– వెంకయ్య చౌద రోజుకు 7 వేల మందికి పైగా వీఐపీ బ్రేక్ దర్శనాలు చేయిస్తున్నాడు.
– వ్యవస్థల వైఫల్యం వల్లే ఇటువంటి దారుణం
– అడిషనల్ ఈఓ వెంకయ్య చౌదరి, తిరుపతి ఎస్పీని వెంటనే సస్పెండ్ చేయాలి
– మృతుల కుటుంబాలకు రూ.కోటి చొప్పున పరిహారం ఇవ్వాలి
– గాయపడిన వారికి రూ.20 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించాలి
– తిరుపతి క్యాంప్ ఆఫీస్లో మీడియాతో మాట్లాడిన వైయస్సార్సీపీ తిరుపతి జిల్లా అధ్యక్షుడు, టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్రెడ్డి.
తిరుపతి: వైకుంఠ ద్వారదర్శనం టోకెన్ల జారీ కేంద్రాల వద్ద జరిగిన తొక్కిసలాటలో ఆరుగురి దుర్మరణం, పలువురు క్షతగాత్రులైన దుర్ఘటనకు సీఎం చంద్రబాబు నైతిక బాధ్యత వహించాలని, ఆ మరణాలు కచ్చితంగా ప్రభుత్వ హత్యలే అని వైయస్సార్సీపీ తిరుపతి జిల్లా అధ్యక్షుడు, టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్రెడ్డి స్పష్టం చేశారు.
శ్రీవారి సేవలో భక్తులకు సదుపాయాలు కల్పించాల్సిన అన్ని వ్యవస్థలు చంద్రబాబు సేవలో తరలించడం వల్లే ఈ దుర్ఘటన జరిగిందని తిరుపతి క్యాంప్ ఆఫీస్లో మీడియాతో మాట్లాడిన ఆయన చెప్పారు. బాధ్యతారహితంగా వ్యవహరించిన ఈఓ శ్యామలరావును బదిలీ చేయాలని, టీటీడీ అడిషనల్ ఈఓ వెంకయ్య చౌదరి, తిరుపతి ఎస్పీని వెంటనే సస్సెండ్ చేయాలని, ఈ ఘటనకు బాధ్యులైన ప్రతి ఒక్కరిపైనా చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు. దుర్ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు రూ.కోటి చొప్పున, క్షతగాత్రులకు రూ.20 లక్షల చొప్పున పరిహారం చెల్లించాలని కోరారు.
అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ప్రచార యావతోనే సీఎం చంద్రబాబు అన్ని వ్యవస్థలను భ్రష్టు పట్టించారు. ఆనాడు తన ప్రచారం కోసం గోదావరి పుష్కరాల్లో 29 మందిని తొక్కిసలాట రూపంలో బలి తీసుకున్నారు. వైకుంఠ ఏకాదశినాడు తిరుమల శ్రీవారి దర్శనం టోకెన్ల కోసం తిరుపతి వచ్చిన భక్తులకు భక్తులకు పకడ్భందీ ఏర్పాట్లు చేయడంలో విఫలమవ్వడం వల్ల ఆరుగురు భక్తులు దుర్మరణం చెందారు.
చంద్రబాబు మాదిరిగానే టీటీడీ ఛైర్మన్, ఈఓ, అడిషనల్ ఈఓలు ఎవరికి వారు సమీక్షా సమావేశాలు నిర్వహించుకుని, ఎలాంటి సమన్వయం లేకుండా అంతా తమ ఘనతే అని చాటుకునేందుకు చేసిన ప్రయత్నాల ఫలితంగానే ఈరోజు ఇంత దారుణం చోటు చేసుకుంది. కీలకమైన స్థానంలో ఉన్నవారు పర్యవేక్షణకే పరిమితమయ్యారు తప్ప క్షేత్రస్థాయిలో భక్తుల కోసం జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలించడంలో దారుణంగా విఫలమయ్యారు. ఈ దుర్ఘటనల్లో పోలీసులు, టీటీడీ విజిలెన్స్ వైఫల్యం చాలా స్పష్టంగా కనిపిస్తోంది.
