరకి 48 వ పేజీలో ఏముందో చెప్పమనగా , అసలు ఆ పుస్తకంలో 48 వ పేజీ లేదు కదసార్ అన్నాడు.దానితో మాష్టర్ ఆనందభాష్ఫాలు రాలుస్తుా.. నాయనా నువ్వు చాలా గొప్పవాడివవుతావురా అని దగ్గరకు తీసుకొని దీవించాడు. ఆ దీవెనలు ఊరకే పోలేదు. ఆ అబ్బాయి గొప్ప బారిష్టర్ అయినాడు. రెండు రాష్ట్రాలకు ముఖ్యమంత్రి కూడా అయినాడు అతని పేరే తెలుగువారు గర్వంగా ఆంథ్రకేసరి అని పిలుచుకొనే టంగుటూరి ప్రకాశం పంతులు గారు.ఒక సారి ఆయన గొప్పతనం గురించి గుర్తుచేసుకుందాం.

1872 ఆగష్టు 23 న ఒక నిరుపేద కుటుంబంలో జన్మించారు పంతులుగారు. వాళ్ళమ్మగారు పూటకూళ్ళు పెట్టేవారు.ఆరోజులలో అలా పెట్టేవారిని చిన్నతనంగా చూసేవారు. పంతులు గారు కూడా ధనవంతుల ఇళ్ళలో వారాలబ్బాయిగా వుండి చదువుకొనేవారు.అయితే నాటకాల పిచ్చెక్కువ. మెట్రిక్ తప్పాడు. హనుమంతురావ్ నాయుడు అనే మాష్టర్ సహాయంతో మద్రాస్ లో FCపాసై లా చదివి లాయర్ గా ప్రాక్టీస్ చేసేవారు. మంచి తెలివిగలవారైనందున, వాగ్దాటి పటిమ కలవాడైనందున అనతికాలంలో గొప్ప లాయర్ అయినాడు.అయినా బారిష్టర్ లేనందున, ద్వితీయ శ్రేణి లాయర్ గానే ఉండవలసి వచ్చింది. అందుకు 1904 లో ఇంగ్లండ్ వెళ్ళి బారిష్టర్ చదివేడు.అప్పుడే అక్కడ దాదాభాయ్ నౌరోజీతో పరిచయం అయింది.బారిష్టర్ అయిపోయిన తరువాత మద్రాస్ హైకోర్ట్ లో ప్రాక్టీస్ మొదలుపెట్టేరు. అప్పటి వరకు ఆంగ్లేయులు,తమిళయన్స్ మాత్రమే హైకోర్టు లాయర్స్ గా పేరుపొందేరు. తెలుగులో మొదటి హైకోర్టు లాయర్ అవటంతో చాలా కేసులోచ్చాయి.తన వాగ్దాటితో అనతికాలంలో గొప్ప బారిష్టర్ పేరు సంపాదించాడు. ఆ రోజుల్లోనో లక్షలు సంపాదించాడు. ఒకరోజు వాళ్ళావిడ డబ్బులు దాచడానికి ఖాళీ ఎక్కడాలేదండీ అన్నదంటే పరిస్థితి అర్థంచేసుకోండి.

క్రమంగా స్వాతంత్ర్య ఉద్యమం వైపు ఆకర్షితులై, హోం రూల్ లో ఉద్యమంలో చేరాడు.స్వరాజ్య అనే పత్రికను తెలుగు,తమిళ భాషలలో నడిపేరు.1921 సహాయనిరాకరణోద్యమం సందర్భంగా తన యావదాస్థితిని, ప్రజలకు అంకితం చేసి ,బారిష్టర్ గా రాజీనామా చేసి , భారతీయ కాంగ్రెస్ లో సభ్యునిగా చేరినారు. 1929 లో సైమన్ కమీషన్ రాక సందర్భంగా.. మద్రాస్ లో నిరసనలు తెలుపుతున్న ప్రజలపై ఆంగ్లేయులు కాల్పులు జరపగా, పార్థసారథి అనే యువకుడు మరణించాడు.అతనిని చూడకుండా నిషేదాజ్ఙలు విధించగా, ప్రకాశంగారు థైర్యంగా వెళ్ళారు. కాలుస్తామని తుపాకులు ఎక్కుపెట్టగా, కాల్చండిరా అంటూ గుండెలు చూపారు.అతని ధైర్యానికి మెచ్చిన ప్రజలు, ఆంధ్రకేసరి అని బిరుదిచ్చారు.

