ధీరత్వానికి వారసత్వం దీనత్వం..!

వారసుల అడ్డాలో ఝాన్సీ వారసుల కష్టాలు

ఒక జాతిని ఉర్రూతలూగించిన వీరమహిళ…ఒంటి చేత్తో విదేశీ ముష్కరులను ఎదిరించి చరిత్రలో నిలిచిపోయిన ధీరవనిత..పౌరుషానికి ప్రతీకగా… ధీరత్వానికి పట్టుగొమ్మగా..మాతృత్వానికి చిహ్నంగా..
భారతీయ స్త్రీ ఎప్పటికీ గర్వంగా చెప్పుకునే ఆదర్శ నారీమణిగా పేరు గాంచిన ఝాన్సీ లక్ష్మీభాయి.. ఇప్పుడామె వారసులు ఎక్కడ…

నెహ్రూ వారసులు ఆయన తర్వాత ఇంకో రెండు తరాల వరకు ఈ దేశాన్ని అప్రతిహతంగా పరిపాలించారు.. మరో తరం కూడా ఉవ్విళ్లూరుతున్నా అవకాశం అంది రావడం లేదు.. ఇంకా చాలా మంది నాటి నేతల వారసులు ప్రజలు కట్టబెట్టిన పదవులు.. ప్రభుత్వాలు సమకూరుస్తున్న సౌకర్యాలు అనుభవిస్తూ మహానేతలుగా చలామణీ అవుతున్నారు..

అసలు ఈ దేశమే వర్తమానంలో వారసుల అడ్డాగా విరాజిల్లుతోంది.. ఎక్కడ చూసినా ఎవరో ఒక నేత వారసులు ఏదో ఒక రూపంలో పెత్తనం చెలాయిస్తూనే ఉన్నారు. స్వతంత్ర పోరాటం వాసనే తెలియని.. ఆ వివరమే ఎరగని ఎందరో స్వతంత్ర ఫలాలను..ప్రయోజనాలను పొందుతూ నిస్సిగ్గుగా బోర విరుచుకు తిరుగుతున్నారు.

మరి ఇంతటి ధీరత్వానికి పేరు గాంచిన..
సంచలనాలకు కారణమైన ఝాన్సీలక్ష్మీబాయి
వంశంలో ఎవరి గురించైనా మనకు తెలుసా…
నెహ్రూ కూతురు ఎవరు..
ఇందిర..
ఆ ఇందిర కొడుకులు
రాజీవ్..సంజయ్..
వైఎస్ రాజశేఖర రెడ్డి కొడుకు జగన్..
కూతురు షర్మిల..
కె సి ఆర్ కొడుకు
కె టి ఆర్..
కూతురు కవిత..
కరుణానిధి
కొడుకు స్టాలిన్..

ఇలా మనకి ఎన్ని వివరాలు తెలుసో కదా..
మరి ఝాన్సీ వారసుల గురించి..ఎబ్బే…

యుద్ధం చేస్తున్నప్పుడు కూడా వదలకుండా చీరకు కట్టుకుని గుర్రంపై తమతో పాటు రణభూమిలో తిప్పిన
పిల్లాడు..ఝాన్సీ కొడుకు దామోదర రావు..అప్పుడు ఆ పిల్లాడికి ఎనిమిదేళ్లు.. అమ్మ ప్రేమతో పాటు ఆమె
ధీరత్వాన్ని సైతం ఆస్వాదించిన వీరపుత్రుడు.. మరి ఇంతటి ఘనచరిత్రకు వారసుడైన..ఒక మహాసంగ్రామానికి ప్రత్యక్ష సాక్షి అయిన ఆ పిల్లాడు ఆటు తర్వాత ఏమయ్యాడు!?

ఇంతకీ అసలు విషయం ఏమిటంటే దామోదర రావు..ఆయన వారసులు ఎవరికీ తెలియని అతి సామాన్యుల్లా ఇండోర్(అహల్యా నగర్)లో సామాన్య జీవితం గడిపారు. ఏ ప్రభుత్వమూ ఆ రాయల్ ఫ్యామిలీimage ఆనుపానులు పట్టించుకోని దురవస్థలో అద్దె కొంపలో నిరుపేద జీవితాన్నీ గడిపింది. మొన్న 2021 వరకు ఇండోర్లోనే కాలం వెళ్లబుచ్చిన ఆ కుటుంబం అటు తర్వాత నాగపూరుకు మకాం మార్చింది.అక్కడ ఝాన్సీలక్ష్మి ఆరవ తరానికి చెందిన పిల్లవాడు ఓ సాఫ్టు వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు.

