Suryaa.co.in

National

ముర్షిదాబాద్ హింసాత్మక ఘటనల్లో టీఎంసీ నేత ప్రమేయం

– మెహబూబ్ ఆలం సూత్రధారి
– పోలీసులు స్పందించడంలో విఫలమయ్యారు
– హైకోర్టు విచారణ కమిటీ నివేదికలో వెల్లడి
– నివేదిక ఆధారంగా హైకోర్టు చర్యలు

కలకత్తా: పశ్చిమ బెంగాల్‌లోని ముర్షిదాబాద్ జిల్లాలో గత నెలలో చోటుచేసుకున్న హింసాత్మక ఘటనల్లో టీఎంసీ నేత ప్రమేయం ఉన్నట్లు కలకత్తా హైకోర్టు నియమించిన విచారణ కమిటీ తన నివేదికలో వెల్లడించింది.

వక్ఫ్ సవరణ బిల్లు ఆమోదం పొందుతున్న సమయంలో చెలరేగిన ఈ దాడులు ప్రధానంగా హిందువులను లక్ష్యంగా చేసుకుని జరిగాయని, బాధితులు సహాయం కోసం అభ్యర్థించినప్పటికీ స్థానిక పోలీసులు స్పందించడంలో విఫలమయ్యారని నివేదిక పేర్కొంది.

ముర్షిదాబాద్‌లో జరిగిన హింసాత్మక ఘటనలపై హైకోర్టు ఏర్పాటు చేసిన విచారణ కమిటీ సంచలన విషయాలను వెలుగులోకి తెచ్చింది. ఈ దాడులకు స్థానిక కౌన్సిలర్, తృణమూల్ కాంగ్రెస్ నేత మెహబూబ్ ఆలం సూత్రధారి అని నివేదిక ఆరోపించింది.

“స్థానిక కౌన్సిలర్ మెహబూబ్ ఆలం దుండగులతో కలిసి వచ్చి ఈ దాడులకు పాల్పడ్డారు. పోలీసులు పూర్తిగా నిర్లక్ష్యం వహించారు. ఘటనా స్థలంలో వారి జాడ కనిపించలేదు” అని నివేదికలో కమిటీ స్పష్టం చేసినట్లు ఆంగ్ల మీడియా పేర్కొంది.

ముఖ్యంగా ఏప్రిల్ 11 మధ్యాహ్నం 2:30 గంటల తర్వాత ఈ దాడి జరిగినట్లు నివేదిక తెలిపింది. దుండగులు విచక్షణారహితంగా ఇళ్లకు నిప్పుపెట్టడం, దుకాణాలు, మాల్స్‌ను లూటీ చేయడం, ధ్వంసం చేయడం వంటి చర్యలకు పాల్పడ్డారని కమిటీ వివరించింది.

ఈ దాడుల కారణంగా బెట్‌బోనా గ్రామంలోనే 113 ఇళ్లు తీవ్రంగా దెబ్బతిన్నాయని నివేదికలో పేర్కొన్నారు. హిందువులే లక్ష్యంగా ఈ విధ్వంసం జరిగిందని, బాధితులు ప్రాణభయంతో పరుగులు తీసినా, పోలీసుల నుంచి సకాలంలో సహాయం అందలేదని కమిటీ తన నివేదికలో ఆవేదన వ్యక్తం చేసింది.

జాతీయ మానవ హక్కుల కమిషన్, రాష్ట్ర న్యాయ సేవల అథారిటీ, న్యాయ సేవల సభ్యులతో కూడిన ఈ విచారణ బృందం క్షేత్రస్థాయిలో పర్యటించి, బాధితులతో మాట్లాడి, ఆధారాలు సేకరించి ఈ నివేదికను రూపొందించింది. ఈ నివేదికను కలకత్తా హైకోర్టు డివిజన్ బెంచ్‌కు సమర్పించారు. ఈ నివేదిక ఆధారంగా హైకోర్టు తదుపరి చర్యలు తీసుకునే అవకాశం ఉంది.

LEAVE A RESPONSE