తెలంగాణ రాష్ట్రం వచ్చాక రాజకీయాలు దిగజారాయి

బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయిన తర్వాత రాష్ట్రంలో రాజకీయాలు పూర్తిగా దిగజారిపోయాయని హుజూరాబాద్ బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఆందోళన వ్యక్తం చేశారు. అప్పట్లో మాజీ మంత్రి రామస్వామి బుల్లెట్ పైనే అసెంబ్లీకి వచ్చేటోడని ఆయన గుర్తు చేసుకున్నారు.గౌలిగూడలో శ్రీ విఠలేశ్వర బాల భక్త సమాజం ఆధ్వర్యంలో మాజీ మంత్రి రామస్వామి 85వ జయంతి వేడుకల్లో మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామితో కలసి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రామస్వామి విగ్రహాన్ని హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ రామస్వామి ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఈటల రాజేందర్ మాట్లాడుతూ రామస్వామి గొప్ప మహనీయుడని, ఆయన ప్రజలకు అందించిన సేవలు ఎంతో గొప్పవని కొనియాడారు. రామస్వామి, నాగిని నరసింహారెడ్డి బుల్లెట్ పైన వచ్చే వాళ్లు అసెంబ్లీకి వచ్చేటోళ్లని, మరికొందరైతే ఆటోలలో వచ్చేవాళ్లని గుర్తు చేసుకున్నారు. ఇప్పటికీ గుమ్మడి నర్సయ్య పూరి ఇంట్లో ఉంటాడని వివరించారు. అయితే నీతి నిజాయితీ విలువలతో కూడుకున్న రాజకీయ నేతలను కేసీఆర్ ఇబ్బందులు పెడుతున్నడని ఈటల రాజేందర్ ఆరోపించారు.
ఒక్క హుజురాబాద్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ 600 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిందని, దేశంలోనే ఇంత డబ్బు ఖర్చు పెట్టిన ఎలక్షన్ ఎక్కడా లేదని ఈటల రాజేందర్ పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ డబ్బు సంచులకు, మద్యానికి హుజురాబాద్ ప్రజలు లొంగకుండా కేసీఆర్ చెంప ఛెళ్లు మనిపించారని ఈటల అన్నారు. హైదరాబాద్ ప్రజలు ధర్మం, న్యాయం, వైపు ఉండి నీతి నిజాయితీ రాజకీయాలు చేసే నేతలను ఎన్నుకోవాలని ఆయన కోరారు.

Leave a Reply