అట్టర్ ఫ్లాప్ సినిమా… బీజేపీ ఇకనైనా తప్పుల్ని సమీక్షించుకుంటుందా..?

మేము సరిగా పనిచేయలేకపోయాము – బాసవరాజ్ బొమ్మై !

యడ్యూరప్ప డిమాండ్ల కి తలవొగ్గి, బొమ్మై ని ముఖ్యమంత్రిగా చేయడం తప్పితే, బిజేపి అధిష్టానానికి వేరే దారి కనపడకపోవడమే ఈనాటి ఈ దుస్థితి కి కారణం! నేటి పరాజయం 2021 లోనె ఫిక్స్ అయిపోయింది !
బసవరాజ్ బొమ్మై ఇంజినీరింగ్ చదివి రాజకీయాలలోకి వచ్చినవాడు ! కానీ రాజకీయం అంటే ఏమిటో పూర్తిగా వంటబట్టించుకొని వాడు ! ఏరి కోరి ఎడ్యూరప్ప బొమ్మై ని ఎందుకు ఎంచుకున్నాడు తన ప్రతినిధిగా ? సరిగ్గా మాట్లాడలేడు. త్వరగా నిర్ణయాలు తీసుకోలేడు ! ప్రతి దానికి అయితే ఎడ్యూరప్పని కానీ లేకపోతే, కేంద్ర ప్రభుత్వం వైపు చూడడం గానీ చేస్తూ వచ్చాడు తప్పితే, తనంత తానుగా వేగంగా నిర్ణయాలు తీసుకొని వాటిని అమలుపరచలేకపోయాడు బొమ్మై!

ముఖ్యంగా కర్ణాటకలో హిజాబ్ వివాదం మొదలవగానే వేగంగా స్పందించి వెంట వెంటనే చర్యలు తీసుకొని ఉంటే, బాగుండేది కానీ అలా చేయలేకపోయాడు బొమ్మై ! చివరకి కర్ణాటక హై కోర్టులో కౌంటర్ పిటిషన్ వేయడానికి కూడా చాలా సమయం తీసుకున్నాడు ! అయితే ఇలాంటి జాప్యం జరగడానికి వెనుక నిర్ణయం బొమ్మై తీసుకున్నాడా లేక కేంద్ర పెద్దలు తీసుకున్నారా అనేది నాకు తెలియదు. కానీ విపరీతమయిన జాప్యం జరిగింది. వెరసి ప్రజల్లో అసహనం వచ్చింది!

ఇక మంత్రులు, ఎంఎల్ఏ లు ఎవరికి దొరికినంత వాళ్ళు దండుకోవడం, బహుశా కర్ణాటక లోనె జరిగి ఉంటుంది ఈ మధ్య కాలంలో ! చిన్న చిన్న కాంట్రాక్ట్ పనులు చేసే వాళ్ళ దగ్గర నుండి , పెద్ద పెద్ద కాంట్రాక్టులు చేసేవాళ్ళ వరకు అందరూ కంప్లైంట్స్ చేస్తూనే వచ్చారు పర్సెంటేజీ ల మీద . కానీ ఎవరూ స్పందించలేదు సరికదా వసూలు చేసుకుంటూపోయారు !

1. బొమ్మై ప్రభుత్వం పని తీరు నత్త నడకని సిగ్గు పడేలా చేసింది.
2. కులాల కుంపట్ల సంగతి ఎందుకు మాట్లాడుతున్నారు ? బాగా పని చేసిఉంటే కులాలకి అతీతంగా వోట్లు పడేవి.
3. గత సంవత్సరమే కోస్తా కర్ణాటకలో బావులు ఎండిపోయి, జనం మంచినీటి కొరత తో అల్లాడుతుంటే ఏదన్నా పనికివచ్చే చర్యలు తీసుకుందా కర్ణాటక ప్రభుత్వం ? పోయిన సంవత్సరం ఏప్రిల్ నెల ముగిసేవరకు బావులలో కొద్దో గొప్పో నీళ్ళు ఉండేవి. కానీ ఈ సారి ఏప్రిల్ నెల రాకముందే బావులు పూర్తిగా ఎండిపోయాయి. ఈ విషయంలో ప్రభుత్వం నుండి ఏదన్నా శాశ్వత పరిష్కారం ఉంటుంది అని భావించిన కర్ణాటక కోస్తా ప్రజలకి , నిరాశే ఎదురయ్యింది. అసలు ఈ సమస్యని ఎవరూ పట్టించుకోలేదు అక్కడ !

4. మోడీ ఎన్నికల ప్రచారానికి వస్తే వోట్లు పడతాయని అని అనుకోవడం పెద్ద భ్రమ ! కర్ణాటక రాష్ట్రంలో మోడీ పరిపాలన చేస్తారా ? పోనీ మోడీ వలన ముందు ముందు మంచి పరిపాలన వుంటుంది అని భావించి ప్రజలు వోట్లు వేస్తారు అని ఎలా అనుకున్నారు ? గత రెండేళ్ల నుండి ప్రధానిగా మోడీ ఉన్నారుగా ? అలాంటిది ఎన్నికలు అయిపోయి మళ్ళీ బిజేపి ప్రభుత్వం ఏర్పడితే అంతా బాగా అయిపోతుంది అని ప్రజలు ఎలా అనుకోగలరు ? ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు ?
5. మోడీ, యోగీ లు ప్రచారానికి వచ్చినా నేను ఎలాంటి పోస్ట్ పెట్టలేదు ! ఎందుకంటే వాళ్ళు ప్రచారానికి వచ్చినా వోట్లు పడనంతగా డ్యామేజీ ఆల్రెడీ అక్కడ జరిగిపోయింది ! మోడీ,యోగీ ల ప్రచారం వలన వోట్లు పడవు అని వారం క్రితమే పోస్టు పెట్టి ఉంటే నన్ను అందరూ కలిసి బిజేపి వ్యతిరేకి అనేవాళ్ళు!
6. ఒక్క చిన్న విషయం ! యోగీ కర్ణాటక ప్రచారానికి వస్తే ఉత్తర ప్రదేశ్ లో యోగీ ఎలా పాలన చేస్తున్నారో, కర్ణాటకలో కూడా అలాంటి పాలన వస్తుంది అని ప్రజలు ఎలా నమ్ముతారు ? అప్పటికే రెండేళ్ళు పాలన చూశారు కదా ? కాబట్టి యోగీ ని చూడడానికి ప్రజలు వచ్చారు అంతే !

7. మోడీ ని చూసి ప్రజలు ఎలా వోట్లు వేస్తారు అనుకున్నారు ? ఆయనలా పరిపాలన చేయగలవాళ్ళు కర్ణాటకలో ఎవరూ లేరని ప్రజలు గ్రహించారు. కాబట్టి అభిమానంతో చూడడానికి వచ్చారు తప్పితే వోట్లు వేయలేదు !
8. కర్ణాటక బిజేపి ప్రభుత్వ పాలన ఎలా ఉందో ఢిల్లీ లోని పెద్దలకి తెలియదా ? క్రైసిస్ మేనేజర్ గా ప్రతి సారి అమిత్ షా గారే ఎందుకు పనిచేయాల్సి వస్తున్నది ? ఆ పని చేయాల్సింది నడ్డా గారు కదా ? పార్టీ అంతర్గత వ్యవహారాలని చక్క దిద్దాలసిన పని జాతీయ అధ్యక్షుడు నడ్డా గారి పని అంతే కానీ అది అమిత్ షా గారి పని కాదు!
9. ఒక హోమ్ మంత్రిగా అమిత్ షా గారికి చాలా పనులు ఉంటాయి. కానీ పార్టీలో జరిగే ప్రతి దానికి ఆయన మీద ఆధారపడం మానేయాలి. లేదా పెద్దలు కూర్చొని మాట్లాడుకొని బాధ్యతలని వేరే వాళ్ళకి అయినా [సమర్ధులకి బిజేపి లో కొదువ లేదు. కానీ అంతా ఒకే చోట సెంట్రలైజ్ అయ్యింది ] అప్పచెప్పాలి. కానీ ఆ పని ఎందుకు చేయలేకపోతున్నారో తెలియదు. ఇది బిజేపి కి నష్టం !

