– క్రీస్తు యూదు రాజే కదా?
(పవన్ సంతోష్ సూరంపూడి)
ఏసు క్రీస్తు వచ్చేనాటికి యూదు మతం వ్యాప్తిలో ఉంది. క్రీస్తు కూడా పుట్టుకతో యూదు మతస్తుడే.
ఆయనను ప్రశ్నలో అన్నట్టుగానే యూదుల రాజు అని కొందరు తూర్పుదేశాల జ్ఞానులు మొట్టమొదటిసారి ప్రస్తావించారని చదివాం. ఆయన కేంద్రంగా ఏర్పాటైన క్రైస్తవ మతంలో నాలుగింట మూడు వంతులు యూదు మతపు విశ్వాసాలు, పురాణాలు కేంద్రంగా ఉంటాయి. ఓల్డ్ టెస్ట్మెంట్ అంతా యూదు మతస్తులకూ పవిత్ర గ్రంథమే. అలాంటప్పుడు యూదులు క్రీస్తును ఎందుకు పూర్తిగా అంగీకరించరన్నది చూద్దాం.
ఏకేశ్వరోపాసన (మోనోథీయిజం) లో అత్యంత ప్రాచీనమైన మతం యూదు మతం అని భావిస్తారు. ఒకడే దేవుడు, ఆయన తప్ప వేరే దైవం లేదు అన్నది అత్యంత తీవ్రంగా నమ్మడమే యూదు మతంలో కేంద్ర స్థానం. క్రైస్తవంలో క్రీస్తును కూడా ఆరాధిస్తారు కదా. అలాగే క్రైస్తవంలో ట్రినిటీ అని ఒక కాన్సెప్ట్ ఉంది. అంటే తండ్రి, కుమారుడు, పవిత్రాత్మ – ఈ మూడింటిలోనూ ఒక్కటిగా ఉన్నాడని దేవుడి గురించి చెప్తారు ఈ ట్రినిటీలో.
ఈ ట్రినిటీ అన్న కాన్సెప్ట్ కొత్త నిబంధన (న్యూ టెస్ట్మెంట్) లో కొంతమేరకు ఉంది. క్రైస్తవం మతంగా రూపొందే క్రమంలో ఏసుక్రీస్తుకు ఏ స్థానం ఇవ్వాలన్న ప్రశ్న ఒకవైపు, “ఇజ్రాయెల్ విను, దేవుడైన మన ప్రభువు, ఆ దేవుడు ఒక్కడే” అని ఘంటాపథంగా చెప్తున్న యూదు ప్రార్థన మరోవైపు లాగుతుండగా ఈ భావన బలపడింది.
ఏసుక్రీస్తును కానీ, ఆమాటకి వస్తే అప్పటిదాకా వచ్చిన, ఇక భవిష్యత్తులో రాబోయే మరి ఏ ప్రవక్తను కానీ, యూదుమతం దేవునిలో భాగం అనో, దేవునికి మనిషికి మధ్యవర్తి (మీడియేటర్) అనో, ఇటువంటి ట్రినిటీలో భాగం అనో ఒప్పుకోవడానికి సిద్ధంగా లేదు. ఇది చాలా మౌలికమైన సమస్య.
ప్రపంచానికి ఒక రక్షకుడు అయిన యూదు మెస్సయ్య వస్తాడని యూదుల్లో ఒక కాన్సెప్ట్ ఉంది. ఐతే, ఈ యూదు మెస్సయ్య ఏసుక్రీస్తు అని యూదులు అంగీకరించలేదు. ఎందుకంటే – ప్రవక్తల భవిష్య వాణి ప్రకారం మెస్సయ్య రాకడ జరిగినప్పుడు, ఆ మెస్సయ్య యుగంలో మూడవ ఆలయం (రెండు ఆలయాలు వచ్చాయి యూదులకు, భవిష్యత్తులో మూడవది) నిర్మాణం జరగాలి.యూదులందరినీ ఇజ్రాయెల్కు తీసుకురావాలి, ప్రపంచానికి శాంతి తేవాలి. ఇజ్రాయెల్ దేవుని కింద ప్రపంచం మొత్తాన్ని ఏకీకృతం చేయాలి.
