Suryaa.co.in

Features

హైందవ జీవన విధానానికి ప్రతిరూపం “దుర్గా వాహిని”

-మహిళా సురక్ష.. కుటుంబ జీవన విధానం పై అవగాహన..!
-లవ్ జిహాద్.. మతమార్పిడి పై సంక్షిప్త వివరణ
-ఘనంగా గద్వాల జిల్లా దుర్గా వాహిని శిబిరం
-భారీగా హాజరైన మహిళలు, యువతులు.. విద్యార్థినులు..
-హిందూ ధర్మ పరిరక్షణే కర్తవ్యంగా పనిచేస్తున్న సంస్థ దుర్గా వాహిని
-దుర్గా వాహిని తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ వాణి సక్కుబాయి

భారతీయ విలువలు.. సనాతన ధర్మం.. హైందవ విలువలను పరిరక్షించే బాధ్యతను దుర్గా వాహిని భుజాన వేసుకుందని దుర్గా వాహిని తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ వాణి సక్కుబాయి అన్నారు. “హిందూ ధర్మ పరిరక్షణే కర్తవ్యంగా పనిచేస్తున్న సంస్థ దుర్గా వాహిని” అని అన్నారు.

భారతీయతను ప్రపంచానికి చాటి చెప్పే బాధ్యత నేటితరం మహిళలదేనని సక్కుబాయి అన్నారు. విశ్వహిందూ పరిషత్ మహిళా యువజన విభాగమైన దుర్గా వాహిని సమావేశం గద్వాల పట్టణంలో నిర్వహించారు. విశ్వహిందూ పరిషత్ – దుర్గా వాహిని గద్వాల జిల్లా ఆధ్వర్యంలో ఒకరోజు మహిళా వికాస వర్గ ఘనంగా నిర్వహించారు.

గద్వాల జిల్లా కేంద్రంలోని శ్రీ లక్ష్మీ సత్యనారాయణ స్వామి దేవాలయంలో ఏర్పాటుచేసిన వికాస శిబిరానికి దుర్గా వాహిని కార్యకర్తలు, మహిళలు భారీగా తరలిరావడం విశేషం. ఈ సందర్భంగా పలు అంశాలపై మహిళలకు అవగాహన కల్పించారు. కుటుంబ జీవనం.. మహిళల ప్రాముఖ్యం గురించి ప్రతి మహిళకు వివరించారు. నేడు సమాజంలో పెరిగిపోతున్న లవ్ జిహాద్ దుర్ఘటనలపై సంపూర్ణంగా అవగాహన కల్పించారు. సమావేశంలో భాగంగా విశ్వహిందూ పరిషత్ పెద్దలతో పాటు సక్కుబాయి మాట్లాడారు.

నాగరికత పేరుతో కుటుంబాలను విచ్ఛిన్నం చేయడం తగదన్నారు. లక్షల సంవత్సరాలుగా వస్తున్న సంప్రదాయ పరిరక్షణ కోసం ప్రతి మహిళ పాటుపడాలన్నారు. నేటి ఆధునిక సమాజంలో టెక్నాలజీ ఎంత పెరిగినా… కుటుంబ వ్యవస్థ యొక్క ఔన్నత్యాన్ని విస్మరించరాదని సూచించారు. విద్య.. ఉద్యోగం.. వ్యాపారం తో పాటు మహిళలకు కుటుంబ నిర్వహణ అనే బాధ్యత అదనంగా ఉంటుందని చెప్పారు. కుటుంబ నిర్వహణలో మహిళలు ఎంత చక్కగా రాణిస్తే ఆ కుటుంబంలోని పురుషులు అంతా స్థాయికి ఎదిగి కుటుంబ గౌరవం సమాజంలో వెలుగొందుతుందని వివరించారు.

ప్రతి మహిళ తన చుట్టూ ఉన్న పరిసరాలను ప్రభావితం చేసేలా ఉన్నత స్థాయికి ఎదగాలని చెప్పారు. మాయమాటలతో మన చుట్టూ జరిగే దుర్మార్గమైన మతమార్పిడి వ్యవస్థకు అడ్డుకట్ట వేయాలన్నారు. దాదాపు 310 మంది మహిళలు, విద్యార్థినులు, యువతులు ఈ వికాస శిబిరానికి హాజరు కావడం గొప్ప విశేషమని అభిప్రాయపడ్డారు. ఈ ఐక్యత పరంపరను ముందుకు కొనసాగించాలని సూచించారు. కార్యక్రమంలో పలు అంశాలపై అవగాహన కల్పించి హిందుత్వ భావనను నింపారు.

మహిళా సురక్ష.. ఆదర్శ హిందూ కుటుంబ జీవన విధానం.. దుర్గా వాహిని స్థాపన.. కార్యకర్త అనే అంశాలపై చర్చించారు.

సమావేశంలో విశ్వహిందూ పరిషత్ జోగులాంబ గద్వాల జిల్లా అధ్యక్షులు పనిమోహన్ రావు, దుర్గా వాహిని జిల్లా కన్వీనర్ మమత, విశ్వహిందూ పరిషత్ జిల్లా కోశాధికారి బురుజుల ఆనంద్, జిల్లా ఉపాధ్యక్షులు వీరన్న, జిల్లా సత్సంగ్ ప్రముఖ్ మల్లికార్జున్ సాకరే, గద్వాల నగర ప్రఖండ అధ్యక్షులు విజయకుమార్, ధర్మ ప్రసార్ జిల్లా సంయోజక్ జగదీశ్వర్ రెడ్డి, మాతృ శక్తి ప్రఖండ అధ్యక్షురాలు రేఖ, నాయకులు మనోజ్ కుమార్ రెడ్డి, జనార్ధన్, తదితరులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE