శాస్త్రీయత లోపించిన చదువులు

మన సమాజం అభివృద్ధి చెందాలంటే శాస్త్రీయ వివేచన చాలా అవసరం. పాఠశాల స్థాయిలోనే యువ మేధస్సులను ఉత్తేజపరిచి వారిలో శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించి తద్వారా ప్రతి పాఠశాల నూతన ఆవిష్కరణల వేదికగా రూపొందించాల్సిన ఆవశ్యకత నేటి సాంకేతిక యుగంలో ఎంతైనా ఉంది. ప్రస్తుతం పాఠశాలలో ఉన్న ప్రయోగశాలలు సంప్రదాయ పాఠ్యాంశాలకు అనుగుణంగా రూపొందించినవే కాని ప్రస్తుతం ఉన్న సాంకేతిక పరిజ్ఞానానికి అనుగుణంగా మాత్రం లేవు, చాలా పాఠశాలల్లో ప్రయోగశాలలే లేవు . ఇంటర్మీడియేట్‌ కళాశాలల్లో సైతం ప్రయోగ శాలలు లేకుండానే ప్రయోగ పరీక్షల్లో మార్కులు వేసి విద్యార్థుల్ని ఏమరుస్తున్నారు.

విద్యార్థులు చిన్నతనం నుంచే శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించి భావి శాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దాలి.  పిల్లల చదువు కోసం తల్లిదండ్రులు ఎంతైనా కష్టపడాలి, పిల్లలకు లేని పోని భ్రమలు కల్పించకూడదు. పిల్లలు స్వంత వ్యక్తిత్వ వికాసం కోసం కృషి  చేయాలి, అన్నింటికీ ఇతరులపై భారం వేస్తే పిల్లలు బలహీనం అయిపోతారు . పిల్లల్లో మేధావితనం పెరగాలి,  విద్యార్థులకు శాస్త్రీయ దక్పథం అలవరుచుకోవాలి. కుల, మత భావనలు వ్యతిరేకించి,  చదువ్ఞ కేవలం జీవితంలో విజయం సాధించడానికి కాదు. జీవితంలో పరిపూర్ణత సాధించడానికి ఏ స్థాయిలోనైనా పాఠ్యాంశాలు విద్యార్థి కేంద్రంగా సాగి అతనికి సంపూర్ణ సంతృప్తిని కలిగించాలి. విద్యార్థుల మానసిక, భౌతిక, ఆరోగ్యం సామాజిక అభివృద్ధి దృష్టిలో పెట్టుకుని వారి భావోద్వేగాలు, సకారాత్మక నడవడికకు అవసరమైన పాఠ్యాంశాలను రూపొందించాల్సిన అవసరం ఉంది.

విద్యార్థుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని వారిపై ఎటువంటి ఒత్తిడిలేని, సున్నితమైన సంరక్షణతో కూడిన విద్యను రూపొందించాలి. ప్రశ్నించే తత్వం, ప్రతి అంశాన్ని హేతుబద్ధంగా విశ్లేషించడం,సృజనాత్మక, ఊహాత్మక భావ స్వేచ్ఛ వంటి వాటికి పెద్దపీట వేయాలి.విద్యార్థులు తమ లక్ష్యం చేరుకోవడానికి, సరైన మార్గంలో ప్రయాణించడానికి మేధోపరమైన సంభావితంగా అభివృద్ధికి విద్యాసంస్థలు చోదకశక్తిగా ఉపయోగపడాలి.ఉపాధ్యాయులు కూడా నిరంతరం కొత్త విషయాలు నేర్చుకుంటేనే బోధనలో నాణ్యత పెరుగుతుంది. విద్యార్థులు రకరకాలుగా విద్యను నేర్చుకుంటారు. ఎవరికి కావలసిన రీతిలో వారికి బోధించడం ఉపాధ్యాయుల విధి. అందుకే ఆ భాసకులకు అభ్యసన ఎంతో ముఖ్యమైనది. మన శాస్త్ర సాంకేతిక పాఠాలన్నీ పాత చింతకాయ పచ్చడి లాంటివే.

