– కేంద్ర నిర్ణయాల్ని రాష్ట్రప్రభుత్వంపై రుద్దడం సబబు కాదు
– దేశానికే ఆదర్శంగా ఆర్బీకే, సచివాలయ వ్యవస్థల పనితీరు
– లాభసాటి సాగు వైపునకు మరలుతున్న రైతులు
– గిట్టుబాటు ధర, ఉచిత విద్యుత్పై రైతుల్లో ఆనందం
– ధాన్యం కొనుగోలు ధరల విషయంలో రాజీపడని ప్రభుత్వమిది..
-రాష్ట్ర వ్యవసాయ మిషన్ వైస్ చైర్మన్ ఎంవీఎస్ నాగిరెడ్డి వెల్లడి
రైతులు లాభపడితే కడుపుమంట ఎందుకు..?
ప్రజాస్వామ్యంలో ప్రభుత్వం అంటే పాలకపక్షాలే కాదు. ప్రతిపక్షం, మీడియా, ప్రజలు ఉంటారు. బాధ్యతాయుత మీడియాగా సమస్యల్ని లేవనెత్తడాన్ని మా ప్రభుత్వమెప్పుడూ ఆహ్వానిస్తూ.. పరిపాలనకు సంబంధించి మంచి విషయాల్ని స్వీకరిస్తుంది. అయితే, ఇటీవల చంద్రబాబు, ఆయనకు వత్తాసుపలుకున్న పచ్చమీడియా రాతలు ప్రజల్ని తప్పుదోవబట్టించే విధంగా ఉన్నాయి. ధాన్యం కొనుగోలు, గిట్టుబాటు ధర, దిగుబడి, ప్రొక్యూర్మెంట్పై కొన్ని పత్రికల రాతలు అడ్డగోలుగా, వాస్తవాలకు దూరంగా ఉన్నాయి. ప్రజాస్వామ్య పాలనా వ్యవస్థలో కేంద్ర ప్రభుత్వం చేతుల్లో ఉన్న విధానాలను రాష్ట్రప్రభుత్వం పైకి రుద్దడం భావ్యం కాదనే సంగతిని పచ్చ మీడియా గుర్తెరగాలి.
నేడు 81 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి:
వ్యవసాయరంగంలో పంటల ఉత్పత్తి అనేది సాగు ఏరియాను బట్టి ఉండదు. ఏరియా తగ్గినంత మాత్రాన పంటల ఉత్పత్తి తగ్గదనే వాస్తవాన్ని అందరూ గుర్తించాలి. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక ఇప్పటికీ 8 ఖరీఫ్ సీజన్లు పూర్తయ్యాయి. ప్రస్తుతం 9వ ఖరీఫ్ సీజన్ కూడా ముగిసే దశకొచ్చింది. గడచిన ఈ 8 ఖరీఫ్ సీజన్లలో అతి తక్కువ ధాన్యం ఉత్పత్తి దిగుబడి విషయానికొస్తే.. 2015 –16లో, అంటే చంద్రబాబు హయాంలో 61.58 లక్షల మెట్రిక్ టన్నులుగా ఉంది. అంటే, చంద్రబాబు హయాంలో ధాన్యం దిగుబడి రికార్డ్ 61.58 లక్షల మెట్రిక్ టన్నులు. 2019 తర్వాత జగన్ గారి హయాంలో చూస్తే.. 81 లక్షలకు పైగా మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వచ్చిందనే వాస్తవాన్ని మీడియా గుర్తించకపోవడం విచారకరమని చెప్పాలి.
రైతు సంక్షేమ ప్రభుత్వమిది..
