మళ్లీ వినిపించిన మాజీల గొంతు

న్యాయవ్యవస్థను కాపాడుకుందాం
చీఫ్ జస్టిస్‌కు మాజీ న్యాయమూర్తుల లేఖ

న్యాయవ్యవస్ధను కాపాడుకునే అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. కొంతమంది వ్యక్తులు-సమూహం న్యాయవ్యవస్థను ప్రభావితం చేసేందుకు చేస్తున్న యత్నాలను అడ్డుకోవాలంటూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి సామూహిక లేఖ రాశారు.

సుప్రీం కోర్టు, వివిధ హైకోర్టు లకు చెందిన 21 మంది రిటైర్డ్‌ న్యాయమూర్తులు సుప్రీం ప్రధాన న్యాయమూర్తికి ఓ లేఖ రాశారు. న్యాయ వ్యవస్థను కాపాడుకోవాల్సిన పరిస్థితులు తలెత్తాయని అభిప్రాయపడ్డారు. కొన్ని వర్గాలు తప్పుడు సమాచారం అందిస్తూ న్యాయ వ్యవస్థను బహిరంగంగా అవమానిస్తున్నారని, అణగ దొక్కేందుకు ప్రయత్నిస్తున్నారని లేఖలో పేర్కొన్నారు.

కొందరు వారి వ్యక్తిగత, రాజకీయ ప్రయోజనాల కోసం విపరీత చర్యలకు పాల్పడుతున్నారని, దానివల్ల ప్రజలు న్యాయ వ్యవస్థపై నమ్మకం కోల్పోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు. వారు తమ లేఖలో అధికార భాజపా, ప్రతిపక్ష పార్టీల నేతల మధ్య మాటల యుద్ధం, ప్రతిపక్షాలపై అవినీతి కేసులు, బాధిత నాయకులు న్యాయ స్థానాలను ఆశ్రయించినా , వారికి ఎటువంటి ఉపశమనం దక్కక పోవడం మొదలైన విషయాల గురించి పేర్కొన్నారు.

న్యాయ వ్యవస్థలో కృత్రిమ పద్ధతులు చోటు చేసుకునేలా కొన్ని వర్గాలు ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. ఇలాంటి చర్యలు న్యాయ వ్యవస్థ పవిత్రతను అగౌరవ పరుస్తాయని తెలిపారు. అనవసర ఒత్తిళ్ల నుంచి న్యాయ వ్యవస్థను రక్షించు కోవాల్సిన అవసరం మన పైనే ఉందని రిటైర్డ్‌ న్యాయమూర్తులు ఆ లేఖలో పేర్కొన్నారు.

కొన్ని రాజకీయ సమూహాలు న్యాయ వ్యవస్థను దెబ్బ తీసేలా నిరాధారమైన సిద్ధాంతాలను ప్రచారం చేస్తూ, వారు అనుకూల ఫలితాలు పొందేలా వ్యూహాలు రచిస్తున్నారన్నారు. ప్రస్తుతం అరెస్టవుతున్న రాజకీయ నాయకుల విషయంలో ఇది స్పష్టంగా తెలుస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు.

ఒకరి అభిప్రాయాలకు అనుగుణంగా న్యాయ పరమైన నిర్ణయాలను తీసుకోవడం, అలా చేయని వారిని తీవ్రంగా విమర్శించడం, న్యాయ సమీక్ష చేయడం చట్ట నియమాల సారాంశాన్ని దెబ్బ తీస్తుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టు నేతృత్వం లోని న్యాయ వ్యవస్థ ఇటువంటి ఒత్తిళ్లకు లొంగకుండా న్యాయ వ్యవస్థ పవిత్రత, స్వయం ప్రతిపత్తిని కాపాడాలని వారు కోరారు. న్యాయ వ్యవస్థ ప్రజాస్వామ్యానికి మూల స్తంభంగా, అస్థిరమైన రాజకీయ ప్రయోజనాలకు అతీతంగా ఉంటుందని రిటైర్డ్‌ న్యాయమూర్తులు వివరించారు. దీనిపై చీఫ్‌జస్టిస్ ఏవిధంగా స్పందిస్తారో చూడాలి.

Leave a Reply