Suryaa.co.in

Andhra Pradesh

దిగ్విజయంగా ముగిసిన యువగళం జైత్రయాత్ర

-చివరిరోజు జాతరలా సాగిన యువగళం పాదయాత్ర
-యాత్రలో పాల్గొన్న భువనేశ్వరి, ఇతర కుటుంబసభ్యులు
-గాజువాక – శివాజీనగర్ లో పైలాన్ ను ఆవిష్కరించిన యువనేత

గాజువాక: జనగళమే యువగళమై 226రోజులపాటు అప్రతిహతంగా కొనసాగిన యువనేత నారా లోకేష్ పాదయాత్ర దిగ్విజయం పూర్తయింది. కార్యకర్తలు, అభిమానుల జయజయధ్వానాల నడుమ గాజువాక ప్రకాష్ నగర్ లో సోమవారం సాయంత్రం పాదయాత్ర విజయవంతమైనందుకు గుర్తుగా నారా లోకేష్ పైలాన్ ను ఆవిష్కరించారు. గతంలో చంద్రబాబునాయుడు చేపట్టిన వస్తున్న మీకోసం పాదయాత్ర ఎక్కడైతే ముగించారో అక్కడే యువగళం పాదయాత్రను కూడా ముగించారు. ఈ సందర్భంగా జైలోకేష్, జై తెలుగుదేశం నినాదాలతో ఆ ప్రాంతం హోరెత్తింది.

సోమవారం ఉదయం సిడబ్యుసి-1 నుంచి ప్రారంభమైన పాదయాత్ర కార్యకర్తలు, అభిమానుల కోలాహలం నడుమ ఉత్సాహంగా సాగింది. అడుగడుగునా జివిఎంసి ప్రజలు యువనేతకు నీరాజనాలు పట్టారు. 226వరోజు పాదయాత్రలో లోకేష్ తో కలిసి అడుగులు వేస్తున్న తల్లి నారా భువనేశ్వరి, అత్త నందమూరి వసుంధరా దేవి, ఇతర కుటుంబసభ్యులు పాల్గొన్నారు.వివిధరకాల నృత్యాలు, గరగలు, డప్పులచప్పులు, బాణాసంచా మోతలతో యువగళం దద్దరిల్లింది.

మధ్యాహ్నం భోజన విరామానంతరం గాజువాక నియోజకవర్గం జివిఎంసి వడ్లమూడి జంక్షన్ నుంచి పాదయాత్ర ప్రారంభించగా, సంఘీభావంగా వేలాది ప్రజలు కలిసి నడిచారు. ఈ సందర్భంగా గాజువాక ప్రధాన రహదారిజనసంద్రంగా మారింది.

ముగింపు కార్యక్రమంలో తల్లి నారా భువనేశ్వరి, నందమూరి వసుంధరాదేవి, టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, మాజీ అధ్యక్షుడు కిమిడి కళావెంకట్రావు, ఉభయగోదావరి జిల్లాల సమన్వయ కర్త ప్రత్తిపాటి పుల్లారావు, భరత్, మాజీమంత్రులు కొల్లు రవీంద్ర, అమర్ నాథ్ రెడ్డి, టిడి జనార్దన్, వంగలపూడి అనిత,  ఎమ్మెల్యే  వెలగపూడి రామకృష్ణ, గొట్టిపాటి రవికుమార్, డోలా బాలవీరాంజనేయస్వామి, ఏలూరి సాంబశివరావు, మాజీ మంత్రి కోండ్రు మురళి, గాజువాక ఇన్ చార్జి పల్లా శ్రీనివాసరావు, మాజీ ఎమ్మెల్యే కొండబాబు, జ్యోతుల నవీన్, తదితరులు పాల్గొన్నారు. కార్యకర్తల నినాదాలు, బాణాసంచా మోతలతో పైలాన్ ఆవిష్కరణ ప్రాంతం దద్దరిల్లింది.

జై తెలుగుదేశం, జయహో లోకేష్ నినాదాలతో పైలాన్ శివాజీనగర్ పైలాన్ ఆవిష్కరణ ప్రదేశం హోరెత్తింది. యువనేతపై అభిమానులు పూలవర్షం కురిపించారు. గతంలో పార్టీ అధినేత చంద్రబాబునాయుడు వస్తున్న మీకోసం పాదయాత్ర ముగించిన ప్రదేశంలోనే లోకేష్ యువగళం పాదయాత్ర ముగించారు. కార్యకర్తల నినాదాలు, కేరింతలతో గాజువాక శివాజీనగర్ మారుమోగింది. యువనేతతో కలసి నడిచేందుకు యువతీయువకులు, మహిళలు పోటీపడ్డారు. రాష్ట్రం నలుమూలల నుంచి టిడిపి, జనసేన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్దఎత్తున తరలివచ్చారు.

గాజువాక ప్రధాన రహదారిపై 2 కి.మీ.ల మేర ట్రాఫిక్ స్తంభించిపోయింది. అడుగడుగునా ప్రజలు బ్రహ్మరథం పట్టారు. దారిపొడవునా యువనేతను చూసేందుకు జనం బారులు తీరారు. యువనేతకు సంఘీభావంగా ప్లకార్డులు చేతబూని స్టీల్ ప్లాంట్ కార్మికులు యాత్రలో పాల్గొన్నారు. యువనేత పాదయాత్రకు సంఘీభావంగా రైతులు, వివిధరంగాల కార్మికులు, మహిళలు పాదయాత్రలో పాల్గొన్నారు. యువగళం చివరిరోజైన 226వరోజు యువనేత లోకేష్ 13 కి.మీ.ల పాదయాత్ర చేశారు.

మొత్తం 226రోజుల్లో 3132 కి.మీ.ల మేర సాగిన యువగళం పాదయాత్ర అరాచకపాలనపై ప్రజలను చైతన్యవంతం చేయడంలో సంపూర్ణంగా విజయం సాధించింది. మరికొద్దినెలల్లో రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ సాధించబోయే తిరుగులేని విజయాలకు చారిత్రాత్మక యువగళం పాదయాత్ర పునాది వేసింది.

యువగళం పాదయాత్ర విజయవంతంగా ముగిసిన సందర్భంగా ఈనెల 20వతేదీ సాయంత్రం 3గంటలకు భోగాపురం సమీపంలోని పోలిపల్లి వద్ద యువగళం – నవశకం పేరిట భారీ బహిరంగసభ నిర్వహించనున్నారు. ఈ సభకు చంద్రబాబునాయుడు, పవన్ కళ్యాణ్ , బాలకృష్ణతోపాటు అతిరథ మహారధులంతా హాజరుకానున్నారు.

యువనేత లోకేష్ సెల్ఫీ ఛాలెంజ్

ఇది ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సైకోఇజానికి బలైన ఓ బిసి నాయకుడి భవనం. గ్రేటర్ విశాఖ గాజువాక సెంటర్లో అన్ని అనుమతులు, నిబంధనల మేరకే టిడిపి సీనియర్ నేత, బిసినాయకుడు పల్లా శ్రీనివాసరావు తమ సొంతస్థలంలో భవనాన్ని నిర్మించుకున్నారు. శ్రీనివాసరావు స్టీల్ ప్లాంట్ ఉద్యమంలో చురుగ్గా పాల్గొంటున్నాడని కక్షగట్టిన సైకో జగన్… 2020లో కుంటిసాకులతో ఆయన నిర్మించుకున్న భవనాన్ని కూల్చివేశారు. బిసిలు బ్యాక్ బోన్ అంటూ వేదికపై లెక్చర్లు ఇస్తున్న జగన్… నాలుగున్నరేళ్ల పాలనలో అడుగడుగునా బిసిలపై అణచివేత చర్యలకు పాల్పడుతున్నారు. బిసిల ఆస్తులను ధ్వంసం చేయడమేగాక రాష్ట్రవ్యాప్తంగా 26వేలమంది బిసిలపై తప్పుడు కేసులు బనాయించారు. ఎంతోమంది అమాయక బిసి సోదరులను పొట్టనబెట్టుకున్నాడు. ఎస్సీ, ఎస్టీ, బిసిల ఓట్లతో అధికారం చేపట్టిన జగన్… వారిపైనే ఉక్కుపాదం మోపుతూ రాక్షసానందం పొందుతున్నాడు. నియంతపాలనకు సాక్షీభూతంగా నిలుస్తున్న ఈ శిథిలాలతోనే బిసిలంతా కలసి నీ అరాచక ప్రభుత్వానికి పాడెకట్టడం ఖాయం…రాసిపెట్టుకో జగన్మోహన్ రెడ్డీ!!

బిల్డప్ బాబాయ్ కబుర్లొద్దు… ముందు రోడ్లు వెయ్యి జగన్!

ఇది రాష్ట్రంలోని మారుమూల ఏజన్సీ ప్రాంతంలోని పాడుబడ్డ రహదారి కాదు. అక్షరాలా గ్రేటర్ విశాఖ పరిధిలో నిత్యం ట్రాఫిక్ తో రద్దీగా ఉండే స్టీల్ ప్లాంట్ సమీపంలోని గాజువాక కణితిరోడ్డు. ప్రజల నుంచి పన్నుమీద పన్నుతో కోట్లాదిరూపాయలు దోచుకుంటున్న సైకో ప్రభుత్వం విశాఖలాంటి మెట్రోపాలిటన్ నగరాల్లో రోడ్ల మరమ్మతులు కూడా చేయకుండా గాలికొదిలేసింది. విశాఖ మహానగర రోడ్లపై తట్టమట్టి పోయడం చేతగాని దద్దమ్మ ముఖ్యమంత్రి… రాజధాని చేసేస్తానంటూ బిల్డప్ బాబాయ్ కబుర్లు చెబుతున్నాడు. 10 కి.మీ.ల దూరానికి హెలీకాప్టర్ లో వెళ్లే ఈ రిచెస్ట్ సిఎంకి నగర ప్రజల ట్రాఫిక్ కష్టాలు తెలుస్తాయా? ఆలోచించండి విశాఖ ప్రజలారా…!

నియంతృత్వంపై ప్రజాయుద్ధమే యువగళం

నియంతృత్వంపై ప్రజా యుద్ధమే యువగళం. అణిచివేతకు గురైన వర్గాల గొంతుకైంది మన యువగళం. ప్రజాగళమై, ప్రజలే బలమై 226 రోజులు, 3132 కి.మీ పాదయాత్ర నిర్విరామంగా కొనసాగింది. అసమర్థుడు గద్దెనెక్కి ప్రజాస్వామ్యంపై చేసిన దాడి, వ్యవస్థల విధ్వంసాన్ని కళ్లారా చూసాను. భవిష్యత్తుపై ఆశలు కోల్పోయిన యువతకు భరోసా ఇచ్చాను. అందరి సహకారంతో యువగళం పాదయాత్రను దిగ్విజయంగా గాజువాక నియోజకవర్గం అగనంపూడి వద్ద ముగిస్తున్నాను.

పాదయాత్రలో నేను ఇచ్చిన ప్రతి హామీకి కట్టుబడి ఉంటాను. ప్రజా ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మీకు ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకుంటాను. యువగళం పాదయాత్రలో భాగస్వామ్యం అయిన ప్రజలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, సిబ్బంది అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు.

యువగళం సైనికులకు కృతజ్ఞతాభినందనలు

రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అరాచకపాలనపై ప్రజాచైతన్యమే లక్ష్యంగా ఈ ఏడాది జనవరి 27వతేదీన కుప్పం శ్రీ వరదరాజస్వామి పాదాల చెంతనుంచి ప్రారంభమైన యువగళం పాదయాత్ర… 226రోజులు, 3132 కి.మీ.ల మేర అవిశ్రాంతంగా కొనసాగి విశాఖజిల్లా అగనంపూడి వద్ద దిగ్విజయంగా పూర్తయింది. ఈ సుదీర్ఘమైన మజిలీలో యువగళం పవిత్రయజ్ఞాన్ని ముందుకు నడిపించడంలో యువగళం కమిటీల పాత్ర అనిర్వచనీయం. అధికారపార్టీ సైకోలు ఎన్నో కవ్వింపు చర్యలకు పాల్పడినా సంయమనతో లక్ష్యాన్ని చేరుకునేందుకు సహకరించారు.

యాత్ర కొనసాగుతున్న సమయంలో ఎన్ని ఇబ్బందులు ఎదురైనా రేయింబవళ్లు నా వెన్నంటే ఉంటూ సేవలందించారు. దాదాపు ఏడాదిపాటు కుటుంబాలకు దూరంగా మీరు అందించిన సేవలు జీవితంలో మరువలేను. రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ సాధించబోయే అప్రతిహతమైన విజయాలకు మన యువగళం పునాది వేసింది. మరో 3నెలల్లో చంద్రన్న నేతృత్వాన  ఏర్పాటయ్యే  ప్రజాప్రభుత్వం మీకు అండగా నిలుస్తుంది.  చారిత్రాత్మకమైన యువగళం క్రతువులో భాగస్వాములైన ప్రధాన సమన్వయకర్త కిలారి రాజేష్, వివిధ కమిటీల సమన్వయకర్తలు, సభ్యులకు నా కృతజ్ఞతాభినందనలు.

