– రోడ్డు ప్రమాద బాధితులకు నగదు రహిత చికిత్స పథకం -2025
– ప్రమాదం జరిగిన వారం రోజుల్లోపు ఒక్కో బాధితుడికి 1.5 లక్షల ఆర్థిక పరిమితి వరకు నగదు రహిత చికిత్స..
– ఆయుష్మాన్ భారత్ PM – JAY కింద ఎంప్యానల్ అయిన ప్రతి ఆసుపత్రిలో పథకం వర్తింపు
– రోడ్డు ప్రమాద బాధితులకు క్యాష్ లెస్ ట్రీట్మెంట్ పథకం పై ప్రతి పోలీస్ స్టేషన్ లో అవగాహన కల్పించాలి.
– రోడ్డు ప్రమాద బాధితులకు నగదు రహిత చికిత్స పథకం అమలు పై సన్నాహక సమీక్షా సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్
హైదరాబాద్: మోటారు వాహనాల చట్టం, 1988లోని సెక్షన్ 162 ప్రకారం భారత ప్రభుత్వం “రోడ్డు ప్రమాద బాధితులకు నగదు రహిత చికిత్స పథకం, 2025″ను ప్రారంభించింది. ఈ పథకం తెలంగాణ లో అమలు పై రవాణా, పోలీస్, హెల్త్, ఇన్సూరెన్స్, NIC, విభాగాల అధికారులతో సచివాలయంలోని తన ఛాంబర్ లో రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్షా సమావేశం నిర్వహించారు.
మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ ..రోడ్డు ప్రమాద బాధితులకు నగదు రహిత చికిత్స పథకం తీసుకొచ్చిన కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ గారికి ధన్యవాదాలు తెలిపారు. రోడ్డు ప్రమాదాలు జరిగి ఎవరు చనిపోకుండా ఉండడానికి ఈ పథకం ఎంతగానో ఉపయోగపడుతుంది. దీనిపై కింద స్థాయి పోలీస్ అధికారులకు ఇతర విభాగాల అధికారులకు సామాన్య ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు.
ఈ పథకం విజయవంతం కావడానికి రవాణా ,పోలీస్ ,హెల్త్ ,ఇన్సూరెన్స్ ,NIC విభాగాలు కలిసి జిల్లా ,రాష్ట్ర స్థాయిలో సమన్వయం చేసుకోవాలని ఆదేశించారు. గతంలో రోడ్డు ప్రమాదాలు జరిగితే పోలీసులకు సమాచారం ఇస్తే తమ మీద కేసులు అవుతాయనే భయం ఉండేదని అది అపోహ మాత్రమే అని తెలిపారు. ప్రమాదాలు జరగగానే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు.
సమీక్షా సమావేశంలో రోడ్డు ప్రమాద బాధితులకు వెంటనే చికిత్స అందించేలా అన్ని సౌకర్యాలతో మరిన్ని ట్రామా సెంటర్లు ఏర్పాటు చేయాలని సూచించారు. రాష్ట్రంలోని అన్ని పోలీస్ స్టేషన్ లలో ఈ పథకం పై అవగాహన కల్పించాలని డీజీపీ జితేందర్ ను ఆదేశించారు. మన జీవితంలో రోడ్డు ప్రమాదాల నుండి ఒక ప్రాణం రక్షించిన గొప్ప సంతృప్తి ఇస్తుందని ఇది ప్రతి ఒక్కరూ అలవర్చుకోవాలని సూచించారు. ఇది సామాజిక బాధ్యతగా అధికారులు వ్యవహరించాలని సూచించారు.
ఈ పథకం పై సమాచార ప్రసార శాఖ ప్రత్యేక కార్యక్రమాలు చేయాలని ఆదేశించారు. పేదల్లో పేదలను రక్షించడానికి ఈ పథకం ఉపయోగపడుతుందని వెల్లడించారు. ఈ పథకం విజయవంతం కావడానికి అన్ని విభాగాల అధికారులు ఎవరి విధులు వారు సక్రమంగా నిర్వహించాలని తెలిపారు.
సమీక్షా సమావేశంలో డీజీపీ జితేందర్ ,అహ్మద్ నదీమ్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ, క్రిస్టినా జడ్ చొంగ్తు హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫర్ ప్రిన్సిపల్ సెక్రటరీ,షాట్ చైర్మన్ శివసేన రెడ్డి, రవాణా శాఖ కమిషనర్ సురేంద్ర మోహన్, జేటిసి లు ,యూనిసెఫ్ ,NIC ప్రతినిధులు ,వివిధ విభాగాల అధికారులు పాల్గొన్నారు.