– అది విజన్ కాదు. 420
– మేనిఫెస్టోను ఎగ్గొట్టే ప్రణాళికది
– చంద్రబాబును నమ్మడమంటే చంద్రముఖిని నిద్ర లేపడమే.
– ఎక్కడ చూసినా లిక్కర్, శాాండ్ మాఫియానే.
– ఎమ్మెల్యేలు దోచుకుంటున్నారు.
– సీఎం సహా, నీకింత.. నాకింత అని పంచుకుంటున్నారు.
– కరెంటు బిల్లులు షాక్ కొడుతున్నాయి.
– ప్రతిపక్షంలో కష్టాలు, కేసులు సహజం
– మనకూ మంచి టైం వస్తుంది.
– నన్నే 16 నెలలు జైల్లో పెట్టారు
– ప్రజల అండతో ముఖ్యమంత్రిగా వచ్చాను
– ఎవరూ భయపడొద్దు.
– ఉమ్మడి అనంతరపురం జిల్లాలో పార్టీకి చెందిన స్ధానిక సంస్ధల ప్రజా ప్రతినిధులు, పార్టీ నాయకులతో తాడేపల్లి క్యాంప్ ఆఫీస్లో సమావేశమైన మాజీ ముఖ్యమంత్రి, వైయస్సార్సీపీ అధ్యక్షుడు వైయస్ జగన్
తాడేపల్లి: ఆరు నెలలకే చంద్రబాబునాయుడు ప్రభుత్వం మీద తీవ్ర స్ధాయిలో వ్యతిరేకత కనిపిస్తోంది. ఇంతటి వ్యతిరేకత గతంలో ఏ ప్రభుత్వం మీదా లేదు. ప్రతి ఇంటికి మనం మంచి చేస్తే.. ఆయన ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరికీ మంచి చేస్తానని హామీ ఇచ్చాడు. మనమంతా ఎమ్మెల్యేల తరపున ప్రచారానికి వెళ్లినప్పుడు మనల్ని ఆప్యాయతతో ప్రజలు ఆదరించారు. మన మీద వ్యతిరేకత లేదు. కానీ పది శాతం మంది చంద్రబాబు మాటలను నమ్మారు. దానికి కారణం కూడా మనమే. అంత గొప్ప పాలన మనం అందించగలిగాం కాబట్టే.. చంద్రబాబు మభ్యపెట్టగలిగాడు, ప్రజలను ఆశపెట్టగలిగాడు. జగన్ చేసి చూపించాడు కాబట్టి చంద్రబాబు కూడా చేసి చూపిస్తాడేమో అని ఆశపడ్డారు.
చంద్రబాబు ఆయన పార్టీ అభ్యర్ధులు ఏ ఇంటికి వెళ్లినా ఇంట్లో ఎవ్వరినీ వదిలిపెట్టలేదు. ఒక మనిషి ఈ స్ధాయిలో మోసం చేయగలుగుతాడా అన్నంత గొప్ప మోసం చేశారు. ఏ ఇంటికి వెళ్లినా చిన్నపిల్లలతో సహా నీకు రూ.15 వేలు, నీకు రూ.15 వేలు అని వారి తల్లులైతే నీకు రూ.18 వేలు, ఆ అమ్మలకు తల్లులు, అత్తలు కనిపిస్తే నీకు రూ.48 వేలు అని, 20 ఏళ్లు దాటిన పిల్లవాడు ఇంట్లో కనిపిస్తే రూ.36 వేలు అని, కండువా వేసుకుని ఇంట్లోంచి రైతు బయటకు వస్తే నీకు రూ.20 వేలు అని ఇంట్లో ఎవరినీ వదిలిపెట్టకుండా ఆశపెట్టారు.
ఇవాళ ఆరు నెలల గడవకముందే చంద్రబాబు చెప్పిన మాటలు మోసాలై కంటికి కనిపిస్తున్నాయి. ఆరోజు నేను ఎన్నికల్లో చెప్పాను. చంద్రబాబును నమ్మడం అంటే చంద్రముఖిని నిద్రలేపడమే అని. చంద్రబాబును నమ్మడం అంటే పులినోట్లో తలపెట్టడమే అని.. ఇవాళ ఆరు నెలల తిరక్క ముందే అదే కనిపిస్తోంది. ఇప్పుడు ప్రతి ఇంట్లో ఒకటే మాట వినిపిస్తోంది. జగన్ పలావు పెట్టాడు. చంద్రబాబు బిర్యానీ పెడతానన్నాడు. పలావు, బిర్యానీ రెండూ పోయాయి. ఏమీ లేకుండా చంద్రబాబు రోడ్డు మీద నిలబెట్టాడు అన్న చర్చ నడుస్తోంది.
ఒకవైపు మనం ఇస్తున్న పథకాలు పూర్తిగా నిలిపివేశాడు. మరోవైపు ఆయన ఇస్తానన్న సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ గాలికెగిరిపోయాయి. మరోవైపు చంద్రబాబు బాడుదే బాదుడు మొదలైంది. ముట్టుకుంటే కరెంటు బిల్లలు షాక్ కొడుతున్నాయి. ఆరు నెలల తిర్కక మునుపే రూ.15 వేల కోట్లు కరెంటు బిల్లలు షాకుల రూపంలో వేయగలిగిన దుర్మార్గుడు చంద్రబాబు మాత్రమే.
ఇన్ని విపరీతమైన పరిస్థితుల మధ్య స్కామ్ల మీద స్కామ్లు జరుగుతున్నాయి. లిక్కర్, శాండ్ మాఫియాతో పాటు ప్రతి నియోజకవర్గంలోనూ పేకాట క్లబ్బులు. ఇవన్నీ కాకుండా ఏ నియోజకవర్గంలోనైనా ఫ్యాక్టరీ నడుపుకోవాలన్నా, మైనింగ్ చేయాలన్నా ఎమ్మెల్యే దగ్గరకు వెళ్లి డబ్బులివ్వాల్సిందే. ప్రతి విషయంలోనూ నాకింత.. నీకింత అని ఎమ్మెల్యే నుంచి ముఖ్యమంత్రి వరకు పంచుకుంటున్న పరిస్థితులు.
ఇలాంటి పరిస్థితుల్లో ఉద్యమబాట పట్టడానికి మనం ఇవాళ కలిసి అడుగులు వేస్తున్నాం. ఏ నాయకుడైనా ప్రజల తరపున స్పందించ గలగాలి. వారి సమస్యలపై పోరాటం చేయాలి. దీనిపై పార్టీ నాయకత్వాన్ని చైతన్యం చేస్తున్నాం. అప్పుడే ప్రజల్లో అటువైపు అధికార పార్టీ మీద పెరుగుతున్న వ్యతిరేకత మనకు సానుకూలంగా మారుతుంది. ఆరు నెలలకే మనం పోరాటం చేయాల్సిన పరిస్ధితి వచ్చింది. చంద్రబాబు పాలన అలా నడుస్తోంది.
ప్రజలు, రైతులు ఇబ్బంది పడుతున్న విషయం మన కళ్లెదుటే కనిపిస్తోంది. రైతులకు గతంలో పెట్టుబడి సహాయం రైతు భరోసా కింద ఇచ్చిన రూ.13,500 గాలికెగిరిపోయింది. రూ.20 వేలు ఇస్తానన్న పెట్టుబడి సాయం కూడా మోసమని తేలిపోయిన పరిస్ధితుల్లో రైతు సాగు చేస్తున్నాడు. రైతులకు ఉచిత పంటల బీమా దక్కే పరిస్థితి పోయింది. ఆర్బీకేలు నిర్వీర్యం అయిపోయాయి. ఇ–క్రాపింగ్ ఎక్కడా కనిపించడం లేదు. గతంలో మనం ఆర్బీకేల ద్వారా దళారీ వ్యవస్ధ లేకుండా ప్రతి రైతుకు కనీస మద్ధతు ధర వచ్చేటట్టుగా ధాన్యం కొనుగోలు చేసి.. వెంటనే పైకం చెల్లించేలా అక్కడే ‘ఫండ్ ట్రాన్సఫర్ ఆర్డర్’ (ఎఫ్టీఓ) కూడా ఇచ్చి, మనం తోడుగా ఉంటే.. ఇవాళ అదే రైతులకు కనీస మద్ధతు ధర రాకపోగా, అంత కంటే రూ.300 నుంచి రూ.400 వరకు తక్కువకు అమ్ముకోవాల్సిన దుస్ధితి వచ్చింది. అందుకే వారికి మద్ధతుగా ఆందోళన కార్యక్రమం చేశాం.
