Suryaa.co.in

Andhra Pradesh

తెలుగుదేశం పార్టీలో నాయకుడిగా ఉండడమే నారాయణ చేసిన తప్పా?

-నారాయణ ఇంట్లో దాడులు అమానుషం
– శాసనమండలి మాజీ ఛైర్మన్ ఎంఏ షరీఫ్
– నారాయణ సహకారం తెలుగుదేశం పార్టీకి ఉండకూడదనేదే జగన్ లక్ష్యం

తెలుగుదేశం పార్టీలో నాయకుడిగా ఉండడమే నారాయణ చేసిన తప్పా? అని శాసనమండలి మాజీ ఛైర్మన్ ఎంఏ షరీఫ్ ప్రశ్నించారు. శనివారం మంగళగిరిలోని టీడీపీ జాతీయ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడిన మాటలు …

అంతమంది సిబ్బందితో దాడులు చేయడానికి నారాయణ ఏమైనా స్మగ్లరా?
నారాయణ ఇంట్లో దాడులు అమానుషం. తెలుగుదేశం పార్టీ నాయకుడు నారాయణ ఇంట్లో సోదాలు చేయడం అన్యాయం. వ్యక్తిగత కక్షకు ఇది పరాకాష్ట. మాజీమంత్రి నారాయణపై జగన్ రెడ్డికి ఇంకా పగ తీరినట్టు లేదు. కోర్టు ఉత్తర్వులు లేకుండా 5గురు డీఎస్పీలు, 8మంది సీఐలు, వంద మంది పోలీసులతో నారాయణ ఇంటిని సోదా చేయడం అక్రమం. ఆయన ఏమైనా స్మగ్లరా? వైసీపీ ప్రభుత్వం వ్యవస్థల్ని నిర్వీర్యం చేస్తోంది.

ప్రతిపక్ష నాయకులను వేధించడానికి వ్యవస్థల్ని వాడుకుంటున్నారు
ప్రతిపక్ష పార్టీ నాయకులను వేధించడానికి వ్యవస్థల్ని ఒక అస్త్రంగా ప్రభుత్వం వాడుకుంటోంది. అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందనడానికి నారాయణ ఇంటి సోదాలే నిదర్శనం. ప్రతిపక్ష నాయకులను భయాందోళనలకు గురిచేసేందుకు వ్యవస్థల్ని ఉపయోగించుకుంటున్నారు.

విద్యార్థుల్లో విద్యా ప్రమాణాలు పెంచుతున్న నారాయణ
నారాయణ స్కూళ్లు, కాలేజీలు, మెడికల్ కాలేజీలు స్థాపించి మంచి పేరు గడించారు. మంచి విద్యా సంస్థలను స్థాపించి పేరు ప్రతిష్టలు తెచ్చుకున్నారు. కింది నుండి కష్టపడి ఒక ఉన్నతస్థాయికి వచ్చిన వ్యక్తి నారాయణ. విద్యార్థుల్లో విద్యా ప్రమాణాలను కాపాడుతూ వస్తున్నారు. బడుగు, బలహీనవర్గాలకు చెందిన పిల్లలకు ఫీజుల్లో రాయితీలిస్తూ విద్యా వ్యాప్తికి ఇతోధికంగా తోడ్పడుతున్నారు.

నిజాయితీ, నిబద్ధత కలిగిన వ్యక్తి నారాయణ. మంచి వ్యక్తులపైనా మీ దాడులు అని వైసీపీ నాయకులను ప్రశ్నిస్తున్నాను. నారాయణ దాదాపు 2 దశాబ్దాలుగా టీడీపీలో ఉండి చంద్రబాబుకు అత్యంత విశ్వాసపాత్రుడిగా ఉన్నారు. పార్టీ కేడర్ ను ప్రోత్సహిస్తూ వస్తున్నారు. ఆయన పార్టీకి చాలా సహకరిస్తూ వస్తున్నారు. పార్టీ ప్రతిష్ట కు కృషి చేస్తున్నారు.

మాజీ మంత్రి నారాయణపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి కక్ష తీరలేదు
అధికారంలోకి వచ్చినప్పటినాటి నుంచి నేటి వరకు ప్రతిపక్ష నేతలపై వేధింపులు కొనసాగిస్తూనే ఉన్నాయి. మొదట నారాయణ విద్యా సంస్థలపై దాడులు చేసి అక్రమ కేసులు పెట్టారు. ఆ తరువాత రాజధానిలో అక్రమంగా భూముల కొనుగోళ్లు అంటూ కేసులు పెట్టారు. ఇవేవీ నిరూపించలేకపోయారు. ఇప్పుడు నారాయణ ఇంటిలోకి వెళ్లి సోదాలు జరిపారు. ఎలాంటి అనుమతులు లేకుండా మాదక ద్రవ్యాల నిరోధక అధికారులు నారాయణ ఇంట్లో ఎలా సోదాలు జరుపుతారు? అధికారులు అక్రమంగా నారాయణ ఇంటిలోకి ఎలా వెళతారు?

జగన్ మాట వింటే అధికారులు బలవక తప్పదు
జగన్ రెడ్డి చెప్పినట్లు అధికారులు వింటే రాబోయే రోజుల్లో అధికారులు బలవక తప్పదు. నారాయణ ఏమైనా తీవ్రవాదా? ఆయన ఇంట్లో సోదాలు జరపాల్సిన అవసరమేంటి? ఇంట్లో అంత కష్టపడి సోదాలు జరిపారు. ఏం దోరికాయో తెలపాలి. నారాయణ నెల్లూరు నుంచి పోటీ చేయబోతున్నాడని ఆయనను ఇప్పటినుంచే భయభ్రాంతానికి గురిచేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో గెలవలేక ఇప్పటి నుంచే ప్రతిపక్ష నేతల్ని బెదిరిస్తున్నారు.

అధికారం కోల్పోతున్నా జగన్ లో ఇంకా మార్పు లేదు
అధికారం కల్పోతున్నా జగన్ రెడ్డికి ఇంకా బుద్ధి రాలేదు. జగన్మోహన్ రెడ్డి భవిష్యత్తులో తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు. నారాయణ భార్యని హౌస్ అరెస్టు చేశారు. నారాయణ ఇంటిలోని మంచాలను ధ్వంసంచేశారు. నారాయణ ఇంటిలో ఎటువంటి మాదకద్రవ్యాలు, ధనం లభిచలేదు, అనవసరంగా దాడులు జరపడం ఎంతవరకు సబబు?

2014 నుండి నెల్లురును అభివృద్ధి చేసినవ్యక్తి నారాయణ
2014నుండి 2019 వరకు నెల్లూరు పట్టణాన్ని నారాయణ అభివృద్ధి చేశారు. నారాయణ రోడ్లు, మౌలిక సదుపాయాలు కల్పించారు. నెల్లూరు జిల్లా అభివృద్ధికి వందలాది కోట్లు ఖర్చు చేశారు. నెల్లూరు స్వరూపాన్నే మార్చేశారు. నారాయణను ఎందుకన్నా ఓడించామా అని నెల్లూరు వాసులు పాశ్చాత్తాపం పొందతుతున్నారు. ఇప్పుడు ఆయనను గెలిపించడానికి నెల్లూరు జిల్లా ప్రజలు సంసిద్ధంగా ఉన్నారు. అందరూ ఈసారి నారాయణ గెలవాలి అని అనుకుంటున్నారు. ఆధారాలు లేని ఆరోపణలు చేసి నారాయణ ఇంటిపై దాడి చేశారు.

నంబూరులోని ముస్లింల ధార్మిక సమ్మేళనానికి ఫ్రీ రైలు అని చెప్పి మోసం చేశారు
గుంటూరు జిల్లా నంబూరులో 10, 11న తబ్లిఖ్ ఇస్తెమా ఉంది. దీనికి లక్షలాది మంది ముస్లింలు రాష్ట్ర వ్యాప్తంగా తరలివస్తారు. దీన్ని రాజకీయంగా మలచుకోవాలనే దురుద్దేశంతో రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి ముస్లింలకు ప్రత్యేక ఉచిత రైలు సదుపాయం ఏర్పాటు చేస్తున్నామని చెప్పి మోసం చేశారు. టికెట్ లేకుండా ముస్లిం సోదరులు ప్రయాణించొచ్చని ఎంపి ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పారు. తీరా రైలెక్కబోతే ఇది స్పెషల్ రైలు అని,14 వందలు పెట్టి ట్రైన్ టికెట్ తీసుకోవాలన్నారు. టికెట్ లేకుండా ట్రైన్ ఎక్కితే తనిఖీ చేసి మధ్యలో దించేస్తామనడంతో ముస్లిం సోదరులు నివ్వెరపోయారు.

రాజకీయాలకు అతీతంగా ఉండాల్సిన మైనార్టీ కమిషన్ ఛైర్మన్ వైసీపీకి వత్తాసు
రాజకీయాలకు అతీతంగా ఉండాల్సిన మైనార్టీ కమిషన్ ఛైర్మన్ ఎగ్బాల్ అహ్మద్ ఖాన్ మదనపల్లి అభ్యర్థి నిసార్ అహ్మద్ తో కలిసి ఒక పత్రికా సమావేశం ఏర్పాటు చేసి మిథున్ రెడ్డి నాయకత్వంలో ఉచిత రైలు సదుపాయం కల్పిస్తున్నామని డబ్బాలు కొట్టుకున్నారు. మొన్న మొలకలచెరువు రైల్వే స్టేషన్ లో వేలాదిగా ముస్లిం లు రైలు ఎక్కడానికి వెళితే రైల్వే అధికారులు అడ్డు చెప్పారు. పత్రికా ప్రకటన చేసి ధార్మిక సమావేశానికి ఉచితమని చెప్పి మోసం చేశారు.

ముస్లింలపై దాడులు అమానుషం, వాటిని నిరోధించాలి
ముస్లింలపై దాడులు, వారి ఆస్తుల విధ్వంసం, వారిపై హత్యా ప్రయత్నాలు అధికమయ్యాయి. ముస్లింలకు కలుగుతున్న ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. వీటిపై ప్రశ్నిస్తే వైసీపీ నాయకులు నోరు మెదపడంలేదు, అన్యాయం జరిగితే వచ్చి ఒక్కసారి కూడా విచారించిన పాపాన పోలేదు. ఏ ఉద్దేశంతో ఆయనను మైనార్టీ కమిషన్ ఛైర్మన్ ను ఎందుకు పెట్టారో అర్థం కావడంలేదు. ఆ ఉద్దేశాలకు నీరొదిలారు. రెండు సంవత్సరాలు అయినా ముస్లింలకు చేసిందేమీ లేదు.

ఈ ప్రభుత్వమే సదా ఉంటుందనుకోవడం భ్రమే. రాబోయేది టీడీపీనే అప్పుడు వైసీపీ తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు.అధికారులు ఇప్పటికైనా తమ తీరును మార్చుకోవాలి. మరో రెండు నెలల్లో టీడీపీ-జనసేన ప్రభుత్వం వస్తుంది. కొందరు అధికారులు నాయకులకు వత్తాసు పలుకుతున్నారు. తప్పు చేసినవారు తప్పించుకోలేరు. ప్రతి ఒక్కరు వడ్డీతో సహా మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని శాసనమండలి మాజీ ఛైర్మన్ ఎంఏ షరీఫ్ వివరించారు.

LEAVE A RESPONSE