యువగళం విజయవంతంలో కీలకపాత్ర వహించిన కమిటీలు:

  1. యువగళం మెయిన్ కోఆర్డినేటర్ – కిలారు రాజేష్.
  2. వ్యక్తిగత సహాయక బృందం – తాతా నరేష్, కుంచనపల్లి వినయ్, పిన్నింటి మూర్తి.
  3. వాలంటీర్స్ కమిటీ – అనిమిని రవినాయుడు, మానం ప్రణవ్ గోపాల్.
  4. ఫుడ్ కమిటీ – మద్దిపట్ల సూర్యప్రకాష్, లక్ష్మీపతి.
  5. మీడియా కమిటీ – మెయిన్ కో-ఆర్డినేటర్ బి.వి.వెంకటరాముడు, కాసరనేని జశ్వంత్.
  6. పబ్లిక్ రిలేషన్స్ కమిటీ – కృష్ణారావు, కిషోర్, మునీంద్ర, చల్లా మధుసూధన్ రావు ఫోటోగ్రాఫర్స్: సంతోష్, శ్రీనివాస్, కాశీప్రసాద్.
  7. అలంకరణ కమిటీ – బ్రహ్మం చౌదరి, మలిశెట్టి వెంకటేష్.
  8. అడ్వాన్స్ టీమ్ కమిటీ – డూండీ రాకేష్, నిమ్మగడ్డ చైతన్య, శ్రీరంగం నవీన్ కుమార్, చంద్రశేఖర్, నారాయణస్వామి, కోలా రంజిత్ కుమార్, ప్రత్తిపాటి శ్రీనివాస్.
  9. రూట్ కోఆర్డినేషన్ కమిటీ – కస్తూరి కోటేశ్వరరావు (కెకె), కర్నాటి అమర్నాథ్ రెడ్డి.
  10. కరపత్రాల పంపిణీ కమిటీ – అడుసుమిల్లి విజయ్, వెంకటప్ప, వంశీ, చీరాల నరేష్, యార్లగడ్డ మనోజ్.
  11. సెల్ఫీ కోఆర్డినేషన్ కమిటీ – వెల్లంపల్లి సూర్య, శ్రీధర్ చౌదరి, ప్రదీప్.
  12. వసతుల కమిటీ – జంగాల వెంకటేష్, నారా ప్రశాంత్, లీలాధర్, బాబి, రమేష్.
  13. తాగునీటి వసతి కమిటీ – భాస్కర్, చిరుమాళ్ల వెంకట్, అనిల్.
  14. సోషల్ మీడియా – అర్జున్

నారా లోకేష్ ను కలిసిన విశాఖ ఉక్కు నిర్వాసితులు

విశాఖ ఉక్కు నిర్వాసితుల ఐక్యవేదిక సంఘం ప్రతినిధులు యువనేత లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు. స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి భూములిచ్చిన 8500మంది నిర్వాసితుల సమస్యలు 40ఏళ్లుగా పెండింగ్ లో ఉన్నాయి. పెదగంట్యాడ, గంగవరం, వడ్లపూడి, అగనంపూడి పంచాయతీల్లోని 64 గ్రామాలను స్టీల్ ప్లాంట్ కోసం 26వేల ఎకరాలు తీసుకుని ఖాళీ చేయించారు. భూ యజమానులకు ఎకరాకు రూ.1,250 మాత్రమే అప్పట్లో పరిహారం ఇచ్చారు. చదువుతో సంబంధం లేకుండా ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చారు…ఆర్ కార్డు ఇచ్చారు. కొన్ని పోరాటాల ద్వారా 5వేల మంది నిర్వాసితులకు ప్లాంట్ లో ఉద్యోగాలు ఇచ్చారు.

