Suryaa.co.in

Telangana

పొట్టి శ్రీరాములు పేరు అందుకే తొలగించాం

– చర్లపల్లి రైల్వే టెర్మినల్ కు పొట్టి శ్రీరాములు పేరు పెట్టుకుందాం
– చిత్తశుద్ధి ఉంటే కిషన్ రెడ్డి, బండి సంజయ్ కేంద్రం నుంచి అనుమతులు తీసుకురావాలి
– బీసీ రిజర్వేషన్ల సాధనకు నేను నాయకత్వం వహిస్తా
– కామారెడ్డి ప్రకటనకు మేం కట్టుబడి ఉన్నాం
– శాసనసభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

హైదరాబాద్ : రాజకీయాలు కలుషితమయ్యాయో నాయకుల ఆలోచనలు కలుషితమయ్యాయో తెలియడం లేదు. పొట్టి శ్రీరాములు చేసిన కృషిని ఎవరూ తక్కువగా చూడటంలేదు. వారి ప్రాణత్యాగాన్ని గుర్తించి అందరూ స్మరించుకోవాలి. పరిపాలనలో భాగంగా కొన్ని పాలనా పరమైన నిర్ణయాలు తీసుకున్నాం. రాష్ట్ర ఏర్పాటుకు కృషి చేసిన వారిని స్మరించుకుని వారి పేర్లు పెట్టుకున్నాం.

రాష్ట్ర పునర్విభజన తరువాత గత పదేళ్లుగా ఈ ప్రక్రియ కొనసాగుతోంది. కొన్ని వర్గాలకు కొందరు అపోహలు కలిగించే ప్రయత్నం చేస్తున్నారు. కేంద్ర పదవుల్లో ఉన్నవారు కూడా ఇలా చేయడం సమంజసం కాదు. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి కాళోజీ పేరు పెట్టుకున్నాం. ఇది ఎన్టీఆర్ ను అగౌరవపరిచినట్టు కాదు.

ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ యూనివర్సిటీకి ప్రొఫెసర్ జయశంకర్ పేరు పెట్టుకున్నాం. వైఎస్ పేరుతో ఉన్న హార్టికల్చర్ యూనివర్సిటీకి కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు పెట్టుకున్నాం. వెంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీకి పీవీ పేరును పెట్టుకున్నాం. ఇందులో భాగంగానే పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీకి సురవరం ప్రతాప్ రెడ్డి పేరు పెట్టుకున్నాం.

ఏపీలో ఆ పాత పేర్లతో కొనసాగుతున్న యూనివర్సిటీలకు తెలంగాణలో పేర్లు మార్చుకున్నాం. ఒకే పేరుతో రెండు యూనివర్సిటీలు ఉంటే పరిపాలనలో గందరగోళం ఉంటుంది. అందుకే తెలంగాణ రాష్ట్రంలోని యూనివర్సిటీలకు, సంస్థలకు తెలంగాణ పేర్లు పెట్టుకుంటున్నాం. అంతే కానీ వ్యక్తులను అగౌరవపరిచేందుకు కాదు. విశాల ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలకు… బాధ్యతాయుత పదవుల్లో ఉన్నవారు కులాన్ని ఆపాదిస్తున్నారు.

కుల, మత ప్రాతిపదికన విభజించి రాజకీయ ప్రయోజనాలు పొందాలనుకుంటే అది తప్పు. గుజరాత్ లో సర్దార్ వల్లభాయ్ పటేల్ పేరుతో ఉన్న స్టేడియం పేరు తొలగించి ప్రధాని మోదీ పేరు పెట్టారు. మేం అలాంటి తప్పిదాలు చేయలేదు.చేయం. చర్లపల్లి రైల్వే టెర్మినల్ కు పొట్టి శ్రీరాములు పేరు పెట్టుకుందాం. చిత్తశుద్ధి ఉంటే కిషన్ రెడ్డి, బండి సంజయ్ కేంద్రం నుంచి అనుమతులు తీసుకురావాలి.

బల్కంపేట నేచర్ క్యూర్ హాస్పిటల్ కు రోశయ్య పేరు పెట్టుకుందాం. రోశయ్య సేవలను కీర్తించుకునేలా అక్కడ వారి విగ్రహాన్ని ఆవిష్కరించుకుందాం. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే బీసీ రిజర్వేషన్లు 42 శాతానికి పెంచుతామని రాహుల్ గాంధీ ఆనాడు హామీ ఇచ్చారు. మేం బాధ్యతలు చేపట్టగానే 4 ఫిబ్రవరి 2024 లో బీసీ కులగణన ప్రక్రియను మొదలు పెట్టాం. కులసర్వేలో పాల్గొన్న అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నా.

తెలంగాణ సమాజం బలహీన వర్గాలకు రిజర్వేషన్ల విషయంలో ఏకాభిప్రాయంతో ఉన్నారని సందేశం ఈ సభ ద్వారా పంపించాలనుకున్నాం. ఇందుకు సహకరిస్తున్న అందరికీ ధన్యవాదాలు. బీసీ రిజర్వేషన్లు 37 శాతానికి పెంచాలని గత ప్రభుత్వం గవర్నర్ కు ప్రతిపాదన పంపించింది.

బీసీ రిజర్వేషన్లు 42 శాతం పెంచేందుకు గత ప్రభుత్వం గవర్నర్ కు పంపిన ప్రతిపాదనను ఉపసంహరించుకుని కొత్త ప్రతిపాదన పంపిస్తున్నాం. 4 ఫిబ్రవరిని సోషల్ జస్టిస్ డే గా సభ ద్వారా తీర్మానం చేశాం. అందరినీ సంప్రదించి బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలనే ఈ బిల్లును తీసుకొచ్చాం. సభా నాయకుడిగా నేను మాట ఇస్తున్నా. బీసీ రిజర్వేషన్ల సాధనకు నేను నాయకత్వం వహిస్తా.

అఖిలపక్ష నాయకులు అందరం కలిసికట్టుగా వెళ్లి ప్రధానిని కలుద్దాం. బీసీ రిజర్వేషన్లు 42 శాతం పెంచేందుకు అవసరమైన చట్టపరమైన చర్యలు తీసుకుందాం. ఇందుకోసం ప్రధాని మోదీ అపాయింట్ మెంట్ ఇప్పించే బాధ్యత కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, బీజేపీ సభాపక్షనాయకుడిని కోరుతున్నా.

రాహుల్ గాంధీని కూడా కలిసి పార్లమెంట్ లో ఈ అంశాన్ని ప్రస్తావించాలని కోరదాం రాహుల్ గాంధీ సమయం తీసుకోవాల్సిందిగా మా పార్టీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కి బాధ్యత అప్పగిస్తున్నా. సభా నాయకుడిగా నేను మాట ఇస్తున్నా.. కులసర్వేలో పొందుపరిచిన బీసీల లెక్క వందశాతం సరైంది.

బీసీ బిల్లును పార్లమెంటులో ఆమోదించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉంది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు సాధించే వరకు విశ్రమించేది లేదు. కామారెడ్డి ప్రకటనకు మేం కట్టుబడి ఉన్నాం.

LEAVE A RESPONSE