పట్టుకుంటే షాక్ కొట్టేలా ఉన్న విద్యుత్ బిల్లుల మీద ఈనెల 27న ఆందోళనకు పిలుపునిచ్చాం. ఇప్పటి వరకు 6 నెలల వరకు రూ.6 వేల కోట్ల బాడుదు మాత్రమే. రేపటి నెలలో మరో రూ.9 వేల కోట్ల బాదుడు ఉండబోతుంది. ఇలాంటి పరిస్థితులలో మహిళలు నిరసన తెలుపుతూ బిల్లులు కాల్చుతున్న పరిస్ధితి. ఈ దఫా కరెంటు బిల్లుల పెరుగుదలకు నిరసనగా ప్రజలకు తోడుగా ఉండే కార్యక్రమాన్ని నియోజకవర్గ స్థాయిలో చేయబోతున్నాం.
మన ప్రభుత్వ హయాంలో ప్రతి 3 నెలలకొకసారి, త్రైమాసికం అయిన వెంటనే పిల్లల తల్లులకు డబ్బులిచ్చి వారి చదువులుకు తోడుగా ఉండేవాళ్లం. ఈరోజు పిల్లలుకు విద్యాదీవెన, వసతి దీవెన రాక ఇబ్బంది పడుతున్నారు. మనం జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలలకు సంబంధించిన ఫీజు రీయింబర్స్మెంట్ ఏప్రిల్లో వెరిఫై చేసి మే నెలలో ఇచ్చే వాళ్లం. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నాలుగు త్రైమాసికాలు గడిచిపోయాయి.
ఇంకా ఏఫ్రిల్లో వసతి దీవెన కింద డబ్బులిచ్చే వాళ్లం. ఇప్పుడు అది కూడా ఎగిరిపోయింది. మొత్తంగా ఫీజులకు సంబంధించి నాలుగు దఫాలు విద్యాదీవెన రూ.2,800 కోట్లు, వసతి దీవెన రూ.1100 కోట్లు మొత్తం రూ.3,900 కోట్లు పిల్లలకు ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వకపోవడం వల్ల.. పిల్లలు డబ్బులు కట్టలేక చదువులు మానివేస్తున్నారు. పనులకు వెళ్తున్నారు. ఈ పిల్లలకు అండగా వారికి తోడుగా ఉండే కార్యక్రమం జిల్లా యూనిట్గా జనవరి 3న చేయబోతున్నాం.
ప్రతిపక్షంలో కష్టాలు, కేసులు సహజం. మనకూ తప్పనిసరిగా టైమ్ వస్తుంది. ప్రజలకు తోడుగా, ప్రజల తరపున వారికి అండగా గొంతు విప్పాల్సిన తరుణమిది. అప్పుడే మనం నాయకులుగా ఎదుగుతాం. నాయకులుగా ఎదగడానికి ఇదొక అవకాశం. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కష్టాలు, నష్టాలు ఉంటాయి. కేసులు ఉంటాయి. జైల్లో కూడా పెడతారు. నేను మీ అందరికీ చెబుతున్నాను. కష్టాలు ఎల్లకాలం ఉండవు. కష్టం తర్వాత సుఖం ఉంటుంది. ఏ కష్టం ఎవరికి వచ్చినా నా వైపు చూడండి. నన్ను 16 నెలలు పెట్టారు. ప్రతిపక్షం ఉండదు. అడిగే వాడు ఉండడని నన్ను 16 నెలలు జైల్లో పెట్టారు.
అప్పుడు రాష్ట్రంలోనూ, కేంద్రంలోనూ కాంగ్రెస్ అధికారంలో ఉంది. కాంగ్రెస్, టీడీపీ కలిసి నామీద కేసులు పెట్టారు. ఏమైంది మరలా ప్రజల అభిమానంతో ముఖ్యమంత్రి అయ్యాను. పగలు తర్వాత రాత్రి వస్తుంది. మరలా మన టైం వస్తుంది. జమిలి వస్తుందంటున్నారు. దేనికైనా మనం సిద్ధమే. ఎవ్వరూ, ఎక్కడా భయపడొద్దు. దేన్నైనా ఢీకొందాం. మీ అందరికీ జగన్మోహన్రెడ్డి, పార్టీ అండగా ఉంటుంది.
ప్రజాస్వామ్య బద్దంగా జరగాల్సిన సాగునీటి సంఘాల ఎన్నికలను అపహాస్యం చేశారు. బుల్డోజ్ చేసి ఎన్నికలు జరిపి.. రైతులు సంతోషంగా ఉన్నారని చెబుతున్నారు. రైతులు సంతోషంగా ఉన్నారని మీకు అనిపిస్తే రాజీనామా చేసి బయటకు రండి. అప్పుడు పెట్టుబడి సాయం కోసం అడుగుతున్న రైతులు మీకు గుర్తుకు వస్తారు. ఉచిత బీమా కోసం అడుగుతున్న రైతులు గుర్తుకు వస్తారు.
