Suryaa.co.in

Features

ఇదేనా మనం కోరుకునే సమాజం!

ఇమ్రాన్ ఖాన్ ఇండియాని పొగిడాడని..
ఇంకో దేశంలో
భగవద్గీత చదివారని..
మరో దేశంలో సైనికులు శ్రీకృష్ణుడిని కొలిచారని..
అదేదో దేశంలో చట్టసభలో
మన భక్తి గీతం ఆలపించారని..
ఓహ్ రొమ్ము విరుచుకుంటూ
ఉప్పొంగిపోవడం..
అందుకు సంబంధించిన వార్తలు..వీడియోలు.. క్లిప్పింగులు..రైటప్పులు
తెగ ఫార్వార్డ్ చేసెయ్యడం..
అందులో సగం చదవకుండానే..
చూడకుండానే..!?

ఇదేనా దేశభక్తి..
అదేనా భారతీయ ఉన్నతి..
భరతజాతి పురోగతి..
నిజానికి మనం ఎలా ఉంటున్నాం..మన పిల్లల్ని ఎలా పెంచుతున్నాం..
వారికి ఏం నేర్పిస్తున్నాం..
మనం ఉత్తమ పౌరులుగా మనగలుగుతూ
రేపటి పౌరులు మన పిల్లల్ని
బాధ్యతాయుతమైన వారిగా
తీర్చి దిద్దేందుకు కనీస ప్రయత్నం చేస్తున్నామా..!?
వేసుకుంటూ పోతే ఇలాంటి ప్రశ్నలు ఓ లక్ష..??

ఇప్పుడు అరవై..డెబ్బై ఏళ్ల వయసులో ఉన్న
చాలా మందికే మన సంస్కృతీసంప్రదాయాలపై పూర్తిగా అవగాహన లేని పరిస్థితి..ఇంక వారు పిల్లలకు చెప్పేది ఏంటి..
అయితే వారిలో కనీసం
ఆ విషయంలో ప్రయత్నం చెయ్యాలన్న తపన..
పిల్లలకు అవసరమైన
పరిజ్ఞానాన్ని అందించలేకపోతున్నామనే ఆవేదన కనిపించేవి.
ఉమ్మడి కుటుంబాలు ఉన్న రోజుల్లో ఆ వెలితి
అంతగా తెలిసేది కాదు. తాతయ్యలు.. బామ్మలు..పెదనాన్నలు.. పెద్దమ్మలు పిల్లల్ని ఒళ్ళో కూర్చోపెట్టుకుని రామాయణ
మహాభారత భాగవతాలు చెప్పే ప్రయత్నం చేసేవారు.పనిలో పనిగా కుటుంబ బంధాలు..
చుట్టరికాల విలువ..
పెళ్ళిళ్ళు..పేరంటాలు..
పండగల ప్రాశస్త్యం..ఇత్యాది అవసరమైన సంగతులు వివరించే వారు..ఇప్పుడు ఆధునికత..ఆ”ధనికత”‘
పెరిగిపోయి ఆ ముచ్చట కూడా కరవైపోయింది. కుటుంబాలు చిన్నవై పోయి అనవసర వ్యాపకాలు పెరిగిపోయి పిల్లలు సరైన పెంపకానికి నోచుకోవడం లేదు.

తల్లిదండ్రులు ఎవరికి వారే బిజీ..ఇద్దరూ ఉద్యోగాలు చేయడం..ఎవరికి వారు సొంత సర్కిల్స్ ఏర్పాటు చేసుకోవడం.. టివీలు..పరాకాష్టగా మొబైల్స్..ఇవన్నీ వాతావరణాన్ని మరింతగా పాడు చేశాయి.పిల్లలకు మంచి విద్య..సౌకర్యాలతో కూడిన జీవితం ఇవ్వాలనే తాపత్రయం తల్లిదండ్రులకు ఎక్కువైపోయి అడిగిందల్లా ఇవ్వడం..నాగరికత పేరిట అవసరానికి మించిన స్వేచ్చ.. ఏది కావాలంటే అది అందుబాటులో ఉంచడం పరిపాటైపోయింది.మైక్రో ఫ్యామిలీలు పెరిగిపోవడంతో పిల్లలకు తాతయ్యలు..
నాన్నమ్మలు..అమ్మమ్మలు..బాబాయిలు.. పిన్నిలు.. మామయ్యలు.. అత్తయ్యలు..ఇలాంటి సమీప కుటుంబ బంధువులు కూడా తెలియని
శోచనీయ పరిస్థితులు నెలకొంటున్నాయి.
కుటుంబం అంటే అమ్మా..నాన్న..మేమిద్దరం.. అంతే..ఇంక విలువలు తెలిసేదెలా..!?ఈరోజుల్లో మనం చాలా మంది పిల్లల్ని చూస్తున్నాం..ఇల్లు..చదువు..
మొబైల్..ఇదే ప్రపంచం..
రామాయణ..భారతాల గురించి ఎంత మందికి తెలుసు..పెద్దలు చెబుతున్నారా..ఎవరి బిజీ వారిది..!

ఇవి గాక చదువుల విషయంలో పెద్దలే పిల్లల మీద భరించలేనంత ఒత్తిడి పెట్టేస్తున్నారు.వారు చిన్నగా ఉన్నప్పుడే ఐఐటీ అని…అమెరికా వెళ్లిపోవాలని..కార్పొరేట్ చదువులే చదవాలని పెద్దలే లక్ష్యాలు నిర్దేశించుకుని వాటిని పిల్లలపై బలవంతంగా రుద్దేస్తున్నారు.
ఈ పరిస్థితి పిల్లల భవిష్యత్తును ఒక్కోసారి అంధకారంలోకి నెట్టేస్తోంది..
పెద్దల ఆకాంక్షల మేరకు చదవగలిగితే ఓకే..లేదంటే దుర్వ్యసనాలకు బానిసలైపోవడం.. బ్రతుకులను చిద్రం చేసుకుని చివరకు ఆత్మహత్యలకు పాల్పడడం..ఇవీ పరిణామాలు..!

పిల్లలు మానసికంగా ఆరోగ్యంగా..దృఢంగా పెరిగేందుకు అవసరమైన వాతావరణం కల్పించడం పెద్దల బాధ్యత..పెద్దలు మారితేనే పిల్లలు చక్కగా పెరిగి కనీసం రేపటి తరాలలోనైనా మంచి సమాజాలు ఏర్పడే అవకాశం ఉంటుంది..!.

ఎలిశెట్టి సురేష్ కుమార్
విజయనగరం
9948546286

LEAVE A RESPONSE