Suryaa.co.in

National

20 లక్షల ఉద్యోగాలు, కేజీ నుంచి పీజీ ఉచిత విద్య: గుజరాత్‌ కు భాజపా వరాల జల్లు..

గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ దగ్గరపడుతోన్న వేళ.. ప్రచార జోరు పెంచిన భారతీయ జనతా పార్టీ, శనివారం ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసింది. గుజరాత్‌ ప్రజలపై వరాల జల్లు కురిపించింది. ఉచితాల జోలికి పెద్దగా వెళ్లని భాజపా.. అభివృద్ధే లక్ష్యంగా ఈ మేనిఫెస్టోను రూపొందించినట్లు తెలిపింది. తమను మళ్లీ గెలిపిస్తే రాష్ట్రంలో ఉమ్మడి పౌరస్మృతిని అమలు చేస్తామని, 20లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని కాషాయ పార్టీ హామీ ఇచ్చింది.

గాంధీనగర్‌లో జరిగిన కార్యక్రమంలో భాజపా జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా, రాష్ట్ర ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్‌, రాష్ట్ర భాజపా చీఫ్‌ సీఆర్‌ పాటిల్‌ ఈ మేనిఫెస్టోను విడుదల చేశారు. ఉగ్రముప్పు నుంచి రాష్ట్రానికి భద్రత కల్పించేలా యాంటీ-రాడికలైజేషన్‌ యూనిట్ ఏర్పాటు, రెండు ఎయిమ్స్‌ సహా కొత్త ఆసుపత్రుల నిర్మాణం, ప్రభుత్వ పాఠశాలల పునరుద్ధరణ వంటి హామీలతో ఈ మేనిఫెస్టోను రూపొందించింది.

భాజపా మేనిఫెస్టోలో ప్రధానాంశాలివే..
* ఉమ్మడి పౌరస్మృతి అమలు, వచ్చే ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగావకాశాలు
* ఉగ్రముఠాల స్లీపర్‌సెల్స్‌ను గుర్తించి నిర్మూలించేందుకు యాంటీ రాడికలైజేషన్‌ సెల్‌
* వచ్చే ఐదేళ్లలో మహిళలకు లక్ష ప్రభుత్వ ఉద్యోగాలు
* రూ.10వేల కోట్లతో రైతులకు మౌలికసదుపాయాల కల్పన
* మహిళలు, వృద్ధులకు ఉచిత బస్సు ప్రయాణాలు
* విద్యార్థినులకు కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య
* రూ.10వేల కోట్లతో రాష్ట్రంలోని 20వేల ప్రభుత్వ స్కూళ్ల అభివృద్ధి
* ఆయుష్మాన్‌ భారత్‌ కింద వార్షిక బీమా మొత్తం రూ.5లక్షల నుంచి రూ.10లక్షలు పెంపు

LEAVE A RESPONSE