Suryaa.co.in

Telangana

సీమకు గోదావరి జలాల తరలింపు నిర్ణయం కేసీఆర్-జగన్‌దే

– వాళ్లిద్దరు నాలుగుసార్లు భేటీ అయ్యారు
– వివరాలు బుగ్గ-ఈటల మీడియాకు వెల్లడించారు
– నాకు తెలంగాణ ప్రయోజనాలే ముఖ్యం
– పొలిటికల్ ఫైట్‌లో న్యాయం జరగకపోతే లీగల్ ఫైట్
– బనకచర్ల-గోదావరి జలాలపై అఖిలపక్ష సమావేశంలో తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి

హైదరాబాద్: రాయలసీమకు గోదావరి జలాల తరలింపు నిర్ణయం నాటి సీఎం కేసీఆర్-ఏపీ సీఎం జగన్‌దే అని తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. ఆ మేరకు వారద్దరి భేటీ, తర్వాత అప్పటి మంత్రులు ఈటల-బుగ్గన నిర్వహించిన ప్రెస్‌మీట్‌ను రేవంత్ గుర్తు చేశారు.

రేవంత్‌రెడ్డి ఇంకా ఏమన్నారంటే..

మా ప్రభుత్వానికి తెలంగాణ రైతాంగ ప్రయోజనాలే ముఖ్యం. రాజకీయాలకు అతీతంగా రైతుల ప్రయోజనాలు ఎజెండాగా మనం ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది. ఆ దిశగా మనందరం కలిసి పనిచేయాలి. రాజకీయ లబ్ది కోసం ఈ సమావేశం ఏర్పాటు చేయలేదు. రాష్ట్ర ప్రయోజనాల కోసమే ఈ సమావేశం ఏర్పాటు చేశాం.

తెలంగాణ ఏర్పడిన తరువాత కేంద్ర ప్రభుత్వం 21-9-2016 అపెక్స్ కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేసింది. ఆ సమావేశంలో మొట్టమొదట గోదావరిపై 3 వేల టీఎంసీలు సముద్రంలో కలుస్తున్నాయని ఆనాటి సీఎం కేసీఆర్ ప్రతిపాదన ఇచ్చారు. ఆ సమావేశంలో హరీష్ రావు కూడా పాల్గొన్నారు. మళ్లీ 13 ఆగస్టు 2019 లో రాయలసీమను రతనాల సీమ చేస్తామని ఆనాటి తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రకటించారు.

గోదావరి జలాలలను రాయలసీమకు తరలించాలని కేసీఆర్, జగన్ ప్రగతి భవన్ లో నాలుగుసార్లు సమావేశమయి నిర్ణయం తీసుకున్నారు. ఇరు రాష్ట్రాల సీఎంల భేటీ వివరాలను ఆనాటి మంత్రులు ఈటెల రాజేందర్ , బుగ్గన రాజేంద్ర ప్రసాద్ ప్రెస్ మీట్ పెట్టి వెల్లడించారు.

ఈ మీటింగ్ మినిట్స్ ను రిఫరెన్స్ గా చూపి ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు బనకచర్లను గుదిబండగా మార్చే ప్రయత్నం చేస్తోంది. ఇందుకు సంబంధించి అఫీషియల్ డాక్యుమెంట్స్ మీకు అందించడానికి సిద్ధంగా ఉన్నాం. బనకచర్ల అంశంపై పార్లమెంట్ సమావేశాల్లో ప్రధాని సహా, అందరి అపాయింట్మెంట్ తీసుకుని కలిసి తెలంగాణ సమస్యలను వివరిస్తాం. పొలిటికల్ ఫైట్ లో న్యాయం జరగకపోతే లీగల్ ఫైట్ చేద్దాం. ఈ విషయంలో మనందరం కలిసికట్టుగా ముందుకు వెళతాం.

LEAVE A RESPONSE