Suryaa.co.in

Andhra Pradesh

అమరావతికి ఇచ్చే ఆర్థిక సాయం మొత్తాన్ని గ్రాంట్‌గా మార్చాలి

`పోలవరం నిర్వాసితులకు న్యాయం చేయాలి
` సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ

విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతి నిర్మాణానికి కేంద్రం ఇచ్చే ఆర్థిక సాయం మొత్తాన్ని గ్రాంట్‌గా మార్చాలని, పోలవరం నిర్వాసితులకు పూర్తి స్థాయిలో న్యాయం చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ గురువారం ఒక ప్రకటనలో కేంద్రాన్ని కోరారు.

రాష్ట్ర విభజనతో ఆర్థిక ఇబ్బందులు, రాజకీయ కారణాలతో అభివృద్ధికి నోచుకోని అమరావతి రాజధాని నిర్మాణం కోసం 15వేల కోట్ల రూపాయలు రుణం ఇప్పిస్తామని కేంద్ర బడ్జెట్‌ ప్రవేశపెట్టిన సందర్భంగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ పేర్కొనటాన్ని ఆక్షేపించారు. రాజధాని నిర్మాణానికి కేంద్ర బడ్జెట్‌లో పేర్కొన్న రూ.15వేల కోట్లు కేంద్ర గ్రాంట్‌గా ప్రకటించాలని డిమాండ్‌ చేశారు.

వైసీపీ ప్రభుత్వంలో అప్పుల్లో కూరుకుపోయిన ఆంధ్రప్రదేశ్‌కు అమరావతి నిర్మాణం కోసం ప్రపంచ బ్యాంకు ద్వారా మళ్లీ రుణభారం మోపటం మూలిగే నక్కపై తాటికాయ పడ్డ చందనగా ఉందన్నారు. రుణాలు ఇప్పిస్తాం అనటాన్ని రాష్ట్ర ప్రజలు దీన్ని సమర్థించరని స్పష్టం చేశారు. అలాగే పోలవరం ప్రాజెక్టు నిర్మాణ విషయంలో నిర్వాసితులకు పరిహారంపై కేంద్రం స్పష్టత ఇవ్వకపోవటంతో వారు ఆందోళనలో ఉన్నారని చెప్పారు.

నిర్వాసితులకు నిర్వాసితులకు కేంద్రమే రూ.30 వేల కోట్లు గ్రాంట్‌ ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా గుర్తించి రుణభారాన్ని రాష్ట్ర ప్రభుత్వంపై మోపటం దుర్మార్గం అన్నారు. మోదీ ప్రభుత్వం పదేళ్లుగా ఆంధ్రప్రదేశ్‌ పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిందని విమర్శించారు. అమరావతి రాజధాని, పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి పూర్తి బాధ్యత కేంద్రం తీసుకోవాలని రామకృష్ణ డిమాండ్‌ చేశారు.

LEAVE A RESPONSE