Suryaa.co.in

Andhra Pradesh

నారా లోకేశ్ ను కలిసిన వైసీపీ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం

-వైసీపీలో పెరుగుతున్న అసంతృప్తుల సంఖ్య
-సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలంకు టికెట్ నిరాకరణ
-తిరుపతి ఎంపీ సీటు ఇస్తామన్న వైసీపీ అధిష్ఠానం
-మంత్రి పెద్దిరెడ్డిపై విమర్శలు చేసి అజ్ఞాతంలోకి వెళ్లిన ఆదిమూలం
-తాజాగా కుమారుడితో కలిసి హైదరాబాదులో టీడీపీ నాయకులు నారా లోకేష్ ని కలిసిన వైనం
(శివ శంకర్. చలువాది)

ఏపీ రాజకీయాల్లో నేడు ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. వైసీపీ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం హైదరాబాదులో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ను కలిశారు. టీడీపీలో చేరే అంశంపై లోకేశ్ తో ఆయన చర్చిస్తున్నారు. ఈ సమావేశానికి ఆదిమూలం తన కుమారుడితో కలిసి వచ్చారు.

అధికార వైసీపీలో అసంతృప్తుల సంఖ్య నానాటికీ పెరిగిపోతోంది. సీఎం జగన్ నియోజకవర్గాల మార్పు చేపడుతుండడం చాలా మంది సిట్టింగ్ లకు నచ్చడం లేదు. దాంతో అసంతృప్తికి గురైన వారు ఇతర పార్టీల వైపు చూస్తున్నారు. సత్యవేడు నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం పరిస్థితి కూడా ఇందుకు మినహాయింపు కాదు.

కోనేటి ఆదిమూలంకు ఈసారి ఎమ్మెల్యే సీటు నిరాకరించిన వైసీపీ అధిష్ఠానం ఆయనకు తిరుపతి ఎంపీ టికెట్ ఇవ్వజూపింది. ఈ ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న ఎమ్మెల్యే ఆదిమూలం మంత్రి పెద్దిరెడ్డి, ఆయన తనయుడు ఎంపీ మిథున్ రెడ్డిలపై తీవ్ర విమర్శలు చేశారు. అనంతరం అజ్ఞాతంలోకి వెళ్లారు. ఇప్పుడు నారా లోకేశ్ ను కుమారుడితో కలిసారు.

LEAVE A RESPONSE