Suryaa.co.in

Andhra Pradesh Telangana

శుభకార్యాలకు ఇక 3 నెలల బ్రేక్

-మూఢాలు, ఆషాఢం కారణంగా వచ్చే మూడు మాసాలు ముహూర్తాలు లేవంటున్న వేద పండితులు

సాధారణంగా ఎండాకాలంలో శుభకార్యాలు ఎక్కువగా జరుగుతుంటాయి. కానీ ఈసారి మాత్రం పెళ్లిళ్లు సహా ఇతర శుభ కార్యక్రమాలకు అనూహ్యంగా బ్రేక్ పడనుంది. వచ్చే మూడు నెలలపాటు శుభ ముహూర్తాలు ఏమీ లేకపోవడమే అందుకు కారణమని వేద పండితులు అంటున్నారు.

ఈ నెల 29 నుంచి మూడు నెలలపాటు వైశాఖ, జ్యేష్ట, ఆషాఢ మాసాల్లో గురు, శుక్ర మౌఢ్యమి వల్ల సుముహూర్తాలు ఉండవని వివరిస్తున్నారు. దీనివల్ల వివాహాలతోపాటు నూతన గృహ ప్రవేశాలు, దేవతా విగ్రహ ప్రతిష్టాపనలు, శంకుస్థాపనల లాంటి శుభకార్యాలను జరపడం సాధ్యంకాదని తెలియజేస్తున్నారు.

సూర్య కాంతి గురు గ్రహంపై పడినప్పుడు గురు మౌఢ్యమి, శుక్ర గ్రహంపై పడితే శుక్ర మౌఢ్యమి సంక్రమిస్తుందని వేద పండితులు అంటున్నారు. ఫలితంగా ఆయా గ్రహాల గమనం తెలియక శుభ ముహూర్తాలు పెట్టడం కుదరదని పేర్కొంటున్నారు.

వేద పండితులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈనెల 28 చైత్ర బహుళ చవితి ఆదివారం నుంచి జులై 8 ఆషాఢ శుద్ధ తదియ సోమవారం వరకు శుక్ర పౌఢ్యమి ఉంది. అలాగే గురు పౌఢ్యమి మే 7 చైత్ర బహుళ చతుర్దశి మంగళవారం నుంచి జూన్‌ 7 జ్యేష్ఠ శుక్ల పాడ్యమి గురువారం వరకు కొనసాగనుంది.

గురు, శుక్ర మూఢాల్లో నూతన శుభకార్యక్రమాలు చేయడం మంచిది కాదని పండితులు సూచిస్తున్నారు. ఇక జులై 6 నుంచి ఆగస్టు 4 వరకు ఆషాఢ మాసం ఉండటంతో ఎలాగూ పెళ్లిళ్లు సహా ఇతర శుభకార్యాలు నిర్వహించడం సాధ్యంకాదని స్పష్టం చేశారు.

మూఢాలు, ఆషాడ మాసం వల్ల శుభకార్యాలకు బ్రేక్ పడటం పూలు, పండ్లు లాంటివి అమ్ముతూ జీవనం సాగించే చిరువ్యాపారుల ఉపాధిపై ప్రభావం చూపనుంది. వారి వ్యాపారం మందగించనుంది. అలాగే బాజాభజంత్రీలు, డప్పు వాయిద్యాలు, డీజేలు, బారాత్ లు నిర్వహించే కళాకారుల ఉపాధికి మూడు నెలలపాటు గండిపడనుంది. నూతన వస్త్రాలు, బంగారు ఆభరణాల కొనుగోళ్లు మందగించనున్నాయి. ఫంక్షన్‌ హాళ్ల నిర్వాహకులకు ఆశించిన గిరాకీ లేక ఉసూరుమనే పరిస్థితి నెలకొంది.

– జయరాజ్

LEAVE A RESPONSE