నిర్వాసితులకు కొన్నేళ్లకు జీఓ35 తెచ్చి ఆర్ కార్డులు కుటుంబ సభ్యులకు బదిలీ విధానం తెచ్చారు. అప్పటి నుండి 8వేల మంది నిర్వాసితులకు ఉద్యోగాలిచ్చారు..మరో 8,500మందికి ఇవ్వలేదు. కేంద్ర ప్రభుత్వం స్టీల్ ప్లాంటును 100శాతం ప్రైవేటీకరణ చేస్తామని చెబుతోంది. ఇదే జరిగితే నిర్వాసితులు ఘోరంగా నష్టపోతారు. మీరు అధికారంలోకి వచ్చాక విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రభుత్వరంగ సంస్థలో కొనసాగించాలి. ప్రధాని వద్దకు నిర్వాసితులను తీసుకెళ్లి మా సమస్యల్ని పరిష్కరించాలి. మిగిలిపోయిన ఆర్ కార్డుదారులకు ఇచ్చిన హామీలన్నీ అమలుచేయాలి. స్టీల్ ప్లాంట్ కు సొంత గనులు కేటాయించాలి. స్టీల్ ప్లాంట్ ను నమ్ముకుని ఉన్న కాంట్రాక్టు కార్మికులకు పని భద్రత కల్పించాలి.

నారా లోకేష్ స్పందిస్తూ…పోరాటాలు, ప్రాణ త్యాగాలతో సాధించుకున్నది విశాఖ ఉక్కు కర్మాగారం. విశాఖ ఉక్కు – ఆంధ్రుల హక్కు పేరుతో జరిగిన ఉద్యమంలో 32మంది ప్రాణాలు కోల్పోయారు. 22,500 ఎకరాల్లో విస్తరించి ఉన్న విశాఖ ఉక్కు విలువ ప్రస్తుత మార్కెట్ ధర ప్రకారం రూ.3లక్షల కోట్లకు పైమాటే. విశాఖ ఉక్కు ఇప్పటి వరకు రూ.40 వేల కోట్లను వివిధ పన్నుల రూపంలో కేంద్ర, రాష్ట్రాలకు చెల్లించింది. భారతదేశంలో తీర ప్రాంతంలో ఉన్న ఏకైక ఉక్కు కర్మాగారం విశాఖ ఉక్కు. విశాఖ ఉక్కు ఇప్పటి వరకు రూ.40 వేల కోట్లను వివిధ పన్నుల రూపంలో కేంద్ర, రాష్ట్రాలకు చెల్లించింది.

ఆంధ్రుల ఆత్మగౌరవంతో ముడివడి ఉన్న ఇటువంటి ప్రతిష్టాత్మకమైన సంస్థను ప్రైవేటీకరణ చేస్తుంటే కేసులకు భయపడి జగన్మోహన్ రెడ్డి నోరు మెదపడం లేదు. కొందరు బడా పారిశ్రామికవేత్తలతో కుమ్మక్కయితే ఖాళీగా ఉన్న సుమారు 8వేల ఎకరాల భూములను అడ్డగోలుగా దోచుకునేందుకు జగన్ వ్యూహరచన చేశాడు.

5కోట్ల మంది ప్రజల ఆత్మగౌరవాన్ని తాకట్టుపెట్టి జగన్ రెడ్డి కమిషన్ల కోసం, ప్లాంట్ లో వాటాల కోసం ఆరాటపడడం అత్యంత దుర్మార్గం. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై పార్లమెంటులో మా గళాన్ని విన్పిస్తాం. ఎట్టి పరిస్థితుల్లో విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను అంగీకరించబోం.  నిర్వాసితులకు అన్యాయం జరగకుండా అవసరమైన చర్యలు చేపడతాం.

విశాఖ ఉక్కు మనుగడకు అవసరమైన క్యాప్టివ్ మైన్స్, కాస్ట్ కటింగ్ వంటి అంశాలపై దృష్టిసారించి, రాష్ట్రప్రభుత్వం తరపున అవసరమైన సహాయ,సహకారాలను అందిస్తాం. విశాఖ స్టీల్ ఉద్యోగులు, కార్మికుల ఉద్యోగభద్రత, సంక్షేమానికి కృషిచేస్తాం. విశాఖ ఉక్కు నిర్వాసితులు, ఆర్ కార్డుదారులకు ఇచ్చిన హామీల అమలుకు చర్యలు తీసుకుంటాం.

లోకేష్ ను కలిసిన పద్మశాలి సామాజిక వర్గీయులు

జివిఎంసి దుర్గానగర్ బస్టాఫ్ వద్ద భావనారుషి మార్కండేయ పద్మశాలి సేవాసంఘం ప్రతినిధులు యువనేత లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు.మేం చేనేత వృత్తిపై ఆధారపడి జీవిస్తున్నాం.చిన్న చిన్న బట్టల వ్యాపారం, టైలరింగ్ వృత్తి చేసుకుంటూ జీవిస్తున్నాం.బట్టల వ్యాపారం, టైలరింగ్ లో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం.షాపింగ్ మాల్స్ వల్ల మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.టీడీపీ అధికారంలోకి వచ్చాక 50ఏళ్లు నిండిన పద్మశాలీలు, టైలర్లకు పెన్షన్ అందించాలి.చేనేత సామాజికవర్గంలోని అన్ని వర్గాలకు క్యాస్ట్ సర్టిఫికెట్లు అందించాలి.మా సంఘాలకు ప్రభుత్వ స్థలం కేటాయించి సామాజిక భవనం నిర్మించాలి.విశాఖపట్నం సిటీలో మాకు సామాజిక భవనం లేదు ఏర్పాటు చేయాలి.

నారా లోకేష్ స్పందిస్తూ… బిసిల బ్యాక్ బోన్ గా ఉంటానని అధికారంలోకి వచ్చిన జగన్… గత నాలుగున్నరేళ్లుగా బిసిల వెన్ను విరుస్తున్నాడు.జగన్ అసమర్థ పాలన కారణంగా 55మంది చేనేత కార్మికులు ఆత్మహత్య చేసుకుంటే పరిహారం అందించకపోగా, కనీసం పరామర్శించలేదు.గత ప్రభుత్వ హయాంలో చేనేత కార్మికులకు రూ.110 కోట్ల‌ మేర రుణమాఫీ చేశాం. చేనేత కార్మికులకు ముడిసరుకుపై సబ్సిడీ, సబ్సిడీ రుణాలు అందజేసి అండగా నిలిచాం. ఆదరణ పథకంలో చేనేత కార్మికులకు 90శాతం సబ్సిడీపై పనిముట్లు అందజేశాం. చేనేతలకు ముడిసరుకు సబ్సిడీ, సబ్సిడీరుణాలను అందజేసి ఆదుకుంటాం.పట్టణ ప్రాంతాల్లో చేనేత కార్మికులకు టిడ్కో ఇళ్లు, మౌలిక వసతులతో కూడిన కామన్ వర్కింగ్ షెడ్లు ఏర్పాటు చేస్తాం.సాంప్రదాయ మగ్గాలపై నేసే ప్రతి చేనేత కార్మికుడికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందజేస్తాం.ఆత్మహత్య చేసుకున్న చేనేత కుటుంబాలకు నిర్ణీత కాలవ్యవధిలో ఆర్థిక సాయం అందిస్తాం.

నారా లోకేష్ ను కలిసిన టూవీలర్స్ వర్కర్లు

జివిఎంసి జగ్ జంక్షన్ లో గాజువాక ప్రగతి టూ వీలర్ మెకానిక్ వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నాయకులు యువనేత లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు.రాష్ట్రవ్యాప్తంగా 10లక్షల మంది టూవీలర్ మెకానిక్ లు ఉన్నారు. ఈ వృత్తిలో మేము అనేక అనారోగ్యాలను ఎదుర్కొంటున్నాం.రోడ్డు మార్జిన్ లో ఉన్న షాపులు, బడ్డీలు రహదారి విస్తరణతో రోడ్డున పడుతున్నాం.మెకానిక్ లకు సబ్సిడీ రుణాలు, సంక్షేమ పథకాలు అందించాలి.టూ వీలర్ మెకానిక్ లకు రాష్ట్ర ప్రభుత్వం గుర్తింపునివ్వాలి.మెకానిక్ లకు కార్పొరేషన్ ద్వారా గుర్తింపు కార్డులు ఇవ్వాలి.ఏపీఐఐసీ ద్వారా టూ వీలర్ మెకానిక్ లకు షాపులు పెట్టుకునేందుకు స్థలాలు ఇవ్వాలి.మెకానిక్ లకు కూడా ఆర్థిక సాయం చేసే పథకాలు అమలు చేయాలి.విధి నిర్వహణలో ఇబ్బందులకు గురైన మెకానిక్ లకు పెన్షన్ మంజూరు చేయాలి.మెకానిక్ లకు హెల్త్ కార్డులు మంజూరు చేయాలి.

నారా లోకేష్ స్పందిస్తూ… జగన్మోహన్ రెడ్డి విధ్వంసక పాలనలో చేతవృత్తులన్నీ తీవ్రంగా దెబ్బతిన్నాయి.పాదయాత్ర లో బైక్ మెకానిక్స్ ఎంతో మంది నన్ను కలిసి బాధలు చెప్పుకున్నారు. బైక్ మెకానిక్స్ కూడా జగన్ బాధితులే.టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే జిల్లా యూనిట్ గా తీసుకొని బైక్ రిపేర్ శిక్షణా కేంద్రాలు ఏర్పాటు చేస్తాం. మెకానిక్ లకు అధునాతన పనిముట్లు అందిస్తాం.బైక్ మెకానిక్స్ కి ప్రభుత్వ గుర్తింపు కార్డు లు అందజేస్తాం. వైద్య సాయం, బైక్ మెకానిక్స్ కి చంద్రన్న బీమా అమలు చేస్తాం.మెకానిక్ షెడ్లు ఏర్పాటు చేసుకోవడానికి కార్పొరేషన్లు ద్వారా సబ్సిడీ రుణాలు అందిస్తాం.

నారా లోకేష్ ను కలిసిన కళాసీ సంఘ ప్రతినిధులు

జివిఎంసి ఎస్ఎఫ్ఎస్ స్కూలు వద్ద సూర్యదుర్గా కళాసీల సంక్షేమ సంఘం ప్రతినిధులు యువనేత లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు.రాష్ట్ర ప్రజలకు ప్రయోజనకరమైన విధానాలు ఎన్నికల మ్యానిఫెస్టోలో కార్మికులకు మేలుచేసే అంశాలు పొందుపర్చాలి.ఈఎస్ఐ, పీఎఫ్, లేబర్ గుర్తింపుకార్డు, ఎంప్లాయ్ మెంట్, గ్రూపు ఇన్సూరెన్స్ అమలు చేయాలి.

నారా లోకేష్ స్పందిస్తూ… జగన్మోహన్ రెడ్డి విధ్వంసక పాలనలో నిర్మాణరంగం పూర్తిగా దెబ్బతింది.కరోనా సమయంలో పనుల్లేక వందలాది మంది కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు.భవన నిర్మాణ సంక్షేమ బోర్డుకు చెందిన రూ.3వేలకోట్ల నిధులను కూడా జగన్ ప్రభుత్వం దారిమళ్లించింది.స్కీమ్ వర్కర్లపై పనిభారం పెంచి, వేతనాలు పెంచకుండా రోడ్డున పడేశాడు.టీడీపీ పాలనలో భవన నిర్మాణ కార్మికులకు సంక్షేమ బోర్డు ద్వారా అనేక పథకాలు అందించాం.జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యాక ఈ పథకాలన్నీ రద్దు చేశాడు.టిడిపి అధికారంలోకి వచ్చాక కార్మికుల సంక్షేమానికి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటాం.ఈఎస్ఐ, పీఎఫ్, గుర్తింపుకార్డులు, బీమా పథకాల అమలుకు చర్యలు చేపడతాం.

నారా లోకేష్ ను కలిసిన అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు

గాజువాక అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని జీవీఎంసీ శ్రీనగర్ లో వాటర్ సప్లై ఇంజినీరింగ్ సెక్షన్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు యువనేత లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు.జీవీఎంసీ(గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్)లో 20 ఏళ్లుగా నీటి సరఫరా విభాగంలో 20ఏళ్లుగా పనిచేస్తున్నాం.మేము ఔట్ సోర్సింగ్ విధానంలో కార్మికులుగా పనిచేస్తున్నాం.టీడీపీ ప్రభుత్వంలో జీఓ-96 ను 08-02-2019న మినిమం టైమ్ స్కేల్ కార్మికులుగా చేస్తూ ఉత్తర్వులిచ్చారు. అమలయ్యేలోపు ప్రభుత్వం మారిపోయింది.వైసీపీ ప్రభుత్వం వచ్చాక జీఓ-96ను అమలు చేయకుండా వేధిస్తోంది.ప్రస్తుతం మాకు కేవలం రూ.13వేలు మాత్రమే వేతనం వస్తోంది.మాకు ఆప్కాస్ ద్వారా జీతాలు ఇవ్వడం వల్ల ప్రభుత్వ పథకాలు అమలుకావడం లేదు.టీడీపీ అధికారంలోకి వచ్చాక ఆప్కాస్ ఉద్యోగులకు ప్రభుత్వ పథకాలు అమలు చేయాలి.ఎంటీఎస్(మినిమం టైమ్ స్కేల్)ను అమలు చేయాలి.కరోనాలో చనిపోయిన ఉద్యోగుల కుటుంబ సభ్యులకు ఉపాధి కల్పించాలి.

