Suryaa.co.in

Andhra Pradesh

వైసీపీ పాలనలో క్రీడా రంగాన్ని భ్రష్టు పట్టించారు

– యువత ఓట్ల కోసమే ఆడుదాం ఆంధ్ర పేరుతో జగన్ రెడ్డి డ్రామాలాడుతున్నారు
– ఆడుదాం ఆంధ్రా కాదు ..జగన్ రెడ్డి చేతుల్లోంచి నుంచి ఆంధ్రని కాపాడుదాం
– టిడిపి మాజీ ఎమ్మెల్సీ మంతెన సత్యనారాయణ రాజు

యువతకు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా మోసం చేసి యువత జీవితాలతో ఆడుకుంటున్న సీఎం జగన్ రెడ్డి ఎన్నికల ముందు యువత ఓట్ల కోసం ‘ఆడుదాం ఆంధ్ర’ పేరుతోడ్రామాలాడుతున్నారు.

వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రాష్ట్రంలో ఉద్యోగాలకు నోటిఫికేషన్లు లేవు, కొత్తగా పరిశ్రమలు పెట్టుబడులు రాలేదు. ఉద్యోగాలు,ఉపాధి కల్పన లేనందున నిరుద్యోగ యువత ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. అందుకే కంటి తుడుపు చర్యగా ‘ఆడుదాం ఆంధ్ర’కు శ్రీకారం చుట్టింది. తప్పుడు రిజిష్ట్రేషన్లతో క్రీడలు నిర్వహించినట్టు, విజేతల్ని ప్రకటించినట్టు కాగితాలపై చూపారు తప్ప, వాస్తవంగా చాలా చోట్ల అసలు క్రీడలే నిర్వహించలేదు.

క్రీడలు నిర్వహించిన చోట క్రీడాకారులకు కనీసం త్రాగునీరు, భోజన సదుపాయాలు కూడా కల్పించలేదు, మరి రూ. 120 కోట్లు ఏం చేశారు? నాణ్యత లేని కిట్లు సరఫరా చేసి వాటిలోనూ బొక్కేశారు.టీడీపీ ప్రభుత్వం 5 ఏళ్లలో క్రీడారంగానికి రూ. 1139 కోట్లు ఖర్చు చేస్తే …వైసీపీ ప్రభుత్వం 5 ఏళ్లలో కేవలం రూ. 814 కోట్లే ఖర్చు చేసింది. 2022-23 లో కేవలం రూ. 75 కోట్లు కేటాయించారు, కానీ అందులో రూ. 58 కోట్లు జీతభత్యాలకే. క్రీడా సంఘాలకు ఇవ్వాల్సిన గ్రాంట్లు, ఒలంపిక్స్ అషోషియేషన్ కి ఇవ్వాల్సిన బకాయిల గురించి పట్టించుకోవటం లేదు.

ఐదేళ్లుగా క్రీడా రంగాన్ని భ్రష్టు పట్టించారు, వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పేద క్రీడాకారులకు ఉచితంగా అందుబాటులో ఉండే ప్రభుత్వ స్టేడియాలను ప్రైవేటు వ్యక్తులకు లీజుకు కట్టబెట్టారు. శిక్షణ కోసం వచ్చేవారి నుంచి రూ. 50 నుంచి రూ. 1000 వరకు ఫీజులు వసూలు చేస్తున్నారు, దీంతో పేద క్రీడాకారులు స్టేడియాలకు రావటమే మానేశారు.

ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2023 లో అత్యధిక పధకాలు సాధించిన మొదటి 10 రాష్ట్రాల్లో అసలు ఏపీకి చోటే దక్కలేదు. చిన్న రాష్ట్రం మణిపూర్ సైతం 10 వ స్ధానం సాధిస్తే ఏపీ మాత్రం 13 వ స్ధానానికి పరిమితమైంది. టీడీపీ హయాంలో గ్రామ స్ధాయిలో క్రీడాకారుల్ని ప్రోత్సహించేందుకు మండల, నియోజకవర్గ కేంద్రాల్లో రూ. 50 లక్షల నుంచి కోటి వరకు కేటాయించి క్రీడా వికాస కేంద్రాలు ఏర్పాటు చేస్తే జగన్ రెడ్డి వాటిని నిర్వీర్యం చేశారు.

