– పరిటాల శ్రీరామ్
రాజానగరం : తూర్పుగోదావరి జిల్లాలోని రాజానగరం నియోజకవర్గం, సీతానగరం మండలం, మునికూడలి గ్రామం సోమవారం ఉత్సవ వాతావరణంలో నిండిపోయింది. తెలుగుదేశం పార్టీ (టీడీపీ) వ్యవస్థాపకుడు, దివంగత ముఖ్యమంత్రి దివంగత నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) విగ్రహావిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది.
ముఖ్య అతిథిగా హాజరైన ధర్మవరం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి పరిటాల శ్రీరామ్ ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం (ఎన్.డి.ఎ.) రాష్ట్రాభివృద్ధికి కట్టుబడి ఉందని, మరో 15 ఏళ్లపాటు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వానిదే అధికారం అని ధీమా వ్యక్తం చేశారు. కూటమి పాలనలో అన్ని వర్గాల అభివృధి, సంక్షేమం ప్రధాన లక్ష్యంగా ఉంటుందని స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా రాజమండ్రి రూరల్ శాసన సభ్యుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, రాజానగరం నియోజకవర్గం శాసన సభ్యుడు బత్తుల బల రామకృష్ణతో కలిసి, రుడా చైర్మన్, తెలుగుదేశం పార్టీ రాజనగరం నియోజకవర్గ ఇన్ఛార్జి, రాష్ట్ర కార్యదర్శి బొడ్డు వెంకటరమణ చౌదరి బొబ్బిలంక నుంచి మునికూడలి వరకు భారీ బైక్ ర్యాలీని నిర్వహించారు. ఈ ర్యాలీలో కూటమి శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నాయి.
బొడ్డు వెంకటరమణ చౌదరి మాట్లాడుతూ, ఎన్టీఆర్ ఒక వ్యక్తి కాదు, ఆయనో చరిత్ర అని, తెలుగు ప్రజల గుండెల్లో ఆయన చిరస్మరణీయంగా నిలిచిపోతారని కొనియాడారు. టీడీపీకి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎన్టీఆర్ చేసిన సేవలను ఆయన స్మరించుకున్నారు. ఈ విగ్రహావిష్కరణ కార్యక్రమం కూటమి శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపిందని పార్టీ నాయకులు తెలిపారు.