తిరుపతి బైరాగిపట్నంలోని క్యూలైన్ల దగ్గర, తొలుత భక్తులందరినీ పార్క్లోకి పంపి, ఆ తర్వాత రాత్రి ఒక్కసారిగా క్యూలైన్లలోకి అనుమతిస్తూ గేట్లను తెరవడం వల్లే ఈ దుర్ఘటన జరిగింది.
గత వైయస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో శ్రీవారి దర్శనం కోసం పర్వదినాల్లో వచ్చే భక్తులకు ఏర్పాట్లు చేయడానికి అధిక ప్రాధాన్యత ఇచ్చే వాళ్ళం. కనీసం 15 రోజులకు ముందే క్యూలైన్లను పరిశీలించడం, టీటీడీ అధికారులు, పోలీసులతో సమన్వయం చేసుకుంటూ, ఎక్కడా ఇబ్బంది లేకుండా క్షేత్రస్థాయిలో బాధ్యతాయుతంగా పని చేయడం వల్లే ఎటువంటి దుర్ఘటనలు లేకుండా చూశాం.
కాగా, ఇప్పుడు టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు తిరుమలను రాజకీయ క్రీడామైదానంగా మార్చేశారు. ఆయన పదవీ బాధ్యతలు స్వీకరించడంతోనే గత పాలకులు, గత టీటీడీ పాలకమండలిపై బురద చల్లడమే పనిగా పెట్టుకున్నారు. టీటీడీ ఛైర్మన్ను ఈఓ, జెఈఓ స్థాయి అధికారులు కూడా పట్టించుకోవడం లేదు.
తిరుమలలో అడిషనల్ ఈఓ వెంకయ్య చౌదరి రాజకీయం
తిరుపతిలో జరిగిన తొక్కిసలాటకు అడిషనల్ ఈఓ వెంకయ్యచౌదరి కూడా బాధ్యత వహించాలి. ఆయన చంద్రబాబు సేవలో మునిగిపోయి, భక్తులను గాలికి వదిలేశాడు. ప్రతిపక్షాలకు చెందిన వారికి ప్రాధాన్యత ఇవ్వకుండా, ప్రభుత్వంలోని వారికి ఊడిగం చేస్తున్నాడు. రోజుకు 7 వేల మందికి పైగా వీఐపీ బ్రేక్ దర్శనాలు చేయిస్తున్నాడు.
తమకు అనుకూలమైన వారికి రాచమర్యాదలు చేస్తున్నాడు. వెంకయ్య చౌదరిపైన అజమాయిషీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్న ఈఓ శ్యామలరావు కూడా దీనికి బాధ్యత వహించాలి. తెలంగాణా నుంచి కావాలని ఒక ఎస్పీ స్థాయి అధికారిని తిరుపతికి తీసుకువచ్చారు. ఆయన కూడా చంద్రబాబు సేవలో తలమునకలు అవుతున్నారు. నిన్న జరిగిన ఘటనా స్థలంలో పట్టుమని 10 మంది పోలీసులు లేరు.
రోజు చంద్రబాబు పర్యటనకు ఏకంగా 2 వేల మంది పోలీసులను నియమించారు. క్షతగాత్రులను చూసేందుకు కూడా మాకు అవకాశం లేకుండా చేయడం దుర్మార్గం కాదా? కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వైయస్ఆర్ సీపీ నాయకులపై తప్పుడు ఆరోపణలు మోపి, వారిని జైలుకు ఎలా పంపాలా అనే ఆలోచిస్తున్నారు.
టీటీడీని ప్రక్షాళన చేస్తానంటూ చంద్రబాబు పెద్ద ఎత్తున ప్రకటనలు చేశారు. టీటీడీ చైర్మన్లుగా పని చేసిన కరుణాకర్ రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, ఈఓ ధర్మారెడ్డిని ఎలా కేసుల్లో ఇరికించాలి? విజిలెన్స్ను ఉసిగొలిపి ఎలాంటి తప్పులు కేసులు బనాయించాలనే దానిపైనే ప్రభుత్వం దృష్టి పెట్టింది. సారించింది.
నాడు ఇదే టోకెన్ల విధానంపై మీడియా దారుణంగా రాసింది. టోకెన్లతోనే తంటాలు అంటూ టీడీపీకి నిత్యం వంత పాడే పత్రికలో కథనం వచ్చింది. గత ప్రభుత్వంలో ఏకాదశి, ద్వాదశి రోజుల్లోనే వైకుంఠ ద్వార దర్శనం ఉండేది. దీని వల్ల ఎక్కువ మంది భక్తులకు దర్శనభాగ్యం లభించడం లేదనే ఉద్దేశంతో పది రోజుల పాటు సాధారణ భక్తులకు కూడా వైకుంఠ ద్వారదర్శనం కలిగించాలనే మంచి ఉద్దేశంతోనే ఈ టోకెన్ల విధానంను గతంలో మేం ప్రవేశపెట్టాం. దీని వల్లే ఈ ప్రమాదానికి కారణం అంటూ సదరు పత్రిక పేర్కొనడం ఆశ్చర్యం కలిగిస్తోంది.మీ
వైఫల్యాలను గత ప్రభుత్వం, గత పాలకమండలి మీదికి నెట్టేయాలన్న లక్ష్యంతోనే పని చేస్తున్నారు. గతంలో నైతికత ఉన్న నాయకులు పాలకులుగా ఉన్పప్పుడు ఇటువంటి ఘటనల్లో బాధ్యత వహిస్తూ తమ పదవులకు రాజీనామా చేశారు. కానీ ఇప్పుడు ఉన్న చంద్రబాబు అలా చేస్తాడని అనుకోవడం లేదు.
సనాతన ధర్మ పరిరక్షకుడు నోరెందుకు మెదపడం లేదు?:
సన్నాతన ధర్మాన్ని పరిరక్షిస్తానని తిరుపతిలో వీరతాళ్లు వేసుకుని తిరిగిన పవానానంద స్వామికి బాధ్యత లేదా? దీనిపైన వెంటనే స్పందించాల్సిన అవసరం పవన్ కళ్యాణ్కు లేదా? గేమ్ ఛేంజర్ ప్రిరిలీజ్ సందర్భంగా జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు చనిపోతే, రోడ్ల వల్లే ఈ ఘటన జరిగిందని, రోడ్ల దుస్థితికి కారణం గత ప్రభుత్వమే కారణం అంటూ ఆయన మాట్లాడారు. పేరకు సనాతనధర్మ పరిరక్షణ అంటారు, కానీ ఆచరణలో మాత్రం దానిని పట్టించుకోరు.
చంద్రబాబు దేవుడితో పెట్టుకున్నారు. దేవుడిని రాజకీయపావుగా వాడుకుంటున్నారు. చివరికి శ్రీవారి లడ్డూలో ఆవు కొవ్వు కలిపారంటూ చేసిన దుర్మర్గపు ప్రచారానికి భగవంతుడు కళ్ళు తెరిచారు. అయిదేళ్ల వైయస్ఆర్ సీపీ పాలనలో తిరుమల పవిత్రతను మేం కాపాడినంతగా ఎవరూ కాపాడలేదు. దీనిపై చంద్రబాబు, వవన్కళ్యాణ్తో బహిరంగ చర్చకు సిద్ధం. ఈ ఏడు నెలలుగా వైయస్సార్సీపీ, జగన్ మీద ఏడుపు తప్ప పాలన ఏదీ? కుట్ర కేసులు బనాయించే కార్యక్రమాల్లో పోలీసులను నిమగ్నం చేయడం వల్లే ఇటువంటి దుర్ఘటనలు జరుగుతున్నాయని భూమన కరుణాకర్రెడ్డి అన్నారు.