దాదాపు 20,010 ప్రభుత్వ పాఠశాలల్లో ఆట స్థలాలు లేవు, వందలాది పాఠశాలల్లో పీఈటీ మాస్టార్లు లేరు. కొత్తగా ఒక్కరినీ కూడా నియమించలేదు. జాతీయ అంతర్జాతీయ స్ధాయిలో ఆడిన క్రీడాకారులకు ప్రభుత్వం నుంచి సరైన ప్రోత్సాహం లేదు. పుట్ బాల్ కి, వాలీబాల్ కి తేడా తెలియని రోజాకు క్రీడాశాఖ కట్టబెట్టారు, ఏసీఏ ఆంధ్రా క్రికెట్ అసోషియేషన్ అధ్యక్షునిగా డిల్లీ లిక్కర్ స్కాంలో నిందితునిగా ఉన్న వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అల్లుడు శరత్ చంద్రారెడ్డిని నియమించారు.

2019 లో ఏసీఏకి రూ. 120 కోట్ల వరకు ఫిక్స్ డ్ డిఫాజిట్లు ఉండేవి, విజయసాయిరెడ్డి, ఆయన బందుగణం ఏఏసీను చేతుల్లోకి ఆ బ్యాంక్ ఖాతాలో కేవలం రూ. 20 కోట్లే మిగిలాయి. ఇతర బ్యాంకులకు ఎప్ డీఐలు మార్చి తద్వారా తమ వ్యాపారాలకు రుణాలు పొందేందుకు మార్గం సుగమం చేసుకున్నారు. శాప్ ని అవినీతికి నిలయంగా మార్చారు, టెండర్లలో ఎండీ అవినీతికి పాల్పడ్డారని శాఫ్ డైరక్టర్లే బహిరంగంగా ఆరోపించారు.

లక్షలాది రూపాయలు లంచాలు తీసుకుని అర్హత లేనివారికి స్పోర్ట్స్ కోటాలో గ్రూప్ వన్ ఉద్యోగాలకు సర్టిఫికెట్లు ఇచ్చారు. అనంతపురం జిల్లా ధర్మవరంలో జూనియర్ హాకీ క్రీడాకారిణి దళిత యువతి స్నేహలత అత్యాచారానికి గురైతే నిందితులపై చర్యలు శూన్యం.

టీడీపీ హయాంలో..
టీడీపీ ప్రభుత్వం, శాప్, ఒలింపిక్, క్రీడా సంఘాలు కలిసికట్టుగా పనిచేసి రాష్ట్రంలో క్రీడాభివృ ద్ధికి బాటలు వేశాయి. చంద్రబాబు నాయుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా, నవ్యాంధ్ర ముఖ్యమంత్రిగా ప్రపంచ ప్రఖ్యాత క్రీడాకారులను తయారుచేసి, రాష్ట్రాన్ని స్పోర్ట్స్ హబ్ తీర్చిదిద్దేందుకు కృషి చేశారు.

మంగళగిరిలో 24 ఎకరాల్లో 34,000 సీటింగ్ సామర్థ్యంతో అంతర్జాతీయ స్టేడియం నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఉమ్మడి రాష్ట్రంలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు పట్టుదలతో 2002లో హైదరాబాద్, విశాఖపట్నం కేంద్రంగా జాతీయ క్రీడలు, 2003లో ఆఫ్రో ఆసియా క్రీడలకు ఆతిథ్యమిచ్చిన ఘన మైన చరిత్ర ఆంధ్రప్రదేశ్ కి ఉంది. చంద్రబాబు నాయుడు ఉప్పల్, గచ్చిబౌలి, సరూర్ నగర్ క్రికెట్ స్టేడియాల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు.చంద్రబాబు నాయుడు ఎల్బీ స్టేడియంలో టెన్నిస్ కోర్టు నిర్మాణం చేపట్టి టెన్నిస్ క్రీడకు ప్రోత్సాహం అందించారు.

చంద్రబాబు ఇచ్చిన ప్రోత్సాహంతో కరణం మల్లీశ్వరి, పుల్లెల గోపీ చంద్, కోనేరు హంపి, పీవీ సింధు వంటి వారు తమ ప్రతిభతో ఆంధ్రప్రదేశ్ పేరును విశ్వవ్యాప్తం చేశారు.చంద్రబాబు నాయుడు పుల్లెల గోపిచంద్ అకాడమికీ హైదారాబాద్ (2003) లో 5 ఎకరాలు, అమరావతి 2017 లో 12 ఎకరాలు కేటాయించారు. కానీ నేడు జగన్ రెడ్డి క్రీడారంగాన్ని నిర్వీర్వం చేసి కేవలం ఓట్ల కోసం ఆడుదాం ఆంధ్రపేరుతో ఆడుతున్న డ్రామాను యువత గమనిస్తున్నారు.

అందుకే జగన్ రెడ్డి చేతుల్లోనుంచి ఆంధ్రని కాపాడుదాం అంటూ నినదిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో జగన్ రెడ్డిని చిత్తుగా ఓడించి తగిన గుణపాఠం చెప్పేందేందుకు యువత అంతా సిద్దంగా ఉన్నారు.

LEAVE A RESPONSE