Suryaa.co.in

Andhra Pradesh

ఎన్టీఆర్ ఆశయమైన పేదరికం లేని సమాజం సాధిస్తాం

– పేదలను ఆదుకునేందుకు వికాసం పేరుతో ప్రత్యేక కార్యక్రమం
– గ్రామాల అభివృద్ది కోసం పారిశ్రామికవేత్తలు ముందుకు రావాలి
– ప్రజలు – ప్రభుత్వం – ప్రైవేటు – భాగస్వామ్యంతో పేదరిక నిర్మూలన
-వైసీపీ ప్రభుత్వానికి పన్నులు పెంచడం తప్ప సంపద సృష్టించటం తెలీదు
– నిమ్మకూరులో నారా చంద్రబాబు నాయుడు

నిమ్మకూరు:- పేదరికం లేని సమాజం చూడాలన్నదే ఎన్టీఆర్ ఆశయమని…దాన్ని నిజం చేసేందుకు ఆ మహనీయుడు పుట్టిన గడ్డ నుంచే కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నట్లు టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు అన్నారు.

కృష్ణా జిల్లా నిమ్మకూరులో ఎన్టీఆర్ వర్దంతి సందర్భంగా పేదరిక నిర్మూలనపై ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రకటించారు. పేదలను ధనికులను చేయడం అనే కాన్సెప్ట్ కు శ్రీకారం చుట్టారు. ముందుగా ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులు అర్పించిన చంద్రబాబు…తరువాత అక్కడ జరిగిన సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ…ఎన్టీఆర్ సాధారణ రైతు కుటుంబంలో పుట్టి కష్టపడి ఎదిగారు. కృషి పట్టుదల, క్రమశిక్షణ ఆయన్ని గొప్ప స్ధాయికి తీసుకెళ్లాయి.

సినీరంగంలో ఎన్టీఆర్ పోషించిన పాత్రలు మరెవరూ పోషించలేరు. ఎన్టీఆర్ రాజకీయాల్లో ఉన్నది 13 ఏళ్లే అయినా రాజకీయాలకు నూతన దిశ, దశ ఇచ్చారు. పేదలకు సేవ చేయటం, వారికి అండగా ఉండటమే రాజకీయం అని నిర్వచనం ఇచ్చిన వ్యక్తి ఎన్టీఆర్. పేదరికం లేని సమాజం చూడాలన్నదే ఎన్టీఆర్ ఆశయం. ఆ మహనీయుని వర్థంతి సందర్భంగా పేదరికం లేని సమాజం కోసం పనిచేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం ఆనందంగా ఉంది.

మన దేశంలో 1991 వరకు రోడ్లు బాగుండేవి కాదు. తరువాత తెచ్చిన సంస్కరణలతో అభివృద్ది చేశాం. రోడ్లు వేశాం, కరెంట్ కోతలు తొలగించాం. కాలేజీలు పెట్టాం. వైసీపీ ప్రభుత్వానికి పన్నులు పెంచటం తప్ప సంపద సృష్టించటం తెలియదు. ఒక చేత్తో పది ఇచ్చి మరో చేత్తే వందరూపాయిలు లాగేస్తున్నారు. సంపద ద్వారా వచ్చిన డబ్బుల్ని…రెట్టింపు ఎలా చేయాలి ఆ సంపదను పేదలకు ఎలా పంచాలన్నదే నా ప్రయత్నం.

నాలెడ్జి ఎకానామీలో రాష్ట్రాన్ని ప్రపంచంతో అనుసంధానం చేసి ఈ గ్రామంలోని యువతకు అవకాశాలు కల్పిస్తాం. ఈ ఊరి నుండి సుమారు 500 మంది బయటకెళ్లి స్థిరపడ్డారు. వారిలో డాక్టర్స్ 30 మంది, వ్యాపారస్థులు 20 మంది, ఉద్యోగస్తులు 450 మంది ఉన్నారు. వీరంతా ఒక్కొక్కరూ ఒక్కో కుటుంబానికి చేయూతనిచ్చి వారిని ఆర్దికంగా పైకి తీసుకురాగలిగితే పేదరికం లేకుండా చేయవచ్చు. దీని కోసం ప్రత్యేక మైన విధానాన్ని తీసుకువస్తాం.

ఈ కార్యక్రమాన్ని షార్ట్ టర్న్, మీడియం టర్న్ , లాంగ్ టర్న్ గా తీసుకుంటాం. మీ కుటుంబంలోని సభ్యులే మీ ఆస్తి…వారి ద్వారా ఎలా ఆస్తి సంపాదించాలో ఆలోచించాలి. వాళ్ల స్కిల్ , శక్తి సామర్ధాలను పెంచి వారి ఆదాయం రెట్టింపు చేసే మార్గాలు అన్వేషించాలి. పిల్లలకు ఏం చదవాలి అనే గైడెన్స్ ఇవ్వటంతోపాటు వారికి ఆర్దికంగా తోడ్పాటు అందించాలి. అలా సేవాభావం ఉన్నవారిని ముందుకు రమ్మని పిలుపునిస్తున్నా.

డబ్బు సంపాదించటం ఎంత ముఖ్యమో దాన్ని అర్ధవంతంగా ఖర్చు చేయటం అంతే ముఖ్యం. ప్రభుత్వ, ప్రైవేట్, ప్రజలు భాగస్వామం తో ఈ కార్యక్రమం నడుస్తుంది. హైదరాబాద్ లో రూపాయి ఖర్చు లేకుండా గ్రీన్ పీల్డ్ ఎయిర్ పోర్ట్ కట్టాం. దాని ద్వారా ఇవాళ హైదరాబాద్ కి ఆదాయం వస్తోంది. ప్రతి కుటుంబానికి ఒక విజన్ తయారు చేసుకోవాలి, ఏం పని చేస్తున్నారు, ఆదాయం పెరిగేందుకు ఏం చేయాలో ఆలోచించాలి.

మీ పిల్లలతో పాటు గ్రామంలోని పిల్లల్ని చదవించండి. గ్రామాల నుంచి నేడు పారిశ్రామికవేత్తలు వస్తున్నారు. గ్రామంలో కుటుంబాలను బాగుచేసే బాధ్యత వీరు తీసుకోవాలి. ప్రభుత్వం, ప్రైవేటు, ప్రజల భాగస్వామ్యంతో పేదరికం లేని సమాజం నెలకొల్పుదామని చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. దీనికి ప్రజల సహకారం, మద్దతు కావాలని పిలుపునిచ్చారు.

LEAVE A RESPONSE