– కాళేశ్వరం అవినీతిలో వాటా ముట్టజెప్పినందుకా?
– బీజేపీ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి డా. ఎస్. ప్రకాశ్ రెడ్డి
హైదరాబాద్: 80 వేల పుస్తకాలు చదివిన జ్ఞానంతో మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, నీటిపారుదల శాఖ అధికారులు, సాగునీటిరంగ నిపుణులు, ఇంజనీర్లను కాదని, తాను సొంతంగా డిజైన్ గీసి కట్టిన కాళేశ్వరం పెద్ద లోపాల పుట్ట అని నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ ఎన్డీఎస్ఏ నివేదిక స్పష్టం చేస్తోంది.
మేడిగడ్డ ఏడో బ్లాక్ పూర్తిగా తొలగించాల్సిందేనని ఎన్డీఎస్ఏ నివేదిక స్పష్టం చేస్తోంది. మేడిగడ్డతోపాటు సుందిళ్ల, అన్నారం బ్యారేజీల్లో నాణ్యతారాహిత్యం, నిర్మాణ లోపాలు పెద్దఎత్తున ఉన్నట్టు ఈ నివేదికలో పేర్కొన్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టు ప్రపంచంలోనే అతిపెద్ద కుంభకోణం. దీనిపేరు మీద అధిక వడ్డీలకు అప్పులు తెచ్చి మరీ కేసీఆర్ కుటుంబం వేల కోట్ల రూపాయలు కొల్లగొట్టింది.
ఇన్నాళ్లూ రేవంత్ ప్రభుత్వం కేసీఆర్ కుటుంబంపై చర్యలు తీసుకోవడానికి ఎందుకు వెనకాడుతోంది? బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య ఉన్న లోపాయికారీ ఒప్పందం వల్లనా… లేక కాళేశ్వరం అవినీతిలో వాటా ప్రస్తుత ప్రభుత్వ పెద్దలకు ముట్టజెప్పినందుకా.. అనేది స్పష్టం చేయాలి.
లక్ష కోట్ల రూపాయల కుంభకోణంలోని అన్ని వివరాలు బయటపడి, ఈ ప్రాజెక్టులో ఎవరెవరికి ఎంత ముట్టింది, ఎంత అవినీతి జరిగింది, వంటి విషయాలు వెలుగులోకి రావాలంటే సీబీఐ దర్యాప్తు చేపట్టాలి.
రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే సీబీఐ దర్యాప్తు కోరాలి. లేకుంటే అవినీతి నుంచి కేసీఆర్ ను, ఆయన కుటుంబాన్ని రక్షిస్తున్నారని భావించాల్సి ఉంటుంది.