40 ఏళ్ల క్రితం తెలుగు నాట మార్పుకు నాంది పలికిన చారిత్రాత్మక రోజు

-1983లో వచ్చిన టీడీపీ ప్రభుత్వంతోనే తెలుగు ప్రజల సామాజిక, ఆర్థిక, రాజకీయ జీవితాల్లో పెనుమార్పులు
-రాష్ట్రానికి సంక్షేమం -అభివృద్ది పరిచయం చేసిన తొలి ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వం
-మళ్లీ తెలుగు దేశం ప్రభుత్వంతోనే తెలుగు ప్రజలకు పూర్వ వైభవం, రాష్ట్ర పునర్ నిర్మాణం
-ఎన్టీఆర్ ఆశయాలు నెరవేర్చేందుకు కంకణ బద్దులై పనిచేద్దాం
-ఎన్టీఆర్ తొలిసారి ముఖ్యమంత్రిగా టిడిపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి 40 ఏళ్లు పూర్తయిన సందర్భం పై టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు పత్రికా ప్రకటన

అమరావతి:- స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు అధ్యక్షతన తెలుగుదేశం పార్టీ తొలి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన రోజు, తెలుగు జాతి చరిత్రలో ఒక చారిత్రాత్మకమైన రోజని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఎన్టీఆర్ తొలిసారి ముఖ్యమంత్రిగా తెలుగుదేశం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి నేటికి 40 ఏళ్లు పూర్తయిన సందర్భంగా చంద్రబాబు నాయుడు ఒక ప్రకటన విడుదల చేశారు. తెలుగుదేశం ప్రభుత్వ ఏర్పాటుతోనే తెలుగు వారి జీవితాల్లో సామాజిక, ఆర్థిక, రాజకీయ రంగాల్లో పెనుమార్పులు చోటుచేసుకున్నాయి అని చంద్రబాబు నాయుడు అన్నారు.

తెలుగు జాతి ప్రయాణాన్ని…1983లో తెలుగుదేశం ప్రభుత్వం ఆవిర్భావం ముందు….టీడీపీ ప్రభుత్వం ఆవిర్భావం తరువాత అని చూడాల్సిన అవసరం ఉందని చంద్రబాబు అన్నారు. నాటి దారుణ రాజకీయ పరిస్థితులు, ప్రజల వెతలు చూసిన ఎన్టీఆర్.. పేదరికం లేని సమాజం కోసం పార్టీ పెట్టి 9 నెలల్లో అధికారం చేపట్టారని అన్నారు. 40 ఏళ్ల క్రితం ఇదే రోజున ప్రజల మధ్యకు వచ్చి ప్రభుత్వం ఏర్పాటుsr-ntr చేస్తూ ఎన్టీఆర్ ప్రమాణం స్వీకారం చేసిన రోజు… తెలుగు ప్రజల జీవితాల్లో పెనుమార్పులకు నాంది పలికిన రోజు అని చంద్రబాబు నాయుడు అన్నారు. రెండు రూపాయలకు కిలో బియ్యం, భూమి శిస్తు రద్దు, సింగిల్ విండో విధానం, పటేల్ పట్వారీ వ్యవస్థ రద్దు, రూ. 50 లకే రైతులకు హార్స్ పవర్ విద్యుత్, మహిళలకు ఆస్తిహక్కు, పేదలకు పక్కా ఇళ్ల నిర్మాణం, వృద్ధులకు పింఛన్లు, జనతా వస్త్రాలు వంటి అనేక సంక్షేమ, విప్లవాత్మకమైన కార్యక్రమాలు అమలు చేసిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వానికే దక్కుతుంది అని చంద్రబాబు ఈ సందర్భంగా గుర్తు చేశారు.

మహిళల కోసం ప్రత్యేకంగా పద్మావతి యూనివర్సిటీ, మహిళల కోసం విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించింది తెలుగుదేశం ప్రభుత్వమే అని చంద్రబాబు అన్నారు. రాష్ట్ర జనాభాలో సగానికిపైగా ఉన్న బీసీలకు రాజ్యాధికారం దక్కింది తెలుగుదేశం ఆవిర్భావంతోనే అని చంద్రబాబు అన్నారు. నాటి ప్రభుత్వంలో, పాలనలో బీసీలకు ప్రాధాన్యం ఇవ్వడం ద్వారా, స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు కల్పించడం ద్వారా బీసీల రాజకీయ ఎదుగుదలకు నాంది పలికిన ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వం. ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు పెంపు, మైనారిటీలకు ప్రత్యేక కార్పొరేషన్ ల ఏర్పాటుతో వారి జీవితాల్లో వెలుగు తెచ్చింది టీడీపీ. గ్రామాల్లో, మండల, జిల్లా కేంద్రాల్లో పెద్ద ఎత్తున స్కూళ్లు, కాలేజీలు, ఇంజనీరింగ్, మెడికల్ కాలేజ్ లు ఏర్పాటు చేయడం ద్వారా అణగారిన వర్గాలకు విద్యను చేరువ చేసింది టీడీపీ అని చంద్రబాబు తెలిపారు.

తమ జీవితాల్లో మార్పు కోసం తెలుగుదేశం పార్టీకి అధికారాన్ని కట్టబెట్టిన బడుగు బలహీన వర్గాల జీవితాల్లో వెలుగులు నింపిన పార్టీగా టీడీపీ ఎప్పటికీ నిలిచిపోతుంది. ఎన్టీఆర్ తెలుగు వారికి ఆత్మగౌరవం తెచ్చిపెడితే…నేను వారిలో ఆత్మవిశ్వాసం పెంచాను. ఆ తరువాత కాలంలో నేను ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక పాలనలో సంస్కరణలు తీసుకువచ్చాను. ప్రజల వద్దకే పాలన వంటి కార్యక్రమాలతో పాలనలో జవాబుదారీ తనం తీసుకువచ్చాం. పాలకులు అంటే సేవకులు అనే నినాదంతో ప్రజలకు ప్రభుత్వాన్ని చేరువ చేశాం. మారుతున్న కాలానికి అనుగుణంగా ఐటీ, ఫార్మా, సేవల రంగంలో సంస్కరణలు అమలు చేసి ఆ ఫలితాలను పేదల, సామాన్యుల కుటుంబాలకు అందేలా చేశాం.

దీంతో ఇప్పుడు ప్రపంచంలో ఎక్కడ చూసినా అత్యధిక ప్రతిభ కలిగిన వారిలో తెలుగు ప్రజలు ముందు వరసలో నిలిచారు. ఇరిగేషన్ ప్రాజెక్టులు, పెట్టుబడులు, ఉపాధి, ఉద్యోగాల కల్పన, మౌలిక వసతులు, రైతులకు సబ్సిడీలు, మద్దతు ధర, డ్వాక్రా సంఘాలతో మహిళా సాధికారత వంటి అంశాలకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చాం. తెలుగు ప్రజల భవిష్యత్తు కోసం నిత్యం కలలు కని..వాటిని సాకారం చేసిన ఏకైక ప్రభుత్వంగా తెలుగుదేశం నిలిచిపోతుంది అని చంద్రబాబు నాయుడు అన్నారు.

టీడీపీ తొలి ప్రభుత్వం ఏర్పడి 40 ఏళ్లు పూర్తయిన సందర్భంగా నాటి సంగతులను గుర్తు చేసుకుంటూ….భవిష్యత్ ప్రయాణాన్ని నిర్థేశించుకుంటూ ముందుకు సాగాల్సిన అవసరం ఉంది. అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా ఎప్పుడూ ప్రజల సంక్షేమాన్ని కాంక్షించే పార్టీగా రాష్ట్ర పునర్నిర్మాణం కోసం పని చేయాల్సిన అవసరం ఉంది. సైకో పాలకుల చేతిలో సర్వ నాశనం అవుతున్న రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి చేసే పోరాటంలో టీడీపీ ముందుండి పని చేస్తుంది. ఎన్టీఆర్ కలలుగన్న పేదరికం లేని సమాజం నిర్మించేందుకు, ఆయన ఆశయ సాధన దిశగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దడానికి కంకణ బద్దులై పనిచేద్దాం అని చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు.

Leave a Reply