Suryaa.co.in

Andhra Pradesh

పులిపంజా దెబ్బ ఎలా ఉంటుందో రుచి చూపిస్తాం

– నాలుగేళ్లలో మేము తిరిగి అధికారంలోకి వస్తాం
– అప్పుడు మేం ఆపినా కార్యకర్తలు ఆగే పరిస్థితి ఉండదు
– కక్ష తీర్చుకోవడంలో కూటమి ప్రభుత్వం కొత్త పద్ధతులు
– అరెస్టై గుంటూరు జైల్లో ఉన్న మాజీ ఎంపీ నందిగం సురేష్‌ను పరామర్శించిన వైయస్సార్‌సీపీ స్టేట్‌ కోఆర్డినేటర్‌ సజ్జల రామకృష్ణారెడ్డి

గుంటూరు: మంచి చేస్తారని చంద్రబాబుకి ప్రజలు అధికారం ఇస్తే, వైయస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు, సానుభూతిపరులపై కక్ష తీర్చుకోవడంతోనే ఆయన పని చేస్తున్నారని వైయస్సార్‌సీపీ స్టేట్‌ కోఆర్డినేటర్‌ సజ్జల రామకృష్ణారెడ్డి ఆక్షేపించారు.

చంద్రబాబు వ్యవహారం చూస్తుంటే ఎలా వేధించాలనేది తమకు నేర్పిస్తున్నట్లుగా ఉందన్న ఆయన, ఇలా అక్రమ కేసులతో భయభ్రాంతులకు గురి చేయాలని శిక్షణ ఇస్తున్నారా? అని ప్రశ్నించారు. చంద్రబాబులా తమ పార్టీకి గుంటనక్క తెలివితేటలు లేవని, నేరుగా పులిపంజా దెబ్బ రుచి చూపిస్తామని గుంటూరు జైలు వద్ద మీడియాతో మాట్లాడిన శ్రీ సజ్జల రామకృష్ణారెడ్డి హెచ్చరించారు.

మాజీ ఎంపీ నందిగం సురేష్‌ అక్రమ కేసుల్లో అరెస్ట్‌ అయి దాదాపు నాలుగు నెలలవుతోంది. మాజీ ఎంపీ అయినా కూడా ఆయన పట్ల పోలీసులు వ్యవహరిస్తున్న తీరు సరిగా లేదు. కనీసం తాగడానికి వాటర్‌ బాటిల్‌ తెచ్చుకోవడానికే అనుమతి నిరాకరించారంటే పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో అర్థమవుతుంది. దీని గురించి మేం ప్రశ్నిస్తే మరింత రెచ్చిపోతున్నారు. సీఎం కొడుకు, మంత్రి నారా లోకేష్‌ నేరుగా ఫోన్‌ చేసి ఆదేశాలిచ్చే పరిస్థితి. ఆయన ఆదేశాలు పాటించకపోతే ఏమవుతుందో అని అధికారులు భయపడుతున్నారు.

మూడు నాలుగేళ్ల క్రితం జరిగిన సంఘటనలకు సంబంధించి ఎలాంటి ఆధారాలు లేకున్నా, అప్పటికప్పుడు కేసులు బనాయిస్తున్నారు. నందిగం సురేష్‌కు బెయిల్‌ రాకుండా చూస్తున్నారు. అందుకే వాటిని తప్పుడు కేసులు అనాల్సి వస్తుంది.

ఇప్పుడు సీఎం చంద్రబాబు వ్యవహరిస్తున్న విధంగా ఆనాడు వైయస్‌ జగన్‌ కూడా వ్యవహరించి ఉంటే పరిస్థితి మరోలా ఉండేది. అధికారంలో ఉన్నామని ప్రత్యర్థులపై తప్పుడు కేసులు పెట్టలేదు. మాపై ఉన్న కేసులను తీసేయించాలని ప్రయత్నించలేదు. చట్టం తన పని తాను చేసుకుని పోయేలా ఎక్కడా కలుగజేసుకోలేదు.

కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి పాత కేసులు తిరగదోడటంతో పాటు, ప్రత్యర్థులపై కొత్త కేసులు పెట్టి వేధిస్తున్నారు. న్యాయంగా ధర్మంగా వ్యవహరిస్తారని మేం ఏమరపాటుగా ఉన్నాం. ఇలా అక్రమంగా జైల్లో పెడతారని ఊహించలేదు.కింది కోర్టు నుంచి సుప్రీం కోర్టు వరకు న్యాయస్థానాల్లో ఉన్న లొసుగులను ఆసరాగా చేసుకుని రెచ్చిపోతున్నారు.

వైయస్సార్‌సీపీ ఉనికి లేకుండా చేయాలని కుట్ర చేస్తున్నారు. రెండు నెలలుగా సోషల్‌ మీడియా కేసులతో కార్యకర్తలను తీవ్రంగా వేధిస్తున్నారు. ఇది మామూలు కక్ష సాధింపు కాదు. శాశ్వతంగా లేకుండా చేయాలనేది వారి అజెండాగా కనిపిస్తోంది. కేసులు మీద కేసులు పెడుతున్నారు. పీటీ వారెంట్‌లతో జైళ్లకు తిప్పుతున్నారు.

