విజయమ్మ, షర్మిల ప్రాణాలకు ముప్పు…రాష్ట్రంలో వైఎస్ భారతి రాజ్యాంగం నడుస్తోంది: డీఎల్

మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.వచ్చే ఎన్నికల్లో జగన్ ప్రభుత్వం రాదని స్పష్టమైందన్నారు. గతంలో తన కుటుంబసభ్యుల మరణాల సానుభూతితోనే.. జగన్‌రెడ్డి అధికారంలోకి వచ్చారని తెలిపారు. ప్రజా వ్యతిరేకత వల్ల జగన్‌రెడ్డి దేనికైనా బరితెగించవచ్చని, వైఎస్ విజయమ్మ, వైఎస్ షర్మిల ప్రాణాలకు ముప్పు పొంచి ఉందని ఆయన అన్నారు. వీరిద్దరూ చాలా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ప్రశాంత్ కిశోర్ సలహా మేరకు మరో ఇద్దరి హత్య జరిగే అవకాశం ఉందని చెప్పారు.హైదరాబాద్‌లో ఉన్న విజయమ్మ, షర్మిల వద్దకు ఎవరొచ్చి ఏమి మాట్లాడినా క్షణాల్లో సీఎం జగన్‌కు తెలిసిపోతోందని, అంతగా నిఘా పెట్టారని తెలిపారు. అధికార దాహం కోసం జగన్‌ సమీప కుటుంబసభ్యులను కూడా హత్యలు చేసేందుకు వెనకాడరని డీఎల్‌ పేర్కొన్నారు. గత ఎన్నికల సమయంలో ప్రజల నుంచి సానుభూతిని పొందేందుకే వివేకా హత్య, వైజాగ్ లో కోడికత్తితో దాడి డ్రామా వంటివి జరిగాయని ఆరోపించారు. జగన్ పై కోడికత్తితో దాడి వెనుక కుట్రకోణం లేదని కోర్టుకు ఎన్ఐఏ తెలిపిందని చెప్పారు.

తాడేపల్లి నుంచి వైఎస్ భారతి రాజ్యాంగం నడుస్తోందని డీఎల్ దుయ్యబట్టారు.వివేకా హత్య జరిగినప్పుడు నారాసుర రక్త చరిత్ర అంటూ టీడీపీ అధినేత చంద్రబాబుపై రుద్ది ఇప్పుడు వివేకా హత్యలో సునీల్‌ యాదవ్‌ తల్లితో అక్రమ సంబంధం అనడం సిగ్గుచేటని అన్నారు. వివేకా హత్య కేసులో ఎంత మంది అధికారులను మార్చినా ఒరిగేది లేదని… నిందితులకు కచ్చితంగా శిక్ష పడుతుందని అన్నారు.ఇప్పటికే చాలామంది మంత్రులు, శాసన సభ్యులందరూ అసమ్మతిలో ఉన్నారని, వచ్చే ఎన్నికల్లో ఓటమి తప్పదని.. జగన్‌ మనస్సులో పడిందని అందుకనే డొంకతిరుగుడు చర్యలకు పాల్పడుతున్నాడని డీఎల్ రవీంద్రారెడ్డి ధ్వజమెత్తారు. వచ్చే ఎన్నికల్లో మైదుకూరు నుంచి తాను ఇండిపెండెంట్ గా పోటీ చేయనని డీఎల్ చెప్పారు. గత ఎన్నికల్లో సుధాకర్ యాదవ్ కు తాను మద్దతిస్తే, తమ వర్గాన్ని తొక్కేశారని మండిపడ్డారు.

Leave a Reply