Suryaa.co.in

Telangana

తెలంగాణలో ఒక్క సైనిక్ స్కూల్ కూడా లేదు

– ఏపీ లో ఉన్న సైనిక్ స్కూల్ లలో తెలంగాణ వారికి ఉన్న రిజర్వేషన్ కోటా ఎత్తేశారు
– 67 శాతం ఏపీ కే కేటాయించడం దుర్మార్గం
– రాష్ట్ర కాంగ్రెస్ బీజేపీ ఎంపీ లు ఏం చేస్తున్నారు ?
– కాంగ్రెస్ బీజేపీ ఎంపీ లున్నది గడ్డి పీకడానికేనా ?
-మాజీ ఎంపీ బి .వినోద్ కుమార్

పహల్గామ్ ఘటన తర్వాత కేంద్రం దేశ భద్రతకు సంబంధించి ఏ నిర్ణయం తీసుకున్నా బీ ఆర్ ఎస్ మద్దతు ఇస్తుందని ఇదివరకే ప్రకటించింది. గతం లో సర్జికల్ స్ట్రైక్ కు కూడా మా పార్టీ మద్దతు ఇచ్చింది. ఉదయం జరిగిన ఆపరేషన్ సింధూర్ కు పూర్తిగా మద్దతు నిస్తున్నాం.

పాకిస్థాన్ లోని తీవ్రవాద శిబిరాలు పూర్తిగా ధ్వంసం చేయాలి.దేశ భద్రతే అన్నిటి కన్నా ముఖ్యం. పాక్ ప్రతిదాడులను కూడా సైన్యం సమర్థవంతంగా తిప్పికొడుతుందనే నమ్మకం ఉంది.

తెలంగాణ ప్రాంతం లో ఒక్క సైనిక్ స్కూల్ కూడా లేదు. ఏపీ లో కోరుకొండ ,పులివెందుల ,కలికిరి లో సైనిక్ స్కూల్స్ ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన కొత్తలోనే సీఎం కేసీఆర్ సైనిక్ స్కూల్ కోసం కేంద్రం పై ఒత్తిడి తెచ్చారు. వరంగల్ కు సైనిక్ స్కూల్ మంజూరు చేసినా, అనేక షరతులు పెట్టారు.

రాష్ట్ర ప్రభుత్వమే సైనిక్ స్కూల్ కు అన్నీ ఖర్చులు భరించాలంటే కేసీఆర్ నిరసన తెలిపారు. కేంద్రానికి సుదీర్ఘమైన ఉత్తరం రాశారు. సీఎం గా రేవంత్ రెడ్డి భాద్యతలు చేపట్టిన వెంటనే సైనిక్ స్కూల్ గురించి నేను లేఖ రాశాను. లేఖ రాశాక రేవంత్ రెడ్డి నన్ను హేళన చేస్తూ మాట్లాడారు.

బొల్లారం లో సైనిక్ స్కూల్ వస్తుందని చెప్పారు. ఇప్పటివరకు అతి లేదు .గతి లేదు. సైనిక్ స్కూల్ కొత్తది రాలేదు సరికదా ..ఏపీ లో ఉన్న సైనిక్ స్కూల్ లలో తాజాగా తెలంగాణ వారికి ఉన్న రిజర్వేషన్ కోటా ఎత్తేశారు ఏపీ ,తెలంగాణ విద్యార్థులకు కలిపి కోరుకొండ ,కలికిరి సైనిక్ స్కూళ్లలో 67 శాతం రిజర్వేషన్లు ఉండేవి.

ఇపుడు తెలంగాణ కు రిజర్వేషన్లు ఎత్తేసి 67 శాతం ఏపీ కే కేటాయించడం దుర్మార్గం. తెలంగాణ విద్యార్థులు అన్యాయమై పోయారు. రాష్ట్ర కాంగ్రెస్ బీజేపీ ఎంపీ లు ఏం చేస్తున్నారు ? ఇలాంటి సమస్యల పై స్పందించకుంటే కాంగ్రెస్ బీజేపీ ఎంపీ లున్నది గడ్డి పీకడానికేనా ?

ఏపీ కి కొత్తగా విజయవాడ లో సైనిక్ స్కూల్ మంజూరయ్యింది. నాలుగు సైనిక్ స్కూళ్ళు ఉంటే తెలంగాణ కు ఒక్కటి లేకపోవడం ఎంత దుర్మార్గం ? సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ లో కూర్చుని సైనిక్ స్కూల్స్ లో తెలంగాణ కు రిజర్వేషన్లను ఎత్తి వేసిన ఆర్డర్ ను మార్పించాలి. ఇదే విషయమై గతం లో నేను విద్యా కమిషన్ కు లేఖ రాశాను. విద్యా కమిషన్ కేవలం టూర్ల కే పరిమితం అయ్యింది. సైనిక్ స్కూళ్లలో తెలంగాణ విద్యార్ధులకు రిజర్వేషన్లు పునరుద్దరించకపోతే, న్యాయ స్థానాలను ఆశ్రయిస్తాం. ప్రెస్‌మీట్‌లో మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత ,మాజీ ఎమ్మెల్సీ పాతూరి సుధాకర్ రెడ్డి ,బీ ఆర్ ఎస్ వి అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు.

LEAVE A RESPONSE