శాసన వ్యవస్థ చట్టాలు చేయకూడదని కోర్టులు చెప్పలేవు

– చట్టాలు చేసే అధికారం శాసనవ్యవస్థకు ఉంటుంది
– రాజ్యాంగంలో ప్రతీ వ్యవస్థ స్వతంత్రమైనదే
– వ్యవస్థలు ఎవరి పరిధిలో వారు ఉంటే మంచిది
– కుండబద్దలు కొట్టిన సీఎం జగన్‌

ఏపీ అసెంబ్లీలో వికేంద్రికరణపై చర్చ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మాట్లాడుతూ.. వ్యవస్థల పరిధిపై రాజ్యాంగం స్పష్టత ఇచ్చిందని తెలిపారు. రాజ్యాంగంలో ప్రతీ వ్యవస్థ స్వతంత్రమైనదేనని తెలిపారు. వ్యవస్థలు ఎవరి పరిధిలో వారు ఉంటే సమస్యలు రావని అ‍న్నారు. మిగిలిన వ్యవస్థలన్నీ సజావుగా సాగుతాయని తెలిపారు. శాసన వ్యవస్థ చట్టాలు చేయకూడదని కోర్టులు చెప్పలేవని తెలిపారు. చట్టాలు చేసే అధికారం శాసనవ్యవస్థకు ఉంటుందని తెలిపారు. మంచి చట్టాలు చేస్తే ప్రజలు మరలా ఎన్నుకుంటారని తెలిపారు.

మంచి చట్టాలు చేయకుంటే ప్రజలు ఇంటికి పంపిస్తారని తెలిపారు. గత ప్రభుత్వం చేసిన విధానాలు నచ్చలేదు కాబట్టే ప్రజలు తమకు తీర్పు ఇచ్చారని తెలిపారు. ఇది ప్రజాస్వామ్య గొప్పతనమని తెలిపారు. శాసనసభ ఓ చట్టాన్ని చేయాలా వద్దా అని కోర్టులు నిర్ణయంచలేవన్నారు. ఆరు నెలల్లో రాజధానిని వేల కోట్లతో పూర్తి చేయాలని చెప్పడం సాధ్యం కాని టైం లైన్‌ను నిర్దేశించడం సరికాదన్నారు. మొదటి తెలంగాణ ఉద్యమం అభివృద్ధి లేకపోవడం వల్ల వచ్చింది. రెండోసారి తెలంగాణ ఉద్యమం అభివృద్ధి అంతా ఒకే దగ్గర ఉంటడం వల్ల వచ్చిందని చెప్పారు. వికేంద్రీకరణ వల్ల ఏపీ అన్ని ప్రాంతాలకు న్యాయం జరుగుతుందని కేంద్రం ఏర్పాటు చేసిన శివరామకృష్ణన్‌ కమిటీనే చెప్పిందని తెలిపారు. ఇదే విషయాన్ని పరిగణలోకి తీసుకొని 3 రాజధానుల బిల్లు తీసుకొచ్చామని అన్నారు.

రాజ్యాంగం ఆధారంగానే పరిపాలన సాగుతుంది: బుగ్గన రాజేంద్ర నాథ్
ఏపీ అసెంబ్లీలో వికేంద్రికరణపై చర్చ సందర్భంగా మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ మాట్లాడుతూ ప్రాథమిక హక్కులపై రాజ్యాంగంలో స్పష్టత ఉందని తెలిపారు. రాజ్యాంగం ఆధారంగానే పరిపాలన సాగుతుందని అన్నారు. ఒకరి హక్కును మరొకరు లాక్కోకూడదని తెలిపారు. వెనకబడిన జిల్లాల్లో అసమానతలు ఉన్నాయని తెలిపారు. ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాలు అన్ని రంగాల్లో వెనకబడ్డాయని అన్నారు. ప్రాంతాల మధ్య అసమానతలు తొలగించాలని రాజ్యాంగంలో ఉందని తెలిపారు.

సమానత్వంపై దృష్టి పెట్టాలని ఎన్నో అనుభవాలు చెబుతున్నాయని తెలిపారు. భారతదేశంలో 1.63లక్షల చదరపు కీలో మీటర్లలో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం 8వ స్థానంలో ఉందని తెలిపారు. అదే విధంగా స్థూల ఉత్పత్తిలో 2019-2020 ప్రకారం దాదాపు తొమ్మిదిన్నర కోట్లు ఉందని అన్నారు. 2014లో జరిగిన పునర్‌ వ్యవస్థీకరణ కారణంగా తలసరి ఆదాయం చాలా తగ్గిందని తెలిపారు.

నార్త్‌ కోస్టల్‌ ఆంధ్రప్రదేశ్‌ గురించి మాట్లాడినా వలస కూలీలు అంటే శ్రీకాకుళం, విజయనగరం నుంచి వస్తారని తెలిపారు. దాదాపు 20 లక్షలపైగా మంది ఇక్కడి నుంచి వలసపోతున్నారని అ‍న్నారు. ఇటువంటి పరిస్థితుల్లో సమానత్వం అనేది ప్రభుత్వ బాధ్యత అని గుర్తుచేశారు. కుప్పం వాళ్లు సమారు 60 వేల మందికి పైగా వలసవెళ్లి బయట ప్రాంతాల్లో బతుకుతున్నారని తెలిపారు.

ఎటువంటి రాజధాని కట్టాలని తాము ప్రణాళిక వేశామంటే మొట్టమొదటి దశలోనే రోడ్లు, కాలువలకు లక్షా పదివేల కోట్లు కేటాయించాలనుకున్నామని తెలిపారు. గత ప్రభుత్వ పాలకులకు రాజధాని ప్లానింగ్‌ కోసమే ఐదేళ్లు పట్టిందని అన్నారు. ఏడేళ్లలో రాజధానికి కట్టడానికి వీలవుతుందా?అని ప్రశ్నించారు.

అమరావతిలో అభివృద్ధి చేయబోమని ఎవరైనా చెప్పారా? అని అన్నారు. ప్రభుత్వం సభకు సమాధానం చెప్పాలి.. సభ ప్రజలకు సమాధానం చెప్పాలని అన్నారు. సీఆర్‌డీఏ చట్టాన్ని అసెంబ్లీ చేసిందని గుర్తు చేశారు. చంద్రబాబు నగరం కట్టాలనుకున్నారా.. రాజధాని కట్టాలనుకున్నారా? అని ప్రశ్నించారు. చట్టసభల్లో తీసుకున్న నిర్ణయాలను ఏవిధంగానైనా మార్చాలనే శక్తి కోర్టులకు ఉండటం సరికాదని ఓ తీర్పులో ఉన్నట్లు తెలిపారు.

హైకోర్టు జాగ్రత్తగా, ఎక్కువగా స్క్రూటినీ చేయాల్సిన అవసరం లేదని, ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంలో హద్దుదాటి వెళ్లకూడదని టాటా సెల్యులార్ వర్సెస్‌ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో తీర్పు ఉన్నట్లు గుర్తుచేశారు.

Leave a Reply