మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నాయకుడు వల్లభనేని వంశీ అరెస్టయి ప్రస్తుతం ఆయన విజయవాడలోని సబ్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. టీడీపీ కార్యాలయంపై జరిగిన దాడి కేసులో ఆ పార్టీ కార్యకర్త సత్యవర్థన్ను కిడ్నాప్ చేసి.. బెదిరించి.. ఆయనతో కేసు వెనక్కి తీసుకునేలా వత్తిడి చేశారన్న అభియోగాలతో పోలీసులు వంశీని అరెస్టు చేశారు. అయితే.. ఏదో ఒకరకంగా.. బెయిల్పై బయటకు తీసుకువచ్చేందుకు వైసీపీ నేతలు ప్రయత్నిస్తున్నారు.
కానీ.. ఈ ప్రయత్నాలు జరుగుతుండగానే విజయవాడ పోలీసులు, గన్నవరం పోలీసులు సహా పలు ప్రాంతాలకు చెందిన స్టేషన్లలో మరిన్ని కేసులు నమోదవుతున్నాయి. తాజాగా గన్నవరం పోలీసులకు అందిన ఫిర్యాదు మేరకు సోషల్ మీడియాలో చంద్రబాబు, నారా లోకేష్లపై అసభ్య పదాలతో దూషించిన వీడియోపై కేసు నమోదు చేశారు. ఇప్పటికే ఇలాంటి కేసుల్లో చాలా మంది వైసీపీ నాయకులు జైళ్లలో ఉన్నారు. దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కూడా.. ఇలాంటి కేసునే ఎదుర్కొంటున్నారు.
ఇప్పుడు వంశీపైనా గతంలో నమోదైన కేసులతో పాటు.. తాజాగా మరికొన్ని కేసులు కూడా నమోదవుతున్నాయి. గన్నవరంలో ఇసుక దోపిడీపై ఇప్పటికే ఆయనపై రెండు కేసులు ఉన్నాయి. బెల్ట్షాపులను ప్రోత్సహించారన్న ఫిర్యాదులు కూడా గతంలోనే నమోదయ్యాయి. అదేవిధంగా గన్నవరంలో తమ ఆస్తులను వంశీ అనుచరులు లాక్కున్నారని.. వాటిని తిరిగి అప్పగించాలని.. తాజాగా టీడీపీ నిర్వహించిన ప్రజాదర్బార్లో ఆ ప్రాంత బాధితులు ఫిర్యాదు చేశారు.
ఈ ఫిర్యాదులను వెంటనే టీడీపీ నాయకులు పోలీసులకు చేరవేసి కేసు పెట్టాలని కోరారు. ఇలా.. వంశీపై లెక్కకు మిక్కిలిగానే కేసులు నమోదయ్యే అవకాశం కనిపిస్తోంది. ఇదే జరిగితే.. వంశీ ఒక కేసులో బయటకు వచ్చినా.. మరో కేసు వెంటనే ఆయనను లోపలకు తీసుకువెళ్లే అవకాశం కనిపిస్తోందని వైసీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు.
గతంలో టీడీపీ నేత, ప్రస్తుత ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ను ఇలానే 12 కేసుల్లో 64 రోజులకుపైగా జైల్లో ఉంచిన విషయాన్ని వారే గుర్తు చేస్తుండడం గమనార్హం. దీనిని బట్టి వంశీ ఇప్పట్లో బయటకు వచ్చే అవకాశం లేదని అంటున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.