– రైల్ రోకోకు లెఫ్ట్ పార్టీల మద్దతు కోరిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
– సిపిఎం, న్యూడెమోక్రసీ నేతలతో సమావేశం
– ఎమ్మెల్సీ కవిత ఉద్యమానికి మద్దతు ప్రకటించిన వామపక్ష పార్టీలు
– ఉత్తర, దక్షిణ భారతదేశాల మధ్య రవాణాను స్తంభింపజేసేలా రైల్ రోకో
హైదరాబాద్ : బీసీలకు విద్య, ఉద్యోగాలు, స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ జూలై 17న నిర్వహించనున్న రైల్ రోకోకు మద్దతునివ్వాలని వామపక్ష పార్టీలను తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కోరారు. సీపీఎం రాష్ట్ర కార్యాలయంలో ఎంబీ భవన్ లో పార్టీ రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ, అడిక్ మెట్ లోని న్యూ డెమోక్రసీ రాష్ట్ర కార్యాలయం మార్క్స్ భవన్ లో పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు సాధినేని వెంకటేశ్వర రావు, జేవీ చలపతి రావు, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు కె. గోవర్ధన్ తో ఎమ్మెల్సీ కవిత వేర్వేరుగా భేటీ అయ్యారు.
బీసీ రిజర్వేషన్ల పెంపు, కామారెడ్డి బీసీ డిక్లరేషన్ అమలు కోసం తెలంగాణ జాగృతి, యునైటెడ్ ఫూలే ఫ్రంట్ ఆధ్వర్యంలో ఏడాదిగా అనేక ప్రజాస్వామిక ఉద్యమాలు నిర్వహించామన్నారు. ఈ బిల్లును కేంద్రానికి పంపి మూడు నెలలవుతున్నా అమలు చేయడానికి కేంద్రంపై సీఎం రేవంత్ రెడ్డి ఎలాంటి ఒత్తిడి చేయడం లేదన్నారు. అందుకే జూలై 17న రైల్ రోకోకు పిలుపునిచ్చామని.. ఈ ఆందోళనకు మద్దతునివ్వాలని విజ్ఞప్తి చేశారు.
తమతో కలిసి వచ్చే భావసారూప్యత ఉన్న పార్టీలు, ప్రజాసంఘాలతో కలిసి రైల్ రోకో నిర్వహిస్తామన్నారు. బీసీ బిల్లు ఆమోదానికి ఎంత ఆలస్యమైతే బీసీలకు అంత అన్యాయం జరుగుతుందన్నారు. అధికారంలో ఉన్నామని ప్రభుత్వం జిల్లా కలెక్టరేట్లలో కాంగ్రెస్ తల్లి విగ్రహాలను ప్రతిష్టిస్తుందని.. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ విగ్రహాలను గౌరవ మర్యాదలతో గాంధీ భవన్ కు పంపిస్తామన్నారు.
బీసీ రిజర్వేషన్ల బిల్లుల ఆమోదం కోసం కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకు ఢిల్లీకి అఖిలపక్షాన్ని తీసుకెళ్లాల్సిన బాధ్యత సీఎం రేవంత్ రెడ్డిపైనే ఉందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లి అన్నారు. బీసీల కోసం ఎమ్మెల్సీ కవిత చేస్తోన్న ఉద్యమాలకు తాము సంపూర్ణ మద్దతు ఇస్తున్నామని తెలిపారు.
బీసీ రిజర్వేషన్ల పెంపు కోసం చిత్తశుద్ధితో ఉద్యమిస్తూన్న ఎమ్మెల్స కల్వకుంట్ల కవితపై ఆరోపణలు చేయడం కాదు. పెంచిన రిజర్వేషన్లు అమలు చేయడానికి బాధ్యత తీసుకోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్ కు యూపీఎఫ్ కన్వీనర్ బొల్ల శివశంకర్ సూచించారు. కార్యక్రమంలో తెలంగాణ జాగృతి ప్రధాన కార్యదర్శి నవీన్ ఆచారి, యూపీఎఫ్ కో ఆర్డినేటర్ ఆలకుంట హరి, తెలంగాణ జాగృతి, యూపీఎఫ్, సీపీఎం, న్యూ డెమోక్రసీ నాయకులు పాల్గొన్నారు.