ఆధునిక యుగంలో చోటు చేసుకుంటాయి. సాంకేతిక అభివృద్ధిని ఏమాత్రం పాఠ్యాంశాలలో జోడించలేదు. కొత్త పాఠాలు చేరిస్తే వాటిని ముందుగా ఉపాధ్యాయులు నేర్చుకోవాలి. అందుకని వాటిని సిలబస్‌లో చేర్చడానికి వీరు ముందుకురారు. కాని విద్యార్థులు మాత్రం వీరి ఆలోచనా పరిధి దాటి పోతున్నారు సంగతి గ్రహించడం లేదు. అధ్యాపకులకు  బోధనా సామర్థ్యాలు పెరిగేట్లు  ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలి.  ఆధునిక, శాస్త్ర సాంకేతిక విద్య విద్యార్థులకు అందించినప్పుడే దేశంలో ఆర్థికాభివృద్ధి వేగంగా జరుగుతుంది.చిన్న వయస్సు నుండే పిల్లలకు శాస్త్రీయ దృక్పథం, సాంకేతిక నైపుణ్యం అలవడడానికి కావలసిన ప్రాథమిక అంశాలు పాఠ్యాంశాలలో చేర్చాలి. దీనితో మూఢ నమ్మకాలు, మూర్ఖ విశ్వాసాలకు దూరంగా హేతుబద్ధంగా ఆలోచించడం నేర్చుకుంటారు. అంతేకాకుండా కళాశాల స్థాయి వచ్చే సరికి విద్యార్థులు సొంత సాంకేతిక అంశాలు రూపొందించే సామర్థ్యాన్ని పుణికి పుచ్చుకుంటారు.

పాఠశాలలో ప్రప్రథమంగా పరిసరాల విజ్ఞానాన్ని విద్యార్థులకు నేర్పాలి. తమ చుట్టూ జరుగుతున్న భౌతిక రసాయన,వృక్ష విజ్ఞానాన్ని విద్యార్థులకు అందించాలి. దీనివల్ల విద్యార్థులకు సమాజంపై అవగాహన, బాధ్యత పెరుగుతుంది. పిల్లలకు నైతిక విలువలు, మానవ సంబంధాలు, సానుకూల దృక్పథం, లక్ష్య సాధన గురించి వారంలో ఒక గంట పాటు విధిగా బోధించాలి.  సామాజిక శాస్త్రాల ప్రాముఖ్యత తగ్గుతోంది. రాహుల్‌ సాంకృత్యాయన్‌, డి.డి. కోశాంబి, రొమెల్ల థాపర్,  గాంధీ నెహ్రూ అంబెడ్కర్ గొప్ప గొప్ప రచయితలు వ్రాసిన పుస్తకాలు చదివే వారే కరువయ్యారు.  వాళ్ళు రాసిన పుస్తకాలు చదివితే  చరిత్రపై  అవగాహన వస్తుంది. అలాగే ఆర్యుల సంస్కృతి గురించి చదవాలి. అంబేద్కర్‌, జ్యోతి బా ఫూలే పెరియార్  పుస్తకాలు చదివితే  మన సమాజం ఎందుకు ఇలా ఉంది? కులం పునాదులు సమాజంలో ఎంత బలంగా నాటుకుపోయాయో తెలుస్తుంది.

ఇప్పటికీ మన సమాజం మూఢవిశ్వాసాలతోనే నడుస్తున్నది. పిల్లలకు చరిత్ర పట్ల శాస్త్రీయ అవగాహన లోపించింది. వారి జ్ఞానం కేవలం పుస్తకాలకే పరిమితమవుతోంది. మన చరిత్ర భిన్నకోణాలల్లో ఉన్న సంగతి ఇలాంటి పుస్తకాల అధ్యయనం ద్వారా తెలుస్తుంది.  జీవితానికి కావలసింది ఇనీషియేటివ్, క్రియేటివ్ దృక్పధం మాత్రమే అన్న సంగతి పౌరసమాజం గ్రహించాలి. వీటిని మన మార్కుల పరీక్షలు కొలువలేవు. మన బడులలో  పెద్దగా వికాసం కనిపించక పోవడంలో ఆశ్చర్యం లేదు. మన పరీక్షల్లో కొలిచేది మెమొరీ, విశ్లేషణా సామర్ధ్యాలని మాత్రమే. వీటి పాత్ర కూడా జీవితంలో ఉన్నప్పటికీ కొత్తగా ఆలోచించడానికి, సమస్యలని పరిష్కరించడానికి ఇవి మాత్రమే సరిపోవు.

Leave a Reply