ఇవేవీ ఏసుక్రీస్తు చేయలేదని, కాబట్టి భవిష్యవాణులు చెప్పిన మెస్సయ్య ఇతను కాదని తేల్చింది. పోనీ, ఏసుక్రీస్తు యూదు ప్రవక్త అని కూడా అంగీకరించలేదు. దానికి ఏమన్నదంటే, మలాచీ అని క్రీస్తుకు 500 సంవత్సరాల క్రితం వచ్చిన ఓ ప్రవక్తయే యూదుల్లో ఇక చివరి ప్రవక్త అని, ఆయన తర్వాత మరెవరూ రారని ఉందిట. అలాంటప్పుడు ఏసు ప్రవక్త ఎలా అవుతాడని చెప్పి తిరస్కరించింది.
కేవలం క్రీస్తును అంగీకరించడం, తిరస్కరించడం మాత్రమే కాక విశ్వాసాలు, పద్ధతుల్లో కూడా రెండు మతాలు చాలా వేరుపడ్డాయి.
చారిత్రకంగా క్రైస్తవ, యూదు మతాలు ఒకదానితో ఒకటి సంఘర్షించుకున్న చరిత్ర ఉంది. తొలినాళ్లలో యూదు మతం క్రైస్తవంపై దాడులు చేస్తే, క్రైస్తవ మతానికి రాజపోషణ దొరికిన నాటి నుంచి (క్రీ.శ.3 శతాబ్ది) యూదు మతంపై క్రైస్తవ భూముల్లో దాడులు జరిగాయి. pogrom పేరిట సామూహిక దాడులు, బలవంతపు డ్రెస్ కోడ్, క్రైస్తవులను యూదులు వివాహం చేసుకోకూడదు, వాళ్ళతో కలసి భోజనం చేయకూడదు, ఈస్టర్ సమయంలో బయటకు రాకూడదు వగైరా నియమాలు, ఇలా ఎన్నో విధాలా దాడులకు యూదులు గురయ్యారు.
1182లో యూదులను ఫ్రాన్స్ నుంచి బహిష్కరించడాన్ని చిత్రీకరించిన బొమ్మ. Photo తీసినవారు User:Sodabottle
19వ శతాబ్దిలో చర్చ్ ఆఫ్ ఇంగ్లండ్ లో యూదు మతం, క్రైస్తవం ఒకటే మెసేయానిక్ మత భావనకు రెండు వ్యక్తికరణలు అన్న దృక్పథం ప్రచారం చేశారు. యూదులతో సహజీవనం, వారి పట్ల సహనం ఒకపక్క కొద్దిమేరకు ఈ ప్రయత్నాలు బోధిస్తూ ఉంటే 1930ల చివరకు వచ్చే సరికి జర్మన్ జాత్యహంకారంతో యూదులను దారుణంగా చంపిన హాలోకాస్ట్ జరిగింది.
ఇంతటి ఘోరం జరిగాక క్రైస్తవ-యూదు సుహృద్భావం కోసం ఎన్నో రకాల అంతర్జాతీయ స్థాయి ప్రయత్నాలు జరిగాయి. వాటిలో పోప్ జాన్ పాల్ II చేసిన ప్రకటనలు కూడా ఉన్నాయి. అట్లానే యూదు మతాధికారులు కూడా 2015లో రెండు మతాల మధ్య భేదాల కన్నా సామ్యాలే ఎక్కువ ఉన్నాయి అని ఒక ప్రకటనపై సంతకం చేశారు.
ఇక, ఇస్లాం-యూదు మతాల విషయానికి వద్దాం. ఇస్లాం యూదు మతం నుంచి ఎంతో మత, సైద్ధాంతిక అంశాలు తీసుకుంది. ఇస్లాం యూదు మత ప్రవక్త మోజెస్ ను ప్రవక్త గానూ, దైవ దూతగానూ గౌరవించింది. ఆయన జీవిత గాథ ఖురాన్ లో సవివరంగా ఉంటుంది.
యూదు మత చరిత్రను ఇస్లాం తన మత చరిత్రలోకి తీసుకుంది. యూదు మతం ఎంత తీవ్ర ఏకేశ్వరోపాసక మతమో ఇస్లాం కూడా అంతే. ఒక్కడే దేవుడు అని మరి ఎవ్వరికీ ఏ విధంగానూ ఆ స్థానం ఇవ్వరాదని పట్టుదలతో ఉండడం రెంటిలోనూ సమానమే. ఇంకా మరెన్నో సిద్దాంతాలు, పద్ధతులు రెంటిలోనూ సమానమే. ఇస్లాం కూడా తిరిగి యూదు మత చట్టాలపై తన ప్రభావం చూపింది.