1937 లో కాంగ్రెస్, మద్రాస్ రాష్ట్రంలో ఎక్కువ సీట్లు గెలిచింది. అందరూ ప్రకాశం గారు ముఖ్యమంత్రి అనుకుంటుండగా.. గాంధీ ,నెహ్రూల ప్రీతిపాత్రుడైన రాజాజీ ముఖ్యమంత్రి అయినాడు. ప్రకాశం రెవెన్యుామంత్రి అయినారు. అయితే రెండో ప్రపంచ యుద్ధంలో భారత్ పాల్గొనడానికి నిరసనగా, ఆ పదవికి రాజీనామా చేశారు. క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని మూడు సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించారు.1946 లో ఉమ్మడి మద్రాసు రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినారు. కానీ రాజాజీ,కామరాజ్ లాంటి నాయకుల కుయుక్తులను భరించలేక, 11 నెలల తరువాత పదవికి రాజీనామా చేశారు. ప్రజా పార్టీ ని పెట్టేరు.ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలి ముఖ్యమంత్రి అయినారు. కానీ కమ్యూనిష్టులు మద్ధతు ఉపసంహరించుకోవడంతో , 1954 నవంబర్ 24 న రాజీనామా చేసి రాజకీయాల నుండి విరమించుకున్నాడు.

ప్రకాశంగారు చాలా ధైర్యస్తుడు.ముక్కుసూటిమనిషి. ఎవరినైనా లెక్క చేసేవాడు కాదు. అందులో కొన్ని. ఒక ఉద్యమంలో ప్రజల నుండి విరాళాలు సేకరించారు. కానీ ప్రకాశం పంతులంటే పడనివారు, గాంధీకి మాయమాటలు చెప్పి లెక్కలడగ మన్నారు.గాంధీ లెక్కల అడగగా ” మహాత్మా.. లక్షలు చూశాను, అలాంటిది వేయిరూపాయలు నాకు లెక్కా? అయినా ప్రతి పైసాకు లెక్కొంది చూపుతా!! మీరు మేకపాలు తాగేందుకు టాటా ల ఖర్చెంతో చెబుతారా అని ఘాటుగా బదులిచ్చారు.

1952 లో ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర ఉద్యమకాలంలో నెహ్రూ మీద రూపాయి నోటు విసిరేస్తూ.. దానిలో తెలుగులో రూపాయి అని వుంది.మరి రాష్ట్రం ఎందుకివ్వకూడదో చెప్పమన్నాడు. 1948 లో నెహ్రూ హెచ్చరికలు బేఖాతర్ చేస్తూ .. హైదరాబాద్ నిజాం దగ్గరకెళ్ళి రజాకార్ల ఉద్యమనాయకుడైన ఖాజింరజ్వీని ఉద్దేశించి, నువ్వు నీ అదృష్టాన్ని దూరం చెసుకొంటున్నావ్ అని హెచ్చరించారు. అతని దైర్యానికి అబ్బుర పడిన రజాకార్ల సైన్యం అసంకల్పితంగా అతనికి సెల్యూట్ చేశారట. వారి సెల్యూట్ అందుకొన్నprakasam-res ఆయనొక్కరే. పేదరికం అనుభవిస్తూ పెరిగేడు. లక్షలు సంపాదించాడు. చివరికి పేదరికంలోనే చనిపోయిన మహామనిషి మన ఆంథ్రకేసరి.

Leave a Reply