10. గత డిసెంబర్ నెలలోనే కాంగ్రెస్,టిడిపి,brs లాంటి పార్టీల IT CELL లని బలంగా వాడుకోవాలి అని నిర్ణయం తీసుకొని నిధులని వెచ్చిస్తూ వస్తున్నారు. ఇది ముందస్తు ప్రమాద గంట !
11. కానీ బిజేపి విషయానికి వస్తే .. ఆయా రాష్ట్రాల IT సెల్ విభాగాలకి పక్షవాతం వచ్చినట్లు ప్రవర్తిస్తూ వస్తున్నాయి. ఆంధ్రా, తెలంగాణ, కర్ణాటక విభాగాలు అయితే మరీ కనా కష్టంగా పని చేస్తున్నాయి. ఏదన్నా విషయం మీద వైరి పక్షం నుండి విమర్శలు వస్తూ అవి వైరల్ అవుతుంటే, వాటికి ధీటుగా జవాబులు చెప్పాల్సిన బిజేపి IT సెల్ లు, ఏవో నాలుగు వాక్యాలు ఫోటోషాప్ లో టైప్ చేయించి వాటిని ప్రచారం చేస్తున్నారు తప్పితే , వేరే ఏం చేయలేకపోతున్నాయి ఎందుకు ? నిధులు లేవా ? లేక సరి అయిన వాళ్ళు వాటిలో ఉండడం లేదా ?
12. హిజాబ్ వివాదం చెలరేగి నప్పుడు కర్ణాటకలోని IT సెల్ ఏం చేసింది ? అసలు కర్ణాటక బిజేపి IT సెల్ పని చేస్తున్నదా ? ఇప్పటి ఎన్నికలనే తీసుకుంటే కాంగ్రెస్ IT సెల్ చాలా చురుకుగా పని చేసింది కర్ణాటకలో. బిజేపి IT సెల్ మాత్రం ధీటుగా స్పందించలేకపోయింది ! నిజానికి కర్ణాటకలో బిజేపి అధికారంలో ఉంది కాబట్టి అక్కడి IT సెల్ కి నిధుల కొరత ఉండదు. కానీ ఎందుకు ధీటుగా స్పందించలేకపోయింది ? నిధులు ఇవ్వలేదా లేక మింగేసారా ? జీతాలు లేకుండా ఎవరు పనిచేస్తారు ? అదే కాంగ్రెస్ అయితే యూట్యూబ్, సోషల్ మీడియాని బాగా వాడుకుంది ఈసారి !

13. 2013 లో ఎవరూ అడగకుండానే సోషల్ మీడియాలో వేల మంది స్వచ్ఛందంగా పని చేశారు బిజేపి గెలుపు కోసం ! ఆ వొరవడి 2019 ఎన్నికల వరకు కొనసాగింది బాగా ! 2020 నుండి క్రమంగా తగ్గు ముఖం పడుతూ వస్తున్నది నేటి వరకు ! ఎందుకిలా జరుగుతున్నది ? ఎవరన్నా ఆలోచించారా ? కనీసం గమనించారా ?
14. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలలో బిజేపి IT సెల్ పేరుతో ఎన్ని పేజీలు ఉన్నాయో లెక్కపెట్టడం కష్టం ! కానీ పనికి వచ్చే పోస్టులు ఎన్ని ఉంటున్నాయి వాటిలో? ఆ పేజీలని నడిపేవారికి అయినా తెలుస్తున్నదా ? అసలు అధికారిక పేజీ ఏదో అభిమానుల పేజీ ఏదో ఎవరికీ తెలియదు కానీ గుంపులు గుంపులుగా ఉంటారు సభ్యులు.
15. ఏదన్నా విమర్శ వచ్చినప్పుడు మాత్రం , ఒ నాలుగు లైన్ల పోస్టు పెట్టి దానినే వైరల్ చేస్తున్నారు కానీ విపులంగా సమస్య మూలాలలోకి వెళ్ళి చర్చిస్తే దానికి విలువ ఉంటుంది !
16. నేను విమర్శిస్తున్నాను అని ఎవరన్నా అనుకుంటే, అంతకంటే పిచ్చి ఆలోచన వేరొకటి ఉండదు ! చూస్తూ ఉండండి కర్ణాటక విజయం తరువాత కాంగ్రెస్ సోషల్ మీడియాని ఎలా నడిపిస్తుందో ! వాళ్ళు ఆలస్యంగా గ్రహించినా , చాలా వేగంగా పని చేయబోతున్నారు ముందు ముందు.