ఇలాంటి సుహృద్భావం మత సిద్ధాంతాల్లో ఉండగా రాజకీయంగానూ అది కొంతమేరకు ప్రతిఫలించింది. ఇస్లామిక్ పరిపాలనలో యూదులు రెండవ స్థాయి పౌరులే కానీ, వారికి తగినంత రక్షణ ఉండేది. ఈ కారణంగా మధ్యయుగాల్లో ఐరోపాలో క్రైస్తవ భూముల్లో అణచివేత ఎదుర్కొన్నప్పుడు యూదులు ఇస్లామిక్ రాజ్యాల్లోకే వచ్చి తలదాచుకున్నారు కూడా.
పైగా యూదులు ఇస్లామిక్ సామ్రాజ్యంలో ముఖ్య పదవులు కూడా చేపట్టారు. యూదు మతానికి ఒక స్వర్ణయుగం అని చెప్పే కాలం కూడా ఇస్లామిక్ పరిపాలనలోనే జరిగింది. అయితే ఇదంతా 20 శతాబ్దంలో మారిపోయింది.
వేల ఏళ్ల క్రితం యూదులు నివసించిన, మతం పుట్టిన ఇజ్రాయెల్ యూదులకే ఇవ్వాలన్న వాదన, అదొక ప్రామిస్డ్ ల్యాండ్ అన్న ఉద్యమం మొదలైంది. దీని పేరు జియానిస్ట్ ఉద్యమం.
ఇది 19వ శతాబ్దంలో ప్రారంభమైనా, 1945లో రెండవ ప్రపంచ యుద్ధం, హోలోకాస్ట్ ముగిసిన తర్వాత పాశ్చాత్య ప్రపంచంలో యూదులకు ఒక దేశం ఉండాలి అన్న భావన బలపడింది. అప్పటికే అక్కడ అరబ్బు జాతీయులైన ముస్లింలు ఉన్నారు. జియానిస్ట్ ఉద్యమం కారణంగానూ, యూదుల ఊచకోత వల్లనూ దఫదఫాలుగా అక్కడికి యూదులు తరలివస్తున్నారు.
పాశ్చాత్య దేశాలు బ్రిటన్ వలస పాలనలో ఉన్న ఈ భూభాగాన్ని మూడుగా విభజించి కొంత భాగాన్ని ఇజ్రాయెల్ చేసేలా ఐక్యరాజ్య సమితిలో ఒక తీర్మానం చేశాయి. వీటన్నిటి నడుమ 1947-49 మధ్య జరిగిన అరబ్-ఇజ్రాయెల్ యుద్ధంలో పాలస్తీనియన్లు, అరబ్బులపై ఇజ్రాయెలీలు విజయం సాధించారు.
ఆపైన జరిగింది పాలస్తీనా సంక్షోభం పేరిట ఒక సంక్లిష్టమైన జాతి వివాదాల చరిత్ర. పాలస్తీనా ఒక జాతి విద్వేషాల పరీక్షనాళికగా నిలుస్తూండగా, యూదులు 12 శతాబ్దాలుగా సుభద్రంగా ఉన్న ముస్లిం దేశాలలో అణచివేసి, దాడులు చేశారు. ఆ దేశాల నుంచి ఇజ్రాయెల్, ఫ్రాన్స్, అమెరికాలకు తరలిపోయారు.
ఈ యుద్ధాల వల్ల, అంతకుముందు ఉన్న ఇస్లాం-యూదు సుహృద్భావం పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. ఈనాటికీ ఈ వివాదం రావణకాష్టంలా రగులుతూనే ఉంది. మత గ్రంథాల్లో ఉన్న సౌమనస్యం, చరిత్రలో సాధ్యమైన సౌభ్రాతృత్వం అంతా ఒక అర్థశతాబ్ది కాలంలో ఈ వివాదం వల్ల ఆగర్భశత్రుత్వమేమో అన్నట్టు తయారైంది.