Suryaa.co.in

Andhra Pradesh

ఏపీలో 18 సర్క్యూట్లలో టెంపుల్ టూరిజం

• ఆధ్యాత్మిక పర్యాటకంలో నూతన శకానికి నాంది..
• ఆధ్యాత్మిక పర్యాటకానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెద్దపీట..
• చారిత్రాత్మక దేవాలయాలు, ప్రసిద్ధి చెందిన ప్రాంతాలను అనుసంధానం చేస్తూ టెంపుల్ టూరిజం..
• శీఘ్ర దర్శనం, విశేష పూజలు, అభిషేకాలు, వ్రతములు తదితర అన్ని రకాల సేవలు అందుబాటులో..
– ఉప ముఖ్యమంత్రి, దేవదాయ శాఖా మంత్రి కొట్టు సత్యనారాయణ

రాష్ట్రంలో ఆధ్యాత్మిక పర్యాటకానికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న విప్లవాత్మక చర్యలతో నూతన శకానికి నాంది పలుకుతున్నామని ఉప ముఖ్యమంత్రి, దేవదాయ శాఖామాత్యులు కొట్టు సత్యనారాయణ అన్నారు. విజయవాడ పట్టణంలోని ఏపీ పర్యాటకాభివృద్ధి సంస్థ డివిజన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన టెంపుల్ టూరిజం ప్యాకేజీలు, వాహనాల ప్రారంభ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ముందుగా ఏపీటీడీసీ ఏర్పాటు చేసిన వాహనాలను మంత్రి కొట్టు సత్యనారాయణ, శాసనసభ్యులు మల్లాది విష్ణులు జెండా ఊపి గురువారం లాంఛనంగా ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి కొట్టు సత్యనారాయణ మాట్లాడుతూ ఆధ్యాత్మిక పర్యాటకానికి పెద్ద పీట వేస్తూ భక్తులకు అందుబాటులో రాష్ట్రంలోని ప్రముఖ దేవాలయ దర్శనాలను సులభతరం చేయటంలో భాగంగా దేవదాయ శాఖ, ఏపీ పర్యాటక అభివృద్ధి సంస్థ, పిల్ గ్రిమ్ పాత్ వేస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థల సమన్వయంతో ముందుకు వెళ్తున్నామన్నారు. ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి ఆలోచనలకు అనుగుణంగా రాష్ట్రవ్యాప్తంగా భక్తులకు ఆలయాల దర్శనం సులభతరం చేయటంలో భాగంగా ఒక రోజు, రెండు రోజుల ప్యాకేజీలను రూపొందించి ప్రస్తుతం 18 సర్క్యూట్ లలో అందుబాటులోకి తీసుకురావటం జరిగిందన్నారు. ఇకపై ఇతర రాష్ట్రాల్లోని ప్రముఖ దేవాలయాల దర్శనాలకు సైతం ఇలాగే టెంపుల్ టూరిజం ద్వారా ఏర్పాటు చేయనున్నామని మంత్రి కొట్టు సత్యనారాయణ పేర్కొన్నారు.

అత్యుత్తమ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఎప్పటికప్పుడు భక్తులకు అత్యాధునిక సేవలు అందుబాటులోకి తీసుకురావటానికి రాష్ట్ర ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోందని కొట్టు సత్యనారాయణ అన్నారు. గతంలో సీజనల్ గా ఏర్పాటు చేసిన టూర్ ప్యాకేజీలను నేడు డైలీ టూర్ ప్యాకేజీలుగా మార్పు చేసి భక్తులకు అందుబాటులోకి తీసుకువచ్చామన్నారు. ప్యాకేజీలో భాగంగా భక్తులకు భోజనం, వసతి ఏర్పాట్లు తదితర సేవలను కూడా అందిస్తామన్నారు. రెండు రోజుల టూర్ ప్యాకేజీలో రాత్రి బస కల్పిస్తామన్నారు. భక్తులు కోరుకున్న విధంగా విశేష పూజలు, అభిషేకాలు, వ్రతములు కూడా భక్తులకు అందుబాటులో ఉంచామన్నారు. ఈ ప్యాకేజీ యాత్రల్లో భాగంగా దేవాలయ దర్శనంలో గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసి వారికి శీఘ్ర దర్శనం చేయిస్తామని మంత్రి కొట్టు సత్యనారాయణ వివరించారు.

రాష్ట్రంలో ప్రముఖ దేవాలయాలైన తిరుమల, శ్రీశైలం, మహానంది, అహోబిలం, యాగంటి, శ్రీకాళహస్తి, అన్నవరం, సింహాచలం, అరసవల్లి, శ్రీకూర్మం, అమరావతి, భీమవరం, దాక్షారామం, సామర్లకోట, పిఠాపురం తదితర ప్రసిద్ధ ఆలయాలను అనుసంధానం చేస్తూ 18 టూర్ ప్యాకేజీలను మొదటి విడతగా ప్రారంభిస్తున్నట్లు ఉప ముఖ్యమంత్రి, దేవదాయ శాఖామాత్యులు కొట్టు సత్యనారాయణ తెలిపారు. అలాగే సాదారణ ప్యాకేజీలతో పాటు కో –బ్రాండింగ్ ఏజెన్సీ, యాత్రికులు కోరుకున్న ప్యాకేజీలు అందజేస్తున్నామని మంత్రి వివరించారు.

మన రాష్ట్ర భక్తుల సౌకర్యార్థం రాష్ట్ర ప్రభుత్వం వినూత్నంగా తీసుకువచ్చిన ఆధ్యాత్మిక టూర్ ప్యాకేజీలతో క్షేమంగా, ప్రముఖ దేవాలయాలను సులభంగా సందర్శించి దైవదర్శనం చేసుకోగలరని రాష్ట్ర ప్రణాళికాబోర్డు ఉపాధ్యక్షులు, శాసనసభ్యులు మల్లాది విష్ణు అన్నారు. వృద్ధులు, చిన్నారులను సైతం వెంట తీసుకువెళ్లినా ఎటువంటి ఇబ్బందులు పడకుండా సౌకర్యవంతంగా, ప్రశాంతంగా, అహ్లాదకరంగా యాత్ర ముగించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుందని ఎమ్మెల్యే మల్లాది విష్ణు వివరించారు.
కార్యక్రమంలో ఎగ్జిక్యూటివ్ డైరక్టర్ ఏఏఎల్ పద్మావతి, జనరల్ మేనేజర్ (ట్రాన్స్ పోర్ట్) ఆర్. శశిధర్, డివిజనల్ మేనేజర్ పి.ఎన్. కృష్ణ చైతన్య, అసిస్టెంట్ మేనేజర్ కె. శ్రీధర్, సెంట్రల్ రిజర్వేషన్ మేనేజర్ ఎం. సురేష్, ఏపీటీడీసీ అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE