Suryaa.co.in

Andhra Pradesh

కోడికత్తి కేసులో అసలు ముద్దాయి జగన్ రెడ్డే

-కోడికత్తి దాడి కేసులో కోర్టుకు హాజరవ్వకుండా జగన్ రెడ్డి దళిత బిడ్డ శ్రీను జీవితాన్ని నాశనం చేస్తున్నాడు
-అంబేద్కర్ విగ్రహాన్ని తాకే అర్హత కూడా జగన్ కు లేదు
-కోడికత్తి శ్రీను తల్లి దీక్షకు మద్దతుగా టీడీపీ దళిత నేతల నిరాహార దీక్ష

కోడికత్తి కేసులో ఎన్.ఐ.ఏ నిశితంగా పరిశీలిస్తే అసలు ముద్దాయి సీఎం జగన్ రెడ్డేనని టీడీపీ నేతలు అన్నారు. కోడికత్తి శ్రీను తల్లి దీక్షకు మద్దతుగా టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య ఆధ్వర్యంలో ఆ పార్టీ దళిత నేతలు మంగళగిరిలోని పార్టీ కేంద్రకార్యాలయంలో నిరాహార దీక్ష చేపట్టారు. ఈ దీక్షలో ఐదేళ్లుగా దళితులపై దాడులకు సంబంధించిన ఫోటోలు ప్రదర్శించారు.

ఈ సంధర్బంగా టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు మాట్లాడుతూ….కోడికత్తితో పొడిపించుకొని ఎన్నికల్లో లబ్ధి పొందిన జగన్ రెడ్డి.. తనవల్ల 5 ఏళ్లుగా అన్యాయంగా జైల్లో మగ్గిపోతున్న కోడికత్తి శ్రీనుని మాత్రం బయటకు రానివ్వడం లేదు. దళిత యువకుడు శ్రీనివాస్ ను ప్రలోభపెట్టి, అతనితో భుజంపై కోడికత్తితో పొడిపించుకొని, ఎన్నికల్లో లబ్ధిపొంది ముఖ్యమంత్రి అయ్యాడు. చివరకు తనవల్ల జైలు పాలై, చేయని అన్యాయంగా 5 ఏళ్ల నుంచి జైల్లోమగ్గిపోతున్న శ్రీనుకి జగన్ రెడ్డి చేసిందేమిటి? జగన్ రెడ్డి పథకం ప్రకారమే శ్రీను కోడికత్తి నిందితుడుగా మారాడు.

శ్రీను విషయంలో జగన్ రెడ్డి అనుసరిస్తున్న వైఖరిని బట్టే, ఆయనకు దళితులపై ఎంత ప్రేమ ఉందో అర్థం చేసుకోవచ్చు. కోడికత్తి ఘటన జరిగాక జగన్ రెడ్డి ఏపీ పోలీసులపై తనకు నమ్మకంలేదని, కేసు విచారణను ఎన్ఐఏకు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. ఆ ప్రకారంగానే ఎన్ఐఏ కోడికత్తి కేసుని తరువుగా విచారించి దానిలో ఎలాంటి రాజకీయ దురుద్దేశాలు.. వ్యక్తుల ప్రమేయం లేదని తేల్చి, కోర్టుకి నివేదిక ఇచ్చింది. దాన్ని ఛాలెంజ్ చేసి జగన్ రెడ్డి మరలా విచారించాలంటూ కోర్టుకు హాజరు కాకుండా, అమాయకుడైన శ్రీనుని దుర్మార్గంగా జైల్లో ఉండేట్టు చేశాడు.

జగన్ రెడ్డి ఒక్కసారి కోర్టుకు హాజరై చెప్పాల్సింది చెబితే శ్రీనుకి బెయిల్ వస్తుంది. అలా రావడం జగన్ రెడ్డికి ఇష్టంలేదు. శ్రీను బయటకు వస్తే తన బండారం.. కోడికత్తి నాటకం బయటపడు తుందని, ప్రజలు తనను ఛీత్కరిస్తారని జగన్ రెడ్డి భయం. అందుకే ఐదేళ్లుగా కోర్టుకు హాజరుకాకుండా శ్రీనుని, అతని కుటుంబాన్ని వేధిస్తున్నాడు. దళితులు పేదలేకానీ..తెలివితక్కువ వాళ్లుకాదు జగన్ రెడ్డి. అంబేద్కర్ విగ్రహం పేరిట జగన్ కొత్త నాటకం మొదలెట్టాడు. మహానుభావుడు… ప్రపంచమేథావి.. బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహం తాకే అర్హత కూడా జగన్ రెడ్డికి లేదు. దళితులపై జగన్ రెడ్డికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా.. ప్రేమాభిమానాలున్నా.. వెంటనే ఎన్ఐఏ కోర్టుకు హాజరై , శ్రీను బయటకు వచ్చేలా చూడాలి. శ్రీను కుటుంబానికి న్యాయం చేయాలి.” అని అచ్చెన్నాయుడు డిమాండ్ చేశారు.

మాజీ మంత్రి వర్ల రామయ్య మాట్లాడుతూ….దళితుడైన కోడికత్తి శ్రీనుకు న్యాయం చేయాలంటూ ఎన్టీఆర్ భవన్‌లో వర్ల రామయ్య నాయకత్వంలో దీక్షకు కూర్చున్న తెదేపా దళిత నాయకులు. జగన్ రెడ్డి తన రాజకీయ స్వార్ధ ప్రయోజనాల కోసం దళితుడైన కోడికత్తి శ్రీను జీవితాన్ని నాశనం చేశాడు. కోడికత్తి కేసును నిశితంగా పరిశీలిస్తే ఇందులో ప్రధమ ముద్దాయి జగన్ రెడ్డే. జగన్ రెడ్డి తనపై సానుభూతిని సృష్టించుకోవడం కోసం దళితుడైన శ్రీను చేత బలవంతంగా పొడిపించుకున్నాడు. పొడిపించుకున్న జగన్ రెడ్డి సిఎం కుర్చీలో కూర్చున్నాడు.

బాధితుడైన శ్రీను జైల్లో మగ్గిపోతున్నాడు. చేతికి అందొచ్చిన కొడుకు జైల్లో ఉంటే ఆ తల్లిదండ్రుల పరిస్థితి ఏమిటీ? లండన్‌లో ఉన్న కూతురిని చూడటానికి జగన్ రెడ్డి స్పెషల్ ప్లైట్ వేసుకుని వెళతాడు. కోడికత్తి శ్రీనును చూసేందుకు ఆయన తల్లిదండ్రులకు ములాఖత్ కూడా ఇవ్వడం లేదు. పిల్లలపై జగన్ రెడ్డిదే ప్రేమా? ఐదేళ్లపాటు దళితులపై నరమేధం సాగించిన జగన్ రెడ్డి నేడు అంబేడ్కర్ విగ్రహం ఆవిష్కరించడం అణగారిన వర్గాలకు అవమానం. జగన్ రెడ్డి చేత ఆవిష్కరింపబడుతున్నందుకు అంబేడ్కర్ ఆత్మ ఘోషిస్తోంది. ఇప్పటికైనా జగన్ రెడ్డి కల్పించుకుని చేయని తప్పుకు శిక్ష అనుభవిస్తున్న శ్రీనుకు బెయిల్ వచ్చేలా చర్యలు తీసుకోవాలని వర్ల రామయ్య డిమాండ్ చేశారు.

మాజీ మంత్రి కిమిడి కళా వెంకట్రావు మాట్లాడుతూ…. “ జగన్ రెడ్డి మోసానికి బలై, 5 ఏళ్లుగా జైల్లో మగ్గిపోతున్న దళిత యువకుడు శ్రీనివాస్ కు, అతని కుటుంబానికి మద్ధతుగా టీడీపీ దళితనేతలు చేపట్టిన దీక్షకు సంఘీభావం ప్రకటిస్తున్నాను. జరిగిన ఘటనపై ప్రజలు ఆలోచించాలి. అంబేద్కర్ రాజ్యాంగాన్ని తుంగలోతొక్కి, దానిలోని అంశాలకు విరుద్ధంగా పాలన సాగిస్తున్న వ్యక్తి, నేడు ఆ మహానుభావుడు అంబేద్కర్ ను అవమానిస్తూ, ఆయన విగ్రహా న్నే ప్రారంభించడానికి సిద్ధమయ్యాడు.

విగ్రహప్రారంభం పేరిట జగన్ రెడ్డి పన్నిన పన్నాగం ప్రజలకు అర్థమైంది. ఓట్లకోసం జగన్ ఆడుతున్న కపట నాటకంలో అంబేద్కర్ విగ్రహం ప్రారంభం కూడా ఒకటి. జగన్ రెడ్డి పార్టీ పెట్టినప్ప టి నుంచీ హరిజన…గిరిజన.. బలహీనవర్గాలపై ఈర్ష్యాద్వేషాలతో వ్యవహరిస్తు న్నాడు. ఆయా వర్గాలపై ప్రభుత్వంలోకి రాకముందు ఎలాగైతే వ్యవహరించాడో, వచ్చాక కూడా అంతే ప్రవర్తిస్తున్నాడు.

రాజ్యాంగపరంగా దళితులకు దక్కాల్సిన ప్రయోజనాలు, అవకాశాల్ని కూడా దక్కకుండా చేశాడు. దళితులపై జగన్ రెడ్డికి ద్వేషం…కక్ష…కార్పణ్యం ఉన్నాయి అనడానికి డాక్టర్ సుధాకర్ విషయంలో ప్రవర్తించిన తీరుతోపాటు అనేక ఘటనల్లో వ్యవహరించిన తీరే నిదర్శనం. దళిత యువకుడు సుబ్రహ్మణ్యాన్ని దారుణంగా చంపేసి, అతని మృతదేహాన్ని డోర్ డెలివరీ చేసిన వారిని జగన్ రెడ్డి ఏస్థాయిలో నిలిపాడో అందరం చూశాం. ఇలాంటి ఘటనలు చూశాక అంబేద్కర్ విగ్రహం తాకే అర్హత జగన్ రెడ్డికి లేదు అని చెప్పకతప్పదు.

ముఖ్యమంత్రిగా ఆయనకు ఆ అర్హత లేనేలేదు. దళిత యువకుడు శ్రీనివాస్ జైల్లో మగ్గిపోతుంటే, 5 ఏళ్లుగా ముఖ్యమంత్రికి కోర్టుకు వెళ్లే తీరిక లేదా? చట్టాలు, న్యాయస్థానాలపై జగన్ రెడ్డికి గౌరవం లేదు అనడానికి ఇదే నిదర్శనం. అంబేద్కర్ రాజ్యాంగం వల్లే తాను ముఖ్యమంత్రిని అయ్యాను అనే ఆలోచన ఏ కోశానా జగన్ రెడ్డికి లేదు. శ్రీనుని బయటకు తీసుకొచ్చే ఉద్దేశం లేదు కాబట్టే జగన్ రెడ్డి కోర్టుకు హాజరుకాకుండా కాలయాపన చేస్తున్నాడు. జగన్ రెడ్డికి రోజులు దగ్గరపడ్డాయి. అంబేద్కర్ మహానుభావుడు రాసిన పవిత్రమై న రాజ్యాంగానికి పట్టిన జగన్ రెడ్డి అనే ఛీడను తొలగించాల్సిన బాధ్యత మనందరిపై ఉంది.” అని కళా వెంకట్రావు పిలుపునిచ్చారు.

ఈ దీక్షలో తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్యతోపాటు రాష్ట్ర అధికార ప్రతినిధి పిల్లి మాణిక్యరావు, మోకా ఆనందసాగర్, సంతనూతలపాడు టీడీపీ ఇన్ ఛార్జ్ బీఎన్ విజయకుమార్, టీడీపీ రాష్ట్ర పార్టీ కార్యదర్శి దేవతోటి నాగరాజు, టీడీపీ రాష్ట్ర ఎస్సీ సెల్ ఉపాధ్యక్షులు కోడూరి అఖిల్, జ్యోతిబసు, దయారత్నం, కోటేశ్వరరావు, దళిత నాయకుడు పులి చిన్నా, రాష్ట్ర ఎస్సీ సెల్ నాయకులు బేతపూడి సుధాకర్, బొక్కా నాగరాజు, సురేష్, పెద్దబ్బాయ్, ప్రభాకర్, శీను, పీటర్ పాల్ తదితరులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE