కీలక నిర్ణయం తీసుకున్న విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ..

విశాఖ ఉక్కు ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేసే ఆలోచనలో ఉంది విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ. నూతన వ్యవసాయ చట్టాలను కేంద్రం రద్దు చేసిన నేపథ్యంలో స్టీల్ ప్లాంట్ విషయంలోనూ కేంద్రంపై మరింత ఒత్తిడి పెంచాలన్న ఆలోచనలో ఉన్నారు కార్మికులు. రైతు ఉద్యమ స్ఫూర్తితో ముందుకు వెళ్లాలని భావిస్తున్నారు. దీనికోసం తగిన కార్యాచరణను రూపొందించారు.
స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ చేపట్టిన రిలే నిరాహార దీక్షలు బుధవారం నాటికి 286వ రోజుకి చేరుకున్నాయి. వీటికి తోడు కొన్ని నెలలుగా బంద్ లు, రాస్తారోకోలు, మానవహారాలు, స్టీల్‌ప్లాంట్ పరిపాలన భవనం ముట్టడులు, సభలు, సమావేశాలు ఇలా అనేక రూపాల్లో తమ నిరసనలు ఆందోళనలను ఎప్పటికప్పుడు కార్మికులు వ్యక్తం చేస్తూనే ఉన్నారు. ఇన్ని విధాలుగా కార్మికులు తమ నిరసన తెలియజేస్తున్నప్పటికి కేంద్ర ప్రభుత్వం మాత్రం విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రేవేటికరణ నిర్ణయంపై వెనక్కి తగ్గడం లేదు. కరోనాను కూడా లెక్కచేయకుండా తమ ప్రాణాలను సైతం ఫణంగా పెట్టి కార్మికులు పోరాడినా కేంద్రం అవి ఏవి పట్టించుకోవట౦ లేదు.
అయితే ఇటీవల నూతన వ్యవసాయ చట్టాలపై కేంద్రం వెనుకడుగు వేయటం స్టీల్‌ప్లాంట్ కార్మికులలో ఆశలను చిగురింపజేసింది. పైగా ఠికావత్ వంటి ఢిల్లీ రైతుసంఘం నాయకులు విశాఖలో పర్యటించి ఉక్కు ఉద్యమానికి సంఘీభావంగా బీచ్ రోడ్డులో బహిరంగ సభను నిర్వహించటంతో.. రైతుల పోరాట పటిమను స్ఫూర్తిగా తీసుకుని మరింతగా ఉద్యమించాలని ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ భావిస్తోంది. స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో కేంద్రంతో పోరాడటానికి ఇదే రైట్ టైమ్ అనే ఆలోచనలోను ఉన్నారు కార్మికులు. పోరాడితే పోయేదేమీ లేదు… బానిస సంకెళ్లు తప్ప… అన్న ఉక్కు సంకల్పంతో ఉన్నారు. స్టీల్‌ప్లాంట్‌ సిఐటియు కార్యాలయంలో సమావేశమైన ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ప్రతినిధులు ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసేందుకు తగిన కార్యాచరణను రూపొందించారు.
ఇప్పటికే ఉద్యమాన్ని రాష్ట్రవ్యాప్తంగా విస్తరిస్తూ వివిధ జిల్లాల్లో సభలు సమావేశాలు నిర్వహిస్తున్న ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ప్రతినిధులు ఇప్పుడు తగిన కార్యాచరణతో ముందుకు వెళ్తున్నారు. ఇందులో భాగంగా రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కి ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ బుధవారం లేఖ రాసింది. స్టీల్‌ప్లాంట్ ను ప్రైవేటీకరించ వద్దంటూ మరోసారి ప్రధానికి లేఖ రాయాలని ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ సీఎంను కోరింది. శాసన సభలో చర్చించి రాష్ట్ర నిర్ణయాన్ని మరొకసారి కేంద్రానికి పంపాలని అభ్యర్థి౦చారు. ఈ నెల 26న విశాఖ కూర్మన్నపాలెం నుంచి స్టీల్‌ప్లాంట్ ప్రధాన గేటువరకు ఐదు చోట్ల భారీగా వంటవార్పు కార్యక్రమం నిర్వహించాలని పిలుపునిచ్చింది.

Leave a Reply