విజన్–2047 అంటున్నాడు. చంద్రబాబూ ఏడు నెలల క్రితం నువ్వు, నీ ఎల్లో మీడియా కలిసి మేనిఫెస్టో పేరుతో ప్రచారం చేసి ఊదరగొట్టారు. రూ.15 వేలు నుంచి రూ.48 వేల వరకు హామీలిచ్చుకుంటూ వెళ్లారు. ఇక్కడ ఏడు నెలల క్రితం మేనిఫెస్టో అని చెప్పిన హామీలకే దిక్కులేదు కానీ, విజన్–2047 అంటున్నాడు. వీరి విజన్, ఆ డాక్యుమెంట్ చూస్తే ఆశ్చర్యం అనిపిస్తుంది.
ఆరు నెలల్లో 3.14 లక్షల పెన్షన్లు కట్
మార్చి, ఏప్రిల్ నెలలో 66,34,742 పెన్షన్లు మన ప్రభుత్వ హాయంలో ఉండేవి. చంద్రబాబు అధికారంలోకి వచ్చి ఆరు నెలలైంది. డిసెంబరులో పంపిణీ చేసిన పెన్షన్లు సంఖ్య 63,20,222 అంటే 3.14 లక్షల పెన్షన్లు కట్ చేశారు. కొత్త పెన్షన్లు ఒకరికి ఇవ్వకపోగా.. ఉన్న పెన్షన్లు కట్ చేస్తున్నారు. రెండు మూడు నెలల్లో ఇంకా, 3 లక్షల నుంచి 4 లక్షల పెన్షన్లు కట్ చేయడానికి సిద్ధం అవుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మనం పోరుబాటకు సిద్ధం కావాలి. ఈ పోరు బాటలో వైయస్సార్సీపీ జెండాను రెపరెపలాడించే విధంగా పోరాటం చేయాలని, ప్రతి గ్రామంలో వైయస్సార్సీపీ జెండాను ఎగుర వేయడానికి సిద్ధం కావాలని అభ్యర్ధిస్తున్నాను.
జనవరి చివరి వారం నుంచి నేను పార్లమెంటు జిల్లాల్లో పర్యటిస్తాను. వారంలో ప్రతి బుధవారం, గురువారం రాత్రి అక్కడే బస చేసి కార్యకర్తలతో మమేకమవుతాను. ‘కార్యకర్తలతో జగనన్న పార్టీ బలోపేతానికి దిశ నిర్దేశం’ పేరుతో కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాను. ఈ కార్యక్రమం మొదలయ్యే లోగా మండల స్ధాయి నుంచి మొదలై నియోజకవర్గ, జిల్లాస్ధాయి వరకు పార్టీ అనుబంధ విభాగాల కమిటీల నియామకాలన్నీ పూర్తి చేయాలి. పార్టీ నిర్మాణం చాలా ముఖ్యమైన కార్యక్రమం. ఇదంతా ఆర్గనైజ్డ్గా తీసుకు రావాలి. నా కార్యక్రమం మొదలైన తర్వాత మీరు నేను కలిసి మండల స్ధాయి నుంచి గ్రామస్ధాయి వరకు తీసుకుని పోదాం. విలేజ్ కమిటీలు, బూతు కమిటీలు నియామకం పూర్తి చేస్తాం.
మనం సోషల్ మీడియాలో చాలా చురుగ్గా ఉండాలి. జనరేషన్ మారింది. ప్రతి కార్యకర్తకు ఫేస్బుక్, యూట్యూబ్, ట్విటర్ వంటి అన్ని సోషల్ మీడియా అకౌంట్లు ఉండాలి. గ్రామ స్ధాయిలో ఎక్కడ ఏ అన్యాయం జరిగినా ప్రశ్నించాలి. ఎవరికైనా పెన్షన్ రాకపోయినా, బిల్లుల బాదుడు పైనా ప్రశ్నిస్తూ ప్రతి గ్రామం నుంచి విప్లవ ధోరణిలో ప్రశ్నించాలి.
గ్రామ స్థాయి నుంచే ప్రశ్నించే స్వరం ఉండాలి. అప్పుడు చైతన్యం వస్తుంది. ఈసారి మన టార్గెట్ చంద్రబాబు సింగిల్ డిజిట్ దాటకూడదు. అది కచ్చితంగా జరుగుతుంది.