తెలంగాణలో టీఆర్ఎస్ ను తరిమికొడతాం

తెలంగాణలో టీఆర్ఎస్ ను తరిమికొడతాం

– ఈ మహోద్యమంలో ఉద్యమకారులంతా కలిసి రండి
– బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ పిలుపు
– జాతీయ నాయకుల సమక్షంలో బీజేపీలో చేరిన తీన్మార్ మల్లన్న
– బీజేపీ తాడుతో కేసీఆర్ కుటుంబాన్ని గన్ పార్క్ కు కట్టేస్తా
– కేసీఆర్ ను రాజకీయ సమాధి చేసే వరకు ఉద్యమిస్తానన్న తీన్మార్ మల్లన్న
ప్రముఖ జర్నలిస్టు తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ కుమార్ బీజేపీలో చేరారు. ఢిల్లీలోని బీజేపీ జాతీయ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, తెలంగాణ ఇంఛార్జ్ తరుణ్ చుగ్, రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్, పార్లమెంటరీ పార్టీ కార్యాలయ కార్యదర్శి కామర్సు బాలసుబ్రమణ్యం, మాజీ ఎమ్మెల్సీ డాక్టర్ రామచంద్రరావు, అధికార ప్రతినిధి రాకేశ్ రెడ్డి, రాష్ట్ర నాయకులు జె.సంగప్ప, నూనె బాలరాజ్ గౌడ్ తదితరుల సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా తరుణ్ చుగ్ మల్లన్నకు సభ్యత్వమిచ్చి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.
ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ … తెలంగాణలో ప్రశ్నించే గొంతుక తీన్మార్ మల్లన్న. ప్రజల ఆదరాభిమానాలు చూరగొన్న వ్యక్తి. అలాంటి వ్యక్తి బీజేపీలో చేరడం సంతోషంగా ఉంది. హ్రుదయపూర్వకంగా బీజేపీలోకి స్వాగతం పలుకుతున్నాం. మల్లన్న నిఖార్సయిన తెలంగాణ వాది, ఉద్యమకారుడు.. రాజకీయ స్వార్థంతో మల్లన్న బీజేపీలో చేరడం లేదు. నరేంద్ర మోదీ ప్రభుత్వం అవినీతి రహితంగా ఉంటూ పేదల కోసం పాలిస్తుంటే….తెలంగాణలో అందుకు భిన్నంగా అవినీతి, రాక్షస, కుటుంబం పాలన కొనసాగిస్తున్న కేసీఆర్ ప్రభుత్వంపై వ్యతిరేకంగా పోరాడుతున్న వ్యక్తి మల్లన్న.
మల్లన్న తన కలంతో గళమెత్తుతుంటే జీర్ణించుకోలేని సీఎం కేసీఆర్ పోలీసు కేసులతో అనేక కేసులు పెట్టి భయభ్రాంతులకు గురిచేస్తున్నారు.
ఇప్పటికే మల్లన్నపై కేసీఆర్ అనేక నాన్ బెయిలెబుల్ కేసులు పెట్టి వేధించారు. అయినా వెరవని మల్లన్న తాను ఎంచుకున్న దారిలో వెళుతూ అమరవీరుల ఆశయం కోసం పోరాడుతున్నారు. మల్లన్నపై పదేపదే కావాలని కేసీఆర్ ప్రభుత్వం కేసులు పెట్టి వేధించింది. మల్లన్నను చూసి మేం బాధపడ్డాం. మలన్నకు అండగా నిలబడ్డాం. తెలంగాణలోని దుర్మార్గమైన పాలనను అంతమొందించాలంటే అది బీజేపీతోనే సాధ్యమని తెలంగాణ ఉద్యమకారులు భావిస్తున్నారు.
విఠల్, మల్లన్న వంటి నేతలకు రాజకీయ స్వార్థం లేదు. పోరాడే తెలంగాణ ఉద్యమకారులు, పోరాట పటిమ ఉన్న నేతలు. వారి లక్ష్యాలకు అనుగుణంగా బీజేపీ ఉద్యమిస్తుంది. తెలంగాణలో టీఆర్ఎస్ కుటుంబ, అవినీతి, నియంత ప్రభుత్వాన్ని తరిమితరిమి కొడతాం. కేసీఆర్ రాక్షస పాలనకు చరమగీతం పాడతాం. తెలంగాణ ఉద్యమకారులకు వేదిక బీజేపీ. బీజేపీ చేపడుతున్న ఈ మహోద్యమానికి మద్దతు పలకాలని రాష్ట్రంలోని తెలంగాణ ఉద్యమకారులను కోరుతున్నా..
తరుణ్ చుగ్ మాట్లాడుతూ…. బీజేపీలోకి జర్నలిస్టు తీన్మార్ మల్లన్న రాకను స్వాగతిస్తున్నాం. కేసీఆర్ ఆధ్వర్యంలోని టీఆర్ఎస్ ప్రభుత్వ అవినీతి, అరాచకాలు కుటుంబ పాలనకు వ్యతిరేకంగా కలంతో కవాతు చేస్తున్న వ్యక్తి తీన్మార్ మల్లన్న. లక్షలాది మంది యువత తీన్మార్ మల్లన్న యూ ట్యూబ్ ఛానల్ ను ఫాలో అవుతున్నారు. ఎమ్మెల్సీగా స్వతంత్ర్యంగా పోటీ చేస్తే 1.40 లక్షల ఓట్లకుపైగా సాధించి రెండో స్థానంలో నిలిచారు. పెద్ద ఎత్తున యువత ఓట్లేశారు.
కలంతో గళం ఎత్తితే సహించలేని కేసీఆర్ సర్కార్ మల్లన్నపై అనేక కేసులు పెట్టి జైలుకు పంపింది. 9 సార్లు బెయిల్ వచ్చినా ఆయన బయటకు రాకుండా పదేపదే కేసులు పెట్టి జైలుకు పంపింది. మల్లన్నను ఓడించేందుకు వందల కోట్లు ఖర్చు చేసినా గ్రాడ్యుయేట్ యువత 1.40 లక్షల ఓట్లు వేసి రెండో స్థానంలో నిలిపారు. మల్లన్నను బీజేపీలోకి రావడంతో కేసీఆర్ సర్కార్ అవలంబిస్తున్న నియంత విధానాలు, దేశ ప్రజలకు మరోసారి చూపినట్లయింది. తెలంగాణ ప్రజలు కష్టాల్లో ఉన్నారు. కేసీఆర్ రాక్షస పాలనను నిరంతరం ప్రశ్నిస్తున్న వ్యక్తి తీన్మార్ మల్లన్న. కేసీఆర్ నియంత, అవినీతి, కుటుంబ పాలనను అంతమొందించేందుకు బండి సంజయ్ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్రతో కేసీఆర్ సర్కార్ పీఠం కదులుతోంది.
ధర్మపురి అరవింద్ మాట్లాడుతూ…. తీన్మార్ మల్లన్న తెలంగాణలో పాపులర్ వ్యక్తి. ఇండిపెండెంట్ గా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా పోటీ చేస్తే 1.40 లక్షల ఓట్లకుపైగా సాధించి రెండో స్థానంలో నిలిచారు. మల్లన్నను ఓడించడానికి 100 కోట్లకుపైగా కేసీఆర్ ఖర్చు చేశారు. కేసీఆర్ నియంత, అవినీతి పాలనపై పోరాడుతున్న మల్లన్న బీజేపీలో చేరడాన్ని మనస్పూర్తిగా స్వాగతిస్తున్నాం.
తీన్మార్ మల్లన్న మాట్లాడుతూ… నేను జర్నలిస్టు కుటుంబం నుండి వచ్చిన. తీన్మార్ మల్లన్న అనే పేరును ప్రజలు పెట్టుకున్న పేరు. బీజేపీ ఈరోజు నాకు ఈ సభ్యత్వ తాడును ఇచ్చింది. ఈ సభ్యత్వ తాడుతో రాష్ట్రాన్ని దోచుకుంటున్న కేసీఆర్ కుటుంబాన్ని అమరవీరుల స్తూపానికి కట్టేయాలని బీజేపీలో చేరుతున్న. నా జీవితంలో మూడే మూడు లక్ష్యాలున్నయ్. అమరవీరుల తల్లిదండ్రులను పిలిచి ఈరగోలలతో కేసీఆర్ కుటుంబం వీపు పగలగొట్టించడమే నా లక్ష్యం.
సీఎం కేసీఆర్ ప్రపంచంలోనే అత్యంత మోసకారి. తెలంగాణలో మీడియాను 100 కి.మీలలోతున పాతిపెడతానని చెప్పిన అహంభావి కేసీఆర్. అంతకంటే లోతున నిన్ను పాతిపెట్టే రోజులు వస్తాయని ప్రశ్నించిన తొలిగొంతు నాది. నాటి నుండి ఆ దిశగా పనిచేస్తున్న. అందుకే బీజేపీ ఇస్తున్న ఈ తాడుతో అమరవీరుల స్తూపానికి కట్టేసి కేసీఆర్ కుటుంబం వీపు పగలకొట్టిస్తా.
నాపై కేసీఆర్ 38 కేసులు పెట్టించిండు. కేసీఆర్…. ఏం సాధించావ్? నాపై కేసు పెడితే పోలీసోళ్లే బయటకు వెళ్లి కన్నీళ్లు పెట్టుకున్నరు. జడ్జీలు మథనపడ్డరు. కానీ చేతిలో అధికారం ఉందనే అహంకారంతో కేసులు పెట్టిండు. హుజూరాబాధ్ లో ఏమైంది? నువ్వు ఎక్కడ స్టార్ట్ అయ్యినవో..అక్కడికే తీసుకొస్తా. నువ్వు 5 ఎకరాలతో రాజకీయ జీవితాన్ని ప్రారంభించినవ్. మళ్లీ అక్కడికే తీసుకొచ్చే బాధ్యత మాది… ఈ విషయంలో బీజేపీ ద్వారా ప్రజల్లోకి ఉధ్రుతంగా తీసుకెళ్లే అవకాశం దక్కింది. కేసీఆర్ బరాబరా బాతాల పోశెట్టే. కేసీఆర్… తీన్మార్ మల్లన్నపై కేసులు పెడుతున్నా బాధపడత లేం. నువ్వు జర్నలిజం కుతికమీద కత్తిపెట్టినవ్. ఉద్యమకారుల మెడమీద కత్తి పెట్టినవ్. ఇప్పుడు వారంతా ఒక్కటవుతున్నరు. కేసీఆర్…. నీకు రాజకీయ సమాధి కట్టడం ఖాయం.

Leave a Reply