దస్తగిరికి భద్రత కల్పించండి

– డీజీపీకి టీడీపీ నేత వర్ల రామయ్య లేఖ

వివేకా హత్య కేసులో అప్రువర్ గా మారిన దస్తగిరిపై, సీబీఐ అధికారులపై స్థానిక పోలీసులు తప్పుడు కేసులు పెట్టడం మానుకుని వారికి తగిన భద్రత, రక్షణ కల్పించాలంటూ డీజీపీకి లేఖ రాసిన తెదేపా నేత వర్ల రామయ్య

హైకోర్టు ఆదేశాల మేరకు వివేకా హత్య కేసు సిబిఐ దర్యాప్తు చేస్తున్న విషయం మీకు విదితమే. వివేకా హత్య కేసులో దస్తగిరి అప్రూవర్‌గా మారినప్పటి నుంచి దస్తగిరికి ప్రాణహాని ఉంది. అధికార పార్టీ నాయకుల ఆదేశాల మేరకు స్థానిక పోలీసులు దస్తగిరి పై తప్పుడు కేసులు బనాయిస్తున్నారు.

స్థానిక పోలీసులు సీబీఐ బృందాన్ని కూడా విడిచిపెట్టడం లేదు.సీబీఐ దర్యాప్తు అధికారిపై సైతం తప్పుడు కేసులు పెట్టారు.సీబీఐ టీమ్‌పై బాంబులు విసరుతామంటూ సీబీఐని బెదిరించారు.వివేకా హత్యకేసులో అధికార పార్టీ నాయకుల ప్రమేయం ఉండటంతో వారి ఆదేశాల మేరకే పోలీసుల వ్యవహర శైలి ఉందంటూ ప్రజలు అనుకుంటున్నారు.

వివేకా హత్యకు కారకులైన నిందితులపై పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సిన సమయం ఆసన్నమైంది. ఈ కేసులో అప్రూవర్ గా మారిన దస్తగిరికి, సీబీఐ అధికారులకు సరైన భద్రత, రక్షణ కల్పించడం చాలా ముఖ్యం.దస్తగిరికి గానీ, సీబీఐ దర్యాప్తు అధికారులకు గానీ ఏదైనా హాని జరిగితే, వైసీపీ ప్రభుత్వంతో పాటు రాష్ట్ర పోలీసులు బాధ్యత వహించాల్సి ఉంటుంది. కావున అధికార పార్టీ నేతల ఆదేశాల మేరకు కాకుండా రాజ్యాంగం ప్రకారం పోలీసులు నడుచుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను.

Leave a Reply