ముగ్గురు పిల్లల తల్లి అని కూడా చూడకుండా పెద్దిరెడ్డి సుధారాణిని, ఆమె భర్తను జైల్లో పెట్టారు. జగన్‌ మీద అభిమానంతో ఎప్పుడో రెండేళ్ల కిందట పెట్టిన పోస్టును చూపించి అరెస్టు చేశారు. గుంటూరులో రెండు వారాల క్రితం వైఎస్సార్సీపీ కార్యకర్త ప్రేమ్‌ను అర్థరాత్రి అరెస్ట్‌ చేశారు. ఇంట్లో ఆడవారిని భయపెట్టి.. వచ్చింది పోలీసులో.. రౌడీలో అర్థం కాని పరిస్థితిలో నంబర్‌ లేని కారులో తీసుకెళ్లిపోయారు. ఎప్పుడో 30 ఏళ్ల క్రితం నక్సలైట్ల విషయంలో ఇలాంటి అరెస్టులను చూశాం.

కూటమి నాయకులు ప్రవర్తిస్తున్న తీరు చూస్తుంటే వేధింపులు ఎలా చేయాలో మాకు నేర్పిస్తున్నట్టుగా ఉంది. భవిష్యత్తులో అధికారంలోకి వస్తే మేం ఎలా వ్యవహరించాలో రాసిపెట్టుకోమని మాకు సూచించినట్టుగా అర్ధమవుతోంది.

నాడు వైఎస్‌ జగన్‌ కూడా చంద్రబాబులా అనుకుని ఉంటే మేం అధికారంలోకి వచ్చిన మూడు నెలలకే చంద్రబాబు జైల్లో ఉండేవాడు. మేం అలా అనుకోలేదు కాబట్టే ఆయన కేసుల్లో సుదీర్ఘ దర్యాప్తు చేసి పూర్తి ఆధారాలతో అరెస్ట్‌ చేశాం.

చంద్రబాబు గతంలో సీఎంగా పనిచేసినప్పటి కంటే మరింత దిగజారి పోయారు. ప్రజలు అధికారం ఇచ్చింది ఏ విధంగా దండుకోవాలి? మన సంపద ఎలా పెంచుకోవాలి? మన వారికి ఆ సంపద ఎలా పంచాలి? ప్రత్యర్థులను ఎలా వేధించాలి? వారి ప్రయోజనాల కోసం ఎలా పని చేయాలి? అన్న ధోరణిలోనే చంద్రబాబు పని చేస్తున్న విషయం ఈ ఆరు నెలల పాలనతో ప్రజలకు అర్థమైంది.
మేం మౌనంగా ఉన్నామంటే చేతకాక కాదని గుర్తు పెట్టుకోవాలి. డైవర్షన్‌ పాలిటిక్స్‌ ఎల్లకాలం నడవవు. మేం అధికారంలోకి వచ్చాక ఇవన్నీ మేం చేయలేమా? మేం వద్దన్నా మా వాళ్లు ఆగుతారా? ఎక్కడికక్కడ ఇదే పని చేయడం మొదలుపెడితే వారి పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవాలి.

వైయస్సార్‌సీపీ దగ్గర వారి లాగా గుంటనక్క తెలివితేటలు ప్రదర్శించడం ఉండదు. మేం అధికారంలోకి వచ్చాక పులి పంజా దెబ్బ రుచి చూపిస్తాం.
దెబ్బ కొడుతున్నావంటే, ఎలాగైనా కొట్టొచ్చని చూపిస్తున్నావంటే.. ఎలాగైనా కొట్టడంలో నీ కన్నా బలంగా కొట్టడంలో నీకన్నా బలంగా కొట్టగలమని నిరూపిస్తాం.. ఆ సత్తా వైఎస్సార్సీపీకి ఉంది. వైయస్సార్సీపీ అభిమానులు కొట్టే దెబ్బ చాలా భయంకరంగా ఉంటుంది. ఇప్పటికైనా ప్రాప్తకాలజ్ఞతతో ఆలోచించి చంద్రబాబు, ఆయన అనుచరులు ఆలోచిస్తే ఆయనకు, వారి పార్టీకి, రాష్ట్రానికి, మంచిదని విజ్ఞప్తి చేస్తున్నాం.

ఆరు నెలల్లోనే ప్రభుత్వం మీద ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత మొదలైంది. కూటమి పార్టీల్లోనే తన్నుకుంటున్నారు. ఇంకో ఆరు నెలలాగితే రోడ్డున పడతారు. ఆ పై రెండేళ్లాగితే ఎన్నికలొస్తాయి. ఇదంతా దృష్టిలో ఉంచుకుని విజ్ఞతతో ఆలోచించమని చంద్రబాబుకు, కూటమి నాయకులకు సజ్జల రామకృష్ణారెడ్డి సూచించారు. మాజీ మంత్రులు అంబటి రాంబాబు, మేరుగ నాగార్జునతో పాటు, పలువురు మాజీ ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు, నాయకులు ఆయన వెంట ఉన్నారు.

 

LEAVE A RESPONSE