నారా లోకేష్ స్పందిస్తూ… జగన్మోహన్ రెడ్డి దివాలాకోరు పాలనలో అన్నిరకాల ఉద్యోగులు తీవ్ర ఇబ్బందుల పాలవుతున్నారు.పర్మినెంట్ ఉద్యోగులతోపాటు కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు కూడా జగన్ మాయమాటలు నమ్మి మోసపోయారు.అధికారంలోకి రావడానికి అడ్డగోలు హామీలు ఇచ్చి మాట తప్పడం, మడమతిప్పడం జగన్ కు వెన్నతోపెట్టిన విద్య.అనంతపురం జిల్లాలో భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు వందలకోట్ల సొంత నిధులు వెచ్చించి సత్యసాయి మంచినీటి పథకాన్ని నిర్మిస్తే, ఉద్యోగులకు జీతాలు, నిర్వహణ ఖర్చులు ఇవ్వలేక పాడుబెట్టిన దివాలాకోరు సిఎం జగన్.టిడిపి అధికారంలోకి రాగానే వాటర్ వర్క్స్ కార్మికుల న్యాయమైన డిమాండ్ల పరిష్కారానికి చర్యలు తీసుకుంటాం. నిబంధనలకు లోబడి కరోనా సమయంలో మృతిచెందిన వారి కుటుంబాలకు ఉపాధి కల్పించే అంశాన్ని పరిశీలిస్తాం.

నారా లోకేష్ ను కలిసిన న్యాయవాదులు

గాజువాక న్యా టీఎస్ఆర్ అండ్ టీబీకే కళాశాల వద్ద న్యాయవాదులు యువనేత లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు. న్యాయవాదులు ఆర్థిక ఇబ్బందుల కారణంగా వృత్తిలో వెనుకబడిపోతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా వేలాదిమంది న్యాయవాదుల పరిస్థితి ఇలాగే ఉంది. టీడీపీ అధికారంలోకి వచ్చాక న్యాయవాదుల సంక్షేమానికి ప్రాధాన్యతనివ్వాలి.ఆర్థికంగా వెనుకబడిన న్యాయవాదులకు వృత్తినైపుణ్యం, ఆఫీస్, లైబ్రరీ ఏర్పాటుకు ఆర్థికసాయం చేయాలి.సొంతిల్లు లేని న్యాయవాదులకు ప్రభుత్వ ఇల్లు మంజూరు చేయాలి.రానున్న ఎన్నికల టీడీపీ మ్యానిఫెస్టోలో న్యాయవాదుల సంక్షేమానికి ప్రాధాన్యతనివ్వాలి.జూనియర్ న్యాయవాదులకు స్టైఫండ్ ఇవ్వాలి. లైబ్రరీ కోసం ఆర్థికసాయం చేయాలి.జూనియర్ న్యాయవాదులకు వృత్తిపరమైన నైపుణ్యం కోసం శిక్షణ తరగతులు ఏర్పాటు చేయాలి.మరణించిన న్యాయవాదుల కుటుంబాలకు రూ.10లక్షలు ఆర్థికసాయం అందించాలి.

నారా లోకేష్ స్పందిస్తూ… జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక న్యాయవాదులు, న్యాయమూర్తులకు రక్షణ కరువైంది.వైసీపీ దుర్మార్గాలను నిలదీసే న్యాయవాదులు, న్యాయమూర్తులపై పేటీఎం బ్యాచ్ సోషల్ మీడియాలో దాడులకు పాల్పడుతోంది.హైకోర్టు న్యాయమూర్తులపై సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు పెడితే ఏపీ సీఐడీ నేటికీ పట్టించుకోలేదు.ప్రభుత్వ దోపిడీపై కోర్టుల్లో వాదించే లాయర్లపై భౌతిక దాడులకు పాల్పడుతున్నారు.అధికారంలోకి వచ్చాక జూనియర్ న్యాయవాదులకు క్రమం తప్పకుండా భృతితోపాటు మెరుగైన లైబ్రరీ,  జీవితబీమా సౌకర్యం కల్పిస్తాం.వృత్తి శిక్షణ కల్పించేందుకు అవసరమైన ఏర్పాట్లకు చర్యలు తీసుకుంటాం.

LEAVE A RESPONSE