కర్ణాటక కాంగ్రెస్ లో బిజేపి ని ధీటుగా ఎదుర్కోగల నాయకులు ఉన్నారు. కానీ బిజేపి లో అలాంటి వారు ఎవరూ లేరు. కర్ణాటక బిజేపి నాయకులు కేవలం మోడీ ని నమ్ముకొని పనిచేస్తున్నారు కానీ ఇది చాలా పెద్ద తప్పు. కర్ణాటక అయినా.. తెలంగాణ అయినా సరే, ముందు స్థానిక నాయకత్వం గట్టిగా పనిచేస్తూ అవసరం అయినప్పుడు మోడీ ని,అమిత్ షా ని సహాయం కోరాలి. కానీ పూర్తిగా వాళ్ళిద్దరి మీదనే ఆధారపడితే ఉపయోగం ఉండదు భవిష్యత్తులో !

2024 లోక్ సభ ఎన్నికల కోసం, నిధులు సమకూర్చుకోగల రాష్ట్రం కర్ణాటక ఇప్పుడు కాంగ్రెస్ చేతిలోకి వెళ్లిపోయింది. కాబట్టి రాబోయే లోక్ సభ ఎన్నికలు వాడిగా వేడిగా ఉండబోతున్నాయి. అఫ్కోర్స్ ఈ సంవత్సరం చివరలో జరగబోయే రాజస్థాన్ లో, కాంగ్రెస్ గెలుస్తుంది అనే నమ్మకం ఎవరికీ లేదు.

నేను నిధులు సమకూరుస్తుంది అంటున్నాను అంటే.. అది రాజకీయ పార్టీలకి విరాళాలు ఇచ్చే వాళ్ళ విషయంలో అని అర్ధం చేసుకోండి. ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళకే ఎక్కువ విరాళాలు ఇస్తారు పారిశ్రామిక వేత్తలు ! కర్ణాటక విజయం అనేది కాంగ్రెస్ కి ఆక్సీజెన్ లాంటిది. అలాంటిది , పోయి పోయి బిజేపి చేతులారా వదిలేసుకుంది !

2024 లో జరగబోయే ఎన్నికలలో, మోడీ కి దగ్గరగా రాగల ప్రతిపక్ష నాయకుడు ఎవ్వరూ లేరు ! ఇది నా వ్యక్తిగత అభిప్రాయమే కాదు .ఎలాంటి పక్షపాతం లేకుండా ఎనలైజ్ చేసే పాశ్చాత్య సంస్థలు చెప్తున్నది కూడా ఇదే !

ఇక ఎప్పుడూ రెండో సారి అధికారం ఇవ్వకూడదు అనే సాంప్రదాయాన్ని కర్ణాటక ప్రజలు ఆచరించారు ! కాకపోతే ముఠా తగాదాలతో కొట్టుకు చస్తున్న కర్ణాటక కాంగ్రెస్, ఎన్ని నెలలు ప్రభుత్వాన్ని సమర్ధవంతంగా నడపగలదో, వచ్చే రోజుల్లో తెలిసిపోతుంది ! DK కనుక ముఖ్యమంత్రి అవకపోతే మాత్రం సిద్ధ రామయ్యకి గడ్డు రోజులే ! అలా అని DK కనుక ముఖ్యమంత్రి అయితే, ఆ ప్రభుత్వాన్ని కూల్చే పనిని సిద్ధరామయ్య చాలా శ్రద్ధగా చేస్తాడు ! ఇక రాహుల్ తనని తాను ‘ఆన్ స్టాపబుల్ ‘ అంటూ తెగ పొగిడేసుకుంటున్నాడు. కానీ ఇతను కర్ణాటకలో అడుగు పెట్టక పోవడమే మంచిది అయ్యిందని ఎప్పుడు గ్రహిస్తాడు ?

– పార్ధసారధి పోట్లూరి

Leave a Reply