వ్యవసాయ, అనుబంధ రంగాలకు పెద్దపీట వేసి రైతుల సంక్షేమానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కృషిచేస్తున్నారు. దేశంలోని అనేక రాష్ట్రాలు మన రాష్ట్రంలో అమలు జరుగుతున్న ఆర్బీకే, సచివాలయ వ్యవస్థల పనితీరు తెలుసుకోవడానికి క్యూ కడుతున్నాయి. భారతదేశంలో ఎక్కడా లేనివిధంగా పసుపు పంటకు మద్ధతు ధర మన రాష్ట్రంలో అమలు చేస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కౌలు రైతులకు రైతు భరోసా అందిస్తున్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా సుమారు రూ.35వేల కోట్లు ఖర్చు చేసి 9 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్ అందిస్తున్న ప్రభుత్వమిది.రైతుల పంటల భద్రతకు రూ.6,664 కోట్లు చెల్లిస్తూ ఉచిత బీమా అందిస్తున్నాము. ఈరోజు రాష్ట్రంలో పామాయిల్ రైతులు బాగా లాభపడ్డారు. పామాయిల్, సెరీకల్చర్కు సంబంధించి దాదాపు 28వేల హెక్టార్లు క్రాప్ డైవర్షన్ అయ్యింది.
దిగుబడిని బట్టి ప్రొక్యూర్ మెంట్ ఆధారపడి ఉంటుంది. మార్కెట్లో మిగతా బియ్యంను బట్టి ప్రొక్యూర్మెంట్ను ప్రభుత్వం నిర్ణయిస్తామనే సంగతి అందరికీ తెలియందేమీ కాదు. ఆ విధంగా ఈరోజు మార్కెట్లో సన్నబియ్యo ధరను బట్టి ప్రొక్యూర్మెంట్ను ఏమేరకు చేయాలనేది ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. ధాన్యం కొనుగోలు విషయంలో ఒక్క రూపాయి ఎంఎస్పీ తక్కువైనా ఊరుకోనని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చెప్పారు. అందులో భాగంగానే వ్యవసాయ మిషన్ వైస్ చైర్మన్గా నేను జూన్ 17 నుంచి రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో పర్యటిస్తూ.. వ్యవసాయశాఖ అధికారులు, అనుబంధ వ్యవస్థలతో సమీక్షలు చేస్తున్నాం.
క్షేత్రస్థాయిలో పంట దిగుబడులు, ధాన్యం కొనుగోలు, రైతుల సాధకబాధకాలపై నివేదికలను ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి అందిస్తున్నాం. గతంలో రైతుల సమస్యలు చెబితే ‘మాకు తెలుసులేవయ్యా.. అని వెటకారం చేసే చంద్రబాబును ముఖ్యమంత్రిగా చూశాం.’ కానీ, మా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి రైతుకు మేలు చేయడంలో స్పష్టమైన విధానాలు కలిగిన నాయకుడు. గతంలో ముందెన్నడూ లేనివిధంగా రైతులకు కాటాకూలీ, రవాణా ఖర్చును రైతులకు చెల్లిస్తున్న ప్రభుత్వమిది.. ప్రొక్యూర్మెంట్ విషయంలోనూ ఆన్లైన్లో గణాంకాలు అంతా పారదర్శకంగా ఉన్నాయి.
రైతులను భయభ్రాంతులకు గురిచేసే విధంగా కథనాలు రాయడం పచ్చమీడియాకు మంచిది కాదు. ఏ రాష్ట్రంలో అమలు జరగని వ్యవసాయరంగ విధానాలు ఏపీలో జరుగుతున్నాయి. వ్యవసాయం అనేది ప్రకృతి మీద ఆధారపడి ఉండేది. ‘నేను తుఫానును కంట్రోలు చేశాను అని బాబు చెబితే ఆనాడు బ్యానర్లు పెట్టారు కదా..’ అలాంటి, తప్పుడు మాటలతో రైతులను నమ్మించి వంచిచే ప్రభుత్వం కాదు. ఇది అక్షరాలా రైతు సంక్షేమ ప్రభుత్వం. లాభసాటి పంటల వైపు రైతులను మరల్చడమే ప్రభుత్వ ధ్యేయం.