తమ గొప్ప వారసత్వానికి గుర్తుగా ఆ ఇంట్లో పుట్టే ప్రతి బిడ్డ పేరులో చివర ఝాన్సీవాలే ఉంటుంది.
అదిగో..పైన ఫోటోలో నించుని కనిపిస్తున్న ఆయన రాణీ ఝాన్సిలక్ష్మీ భాయి మనవడికి మనవడి కొడుకు..అక్కడ ఆయనతో పాటు ఉన్నది ఆయన భార్య..ఇద్దరు పిల్లలు.. నీలం చొక్కా వేసుకుని హుందాగా కనిపిస్తున్న వ్యక్తి ఆయన తండ్రి అరుణ్ రావు ఝాన్సీవాలే..మధ్యప్రదేశ్ విద్యుత్ బోర్డులో అసిస్టెంట్ ఇంజనీరుగా పని చేసి రిటైరయ్యారు.ఇండోర్ ధన్వంతరీ నగర్లో స్వార్జితంతో ఆయన
ఇల్లు కొనుక్కోగలిగారు.

ఝాన్సీలక్ష్మీ కొడుకు దామోదర్ 1906 మే 20న తన 57 సంవత్సరాల వయసులో కన్ను మూసారు. ఆయన వారసుడు లక్ష్మణరావు బ్రిటిష్ వారు ఇచ్చిన 200 రూపాయల ఫించనుతో జీవనం సాగించారు.స్వతంత్రం వచ్చిన తర్వాత భారత ప్రభుత్వం అంత వరకు బ్రిటిష్ వారు ఉండనిచ్చిన
ఇల్లు ఖాళీ చేసే వరకు వదిలిపెట్టలేదు. తీవ్ర ఒత్తిడి తేవడంతో ఝాన్సీలక్ష్మిభాయి వారసులు ఉన్న ఇంటిని ఖాళీ చేసి ఇండోర్ లోని పీర్ గలీ ప్రాంతంలో అద్దె కొంపలోకి మారాల్సి వచ్చింది..

ఒక మహారాణి..దీరవనిత..
స్వతంత్ర సమరయోధురాలు..
చారిత్రక మహిళ..
ఝాన్సీలక్ష్మి వారసుడు
ఒక దశలో కోర్టులో టైపిస్టుగా
రోజు వారీ వేతనంపై పనిచేసిన గొప్ప వ్యవస్థ మనది.ఏ రోజు తిన్నారో..ఎన్నిసార్లు పస్తులు పడుకున్నారో..ఆ కుటుంబానికి..ఆ దేవుడికే తెలియాలి..!!దుర్భర దారిద్య్రాన్ని మోస్తూ ఆయన
1959లో పరమపదించారు.
ఆయన కొడుకు కృష్ణారావు ఇండోర్లోని ఒక మిల్లులో టైపిస్ట్ గా కాలం వెళ్ళబుచ్చారు.ఆయనకు కేంద్ర ప్రభుత్వం..యుపి ప్రభుత్వం కలిసి వంద రూపాయల పెన్షన్ అందజేసేవి..జీవితమంతా చాలీచాలని సొమ్ముతో భారంగా గడిపిన కృష్ణారావు 1967 లో కాలం చేశారు. అంతే..ఆ కుటుంబానికి ఆ వంద రూకల ఫించనూ కట్..

మొత్తానికి కృష్ణారావు కొడుకు ఇంజనీరింగ్ చదివి ఎంపి విద్యుత్ శాఖలో ఉద్యోగం సంపాదించుకున్న తర్వాత ఝాన్సీలక్ష్మిభాయి
వారసుల జీవన ప్రమాణాలు కాస్త మెరుగుపడ్డాయి..
స్వార్జితంతో సొంత ఇల్లు సమకూరింది..ఝాన్సీ వీరోచిత పోరాటం తర్వాత ఆ కుటుంబానికి మళ్లీ సొంత ఇంట్లో నివాసం ఉండడం అదే…అయిదు తరాల నిరీక్షణ..దుర్భర జీవితాలు..
పట్టించుకోని సర్కార్లు..
నోరు తెరిచి అడగలేని
ఆత్మాభిమానం..!
ఇవన్నీ ఆ గొప్ప కుటుంబం పాలిట శాపాలు..
అయినా సింహం ఎప్పుడూ సింహమే..రాజకుటుంబం గౌరవంగానే బ్రతికింది..
దరిద్రం వారి తప్పు కాదు.
మన ప్రభుత్వాల ఘనత..!

ఎలిశెట్టి సురేష్ కుమార్
9948546286

Leave a Reply