Suryaa.co.in

Andhra Pradesh

జగన్ హెలికాప్టర్ దిగకుండా ఆపే దమ్ము మాకుంది

– జగన్ తోపుదుర్తి మాటలు విని వస్తున్నాడు
– అప్పుడు పరిటాలను మీరు పులివెందులలో అడ్డుకున్నారు
– మూడు వాహనాల్లోనే అనుమతించారు
– శివమెత్తిన రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత

రాప్తాడు: ‘‘మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి మాటలు విని జగన్ వస్తున్నాడు. ఆయన హెలికాప్టర్ దిగకుండా ఆపే దమ్ము, శక్తి మాకుంది. ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన గొడవను, తోపుదుర్తి సోదరులు రాజకీయం చేస్తున్నార’ ’ ని టీడీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి పరిటాల సునీత మండిపడ్డారు. చనిపోయిన లింగమయ్య కుటుంబానికి సాయం చేసేందుకు తాను ముందుంటానని చెప్పారు.

ఒక చావును రాజకీయం చేయడానికి జగన్ ఇప్పుడు రాప్తాడుకు వస్తున్నాడని దుయ్యబట్టారు. బీసీలపై జగన్ కు అంత ప్రేమ ఉంటే… రాప్తాడు ఇంఛార్జీగా బీసీకి అవకాశం ఇవ్వాలని సవాల్ విసిరారు. జగన్ పర్యటన సందర్భంగా టీడీపీ నేతలు, కార్యకర్తలు సహనం కోల్పోవద్దని సునీత కోరారు.

వైసీపీ కార్యకర్త లింగమయ్య మరణంపై బాధ పడిన తొలి వ్యక్తి తానేనని.. లింగమయ్యను హత్య చేసిన వ్యక్తులను వెంటనే అరెస్ట్ చేయాలని అన్నారు. తోపుదుర్తి బ్రదర్స్ చెప్పిన మాటలు విని రాప్తాడు నియోజకవర్గంలో రాజకీయాలు చేయవద్దని జగన్ కు సునీత సూచించారు.

గతంలో పరిటాల రవి పులివెందులకు వెళ్లినప్పుడు.. మీరు అడ్డుకున్నారని, వాహనాలను ఆపేసి కేవలం మూడు వాహనాలకు మాత్రమే అనుమతిని ఇచ్చారని గుర్తు చేశారు. వైసీపీ అధినేత జగన్ రాప్తాడు నియోజకవర్గంలో పర్యటించనున్న నేపథ్యంలో దానిపై పరిటాల సునీత వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

LEAVE A RESPONSE