మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు నేతృత్వంలో అనతికాలంలోనే అభివృద్ధి, సంక్షేమ రంగాల్లో దేశంలోని ఇతర రాష్ట్రాల కు తెలంగాణ రాష్ట్రం ఆదర్శంగా, మోడల్ రాష్ట్రంగా తీర్చిదిద్దుతున్నారని రాష్ట్ర ఎక్సైజ్, క్రీడ, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ వెల్లడించారు.
అలాగే, క్రీడా రంగంలో తెలంగాణ రాష్ట్రం ఇతర రాష్ట్రాల కు ఆదర్శంగా నిలిచేలా, దేశంలోనే అత్యుత్తమ క్రీడా పాలసీని రూపొందించడానికి సీఎం కేసీఆర్ గారు క్రీడా శాఖ మంత్రి డా. శ్రీనివాస్ గౌడ్ అధ్యక్షతన క్యాబినెట్ సబ్ కమిటీ ని నియమించారు. ఈ సబ్ కమిటీ లో రాష్ట్ర మంత్రులు కల్వకుంట్ల తారక రామారావు, ఎర్రబెల్లి దయాకరరావు, సబిత ఇంద్రారెడ్డి సభ్యులు గా నియమించారన్నారు. సీఎం కేసీఆర్ అదేశాల మేరకు రాష్ట్రంలో క్రీడల అభివృద్ధి కి దేశంలోనే అత్యుత్తమ క్రీడా పాలసీ ని రూపకల్పన పై (డ్రాఫ్ట్ పాలసీ) పలు దఫాలుగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారి అధ్యక్షతన సబ్ కమిటీ సభ్యులు చర్చించి డ్రాఫ్ట్ పాలసీ ని రూపకల్పన చేశారన్నారు.
కేబినెట్ సబ్ కమిటీ రూపొందించిన డ్రాఫ్ట్ స్పోర్ట్స్ పాలసి పై రాష్ట్రానికి చెందిన ప్రముఖ క్రీడా మేధావులు, అర్జున, ద్రోణాచార్య అవార్డ్ గ్రహీత లు, ఒలంపియన్ లు, రాష్ట్ర ఒలింపిక్ కమిటీ సభ్యుల తో హైదరాబాద్ లోని తన కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ..రాష్ట్రం లో క్రీడల అభివృద్ధి కోసం ఇప్పటికే అన్ని నియోజకవర్గాల్లో క్రీడా మైదానాలను నిర్మిస్తున్నామన్నారు. ఇప్పటికే 80 శాతం స్టేడియాల నిర్మాణాలు పూర్తి చేశామన్నారు. అలాగే, దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా గ్రామీణ క్రీడల అభివృద్ధి కోసం ప్రతి గ్రామంలో ‘గ్రామీణ క్రీడా ప్రాంగణాల’ ను నిర్మిస్తున్నామన్నారు. ఈ ప్రాంగణాల్లో కబడ్డీ, వాలీబాల్, బ్యాడ్మింటన్, ఆథ్లెటిక్, ఖో ఖో లాంటి క్రీడలకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పన ను ఇప్పటికే 6 వేల గ్రామాల్లోని క్రీడా ప్రాంగణాల్లో సదుపాయాలను కల్పించామన్నారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. దేశంలో అత్యుత్తమ క్రీడా పాలసీ రూపకల్పన లో భాగంగా క్రిడాకారులకు ఎడ్యుకేషన్, ఉద్యోగాల కల్పన, క్రీడల అభివృద్ధి పై ప్రముఖ క్రీడాకారులు… బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపిచంద్, ప్రముఖ షూటింగ్ క్రీడాకారులు గగన్ నారంగ్, ప్రముఖ హాకీ క్రిడాకారులు, ట్రిపుల్ ఒలంపియన్ ముఖేష్ కుమార్, ఆథ్లెటిక్ రమేష్ ,రాష్ట్ర ఒలింపిక్ కమిటీ ప్రధాన కార్యదర్శి జగదీష్ యాదవ్ ల అభిప్రాయాలను, సలహాలను, సూచనలను తీసుకున్నారు.
ఈ సమావేశంలో పాల్గొనని క్రీడా ప్రముఖులు, అవార్డు గ్రహీత లు తమ విలువైన సలహాలు, సూచనలను వెంటనే లిఖితపూర్వకంగా స్పోర్ట్స్ కాన్సుల్టెంట్, రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ(SATS) MD కి అందజేయాలని మంత్రి శ్రీనివాస్ గౌడ్ పిలుపునిచ్చారు. వీటితోపాటు మెరుగైన ఫలితాలు సాధిస్తున్న వివిధ రాష్ట్రాల క్రీడా పాలసీ లను గోపిచంద్, గగన్ నారంగ్, ముఖేష్ కుమార్ ఆథ్లెటిక్ రమేష్, ఒలింపిక్ అసోసియేషన్ జగదీష్ యాదవ్ లు పరిశీలించి, అధ్యాయనం చేసి ప్రభుత్వానికి పలు విలువైన సూచనలు చేయాలని మంత్రి శ్రీనివాస్ గౌడ్ కోరారు.
ఈ సమీక్ష సమావేశం లో రాష్ట్ర ఒలింపిక్ కమిటీ అధ్యక్షుడు S. వేణుగోపాల చారి, స్పోర్ట్స్ చైర్మన్ అల్లిపురం వెంకటేశ్వర రెడ్డి, క్రీడా, పర్యాటకల శాఖ ప్రభుత్వ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానీయా, క్రీడా శాఖ సంయుక్త కార్యదర్శి కరోల్ రమేష్, SATS అధికారులు సుజాత, దీపక్ తదితరులు పాల్గొన్నారు.