– ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాసిన రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ డాక్టర్ జీ. చిన్నారెడ్డి
హైదరాబాద్: ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల నియామకం కోసం ప్రభుత్వమే ప్రత్యేకంగా కార్పొరేషన్ ను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ డాక్టర్ జీ. చిన్నారెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డికి లేఖ రాశారు.
రాష్ట్రంలో వేలాది మంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు ప్రభుత్వ శాఖల్లో విధులు నిర్వహిస్తున్నారని, అయితే వారిని ప్రైవేట్ ఏజెన్సీలు నియమించడం వల్ల శ్రమ దోపిడీకి గురవుతున్నారని చిన్నారెడ్డి పేర్కొన్నారు.
ప్రైవేట్ రిక్రూట్మెంట్ ఏజెన్సీలు ఈ పీ ఎఫ్, ఈ ఎస్ ఐ వంటి సౌకర్యాలు ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఇవ్వకపోవడంతోపాటు దాదాపు 20శాతం వరకు వేతనాల్లో కోత విధిస్తున్నారని, పైగా ఆ వేతనాలు కూడా ప్రతి నెల ఆలస్యం చేస్తున్నారని చిన్నారెడ్డి సీఎంకు రాసిన లేఖలో పేర్కొన్నారు.
ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల నియామకం కోసం ప్రభుత్వ పరంగా నూతనంగా కార్పొరేషన్ ను ఏర్పాటు చేయాలని ఇటీవల జరిగిన కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారని చిన్నారెడ్డి ఆ లేఖలో వివరించారు.
ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల నియామకం కోసం 2023 కంపెనీస్ యాక్ట్ 8 ప్రకారం ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం కార్పొరేషన్ ను ఏర్పాటు చేయనున్నట్లు చిన్నారెడ్డి తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో కూడా ఇదే తరహా ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల కార్పొరేషన్ ను ప్రభుత్వ పరంగా ఏర్పాటు చేయాలని చిన